Sunday, February 9, 2020

Telugu Murli 10/02/2020

10-02-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - భారతదేశము ఇప్పుడు మళ్లీ స్వర్గంగా తయారవుతూ ఉంది, స్వర్గ రచయిత( హెవెన్లీ గాడ్‌ ఫాదర్‌) వచ్చి ఉన్నారనే సంతోషకరమైన వార్త అందరికీ వినిపించండి ''

ప్రశ్న :- మేము స్వర్గానికి యజమానులుగా అవుతామనే సంతోషము గల పిల్లల గుర్తులేవి ?
జవాబు :- వారి ఆంతరికములో ఏ విధమైన దుఃఖము కలుగదు. '' మేము చాలా గొప్ప వ్యక్తులము, మమ్ములను అనంతమైన తండ్రి ఇలా(లక్ష్మీనారాయణులుగా)తయారు చేస్తారనే నషా వారికుంటుంది.'' వారి నడవడిక చాలా శ్రేష్ఠంగా ఉంటుంది. వారు ఇతరులకు సంతోషకరమైన వార్త వినిపించకుండా ఉండలేరు.

ఓంశాంతి. ముఖ్యంగా భారతదేశానికి, మొత్తం మీద ప్రపంచమంతటికీ ఈ సందేశాన్ని అందించాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరందరూ సందేశకులే, చాలా సంతోషకరమైన ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి - ఇప్పుడు భారతదేశము మళ్లీ స్వర్గంగా తయారవుతూ ఉంది అనగా స్వర్గ స్థాపన జరుగుతూ ఉంది. ఎవరినైతే స్వర్గ రచయిత(హెవెన్లీ గాడ్‌ఫాదర్‌) అని అంటారో వారే భారతదేశములో స్వర్గ స్థాపన చేసేందుకు వచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను అందరికీ బాగా వినిపించమని పిల్లలైన మీకు డైరక్షన్‌ ఉంది. ప్రతి ఒక్కరికి తమ ధర్మాన్ని గురించిన ప్రశస్తత ఉంది అనగా వారు దానిని గౌరవిస్తారు. మీకు కూడా మీ ధర్మము పై అలాంటి ప్రశస్తత ఉంది, అందుకే మీరు భారతదేశములో సూర్యవంశీ దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతూ ఉందని అనగా భారతదేశము మళ్లీ స్వర్గంగా తయారవుతూ ఉందనే శుభ సందేశాన్ని అందరికీ వినిపిస్తారు. ఇప్పుడు మేము స్వర్గానికి యజమానులుగా అవుతామనే సంతోషము ఆంతరికములో ఉండాలి. ఎవరికైతే ఆంతరికములో ఈ ఖుషీ ఉంటుందో వారికి ఏ రకమైన దుఃఖము కలుగదు. నూతన ప్రపంచ స్థాపన జరగడంలో తప్పకుండా కష్టము కూడా ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. అబలల పై ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి. మేము భారతదేశానికి అనంతమైన ఈ ఖుష్‌ఖబరీ ( సంతోషకరమైన వార్త ) వినిపిస్తున్నామనే స్మృతి సదా పిల్లలకు ఉండాలి. ''సోదరీ - సోదరులారా! అందరూ వచ్చి ఈ శభ సందేశము వినండి'' అని ఈ బాబా కరపత్రాలు అచ్చు వేయించారు. ఈ సందేశాన్ని అందరికీ ఎలా వినిపించాలని రోజంతా ఆలోచన నడుస్తూ ఉంటుంది. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వము ఇచ్చేందుకు వచ్చారు. ఈ లక్ష్మీనారాయణుల చిత్రమును చూస్తూ రోజంతా హర్షితంగా ఉండాలి. మీరు చాలా గొప్పవారు కనుక మీ నడవడికలు ఆటవికంగా(జంగలీగా, మొరటుగా) ఉండరాదు. మనము కోతులకంటే హీనంగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు బాబా మనలను ఇటువంటి దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు. కనుక మీకు ఎంత సంతోషముండాలి. కానీ ఆశ్చర్యమేమంటే పిల్లలకు అంత సంతోషము ఉండదు. ఉత్సాహముతో అందరికీ సంతోషకరమైన వార్తను కూడా వినిపించరు. తండ్రి మిమ్ములను సందేశకులు(మెసెంజర్‌/వీవరరవఅస్త్రవతీ)గా చేశారు. అందరి చెవులకు ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉండండి. తమ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఎప్పుడు రచింపబడిందో, అది ఇప్పుడు ఏమయిందో భారతీయులకు తెలియనే తెలియదు. ఇప్పుడు కేవలం ఆ ధర్మానికి సంబంధించిన చిత్రాలు, బొమ్మలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి. కేవలం ఆది సనాతన దేవీ దేవతా ధర్మము మాత్రమే లేదు. ఇప్పుడు ఆ ధర్మాన్ని బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు. కనుక ఇప్పుడు మీరు అందరికీ ఈ సంతోషకరమైన వార్తను వినిపించండి. అలా చేస్తే మీకు కూడా ఆంతరికములో చాలా సంతోషముంటుంది. మీరు వచ్చి అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వము తీసుకోండి అని ప్రదర్శనీలో ఈ సంతోషకరమైన వార్తను వినిపిస్తారు కదా. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులు కదా. అయితే వారిప్పుడు ఎక్కడికెళ్ళారు? ఈ విషయము ఎవ్వరూ అర్థము చేసుకోరు. కనుక ముఖము మనుష్యులది, స్వభావము కోతులవి అని చెప్పబడ్తుంది. ఇప్పుడు మీ ముఖము మనుష్యులది స్వభావము దేవతల వలె తయారవుతూ ఉంది. మనము మళ్లీ సర్వ గుణ సంపన్నంగా అవుతామని మీకు తెలుసు. ఇతరులచే కూడా ఈ పురుషార్థము చేయించాలి. ప్రదర్శని సేవ చాలా మంచిది. ఎవరికైతే గృహస్థ వ్యవహార బంధనము లేదో, వానప్రస్థులుగా ఉన్నారో లేక విధవలుగా ఉన్నారో, కుమారీలుగా ఉన్నారో వారికి సేవ చేసేందుకు ఇది చాలా మంచి అవకాశము. సేవలో తత్పరులైపోవాలి. ఈ సమయంలో వివాహము చేసుకోవడం అనగా నాశనం చేసుకోవడమే. వివాహము చేసుకోకుండా ఉండడం మంచిది. తండ్రి చెప్తున్నారు - ఈ మృత్యులోకమైన పతిత ప్రపంచ వినాశనము జరుగుతూ ఉంది. మీరు పావన ప్రపంచములోకి వెళ్ళాలంటే ఈ సేవలో లగ్నమవ్వండి. ఒక ప్రదర్శని తర్వాత మరొకటి చేస్తూ ఉండాలి. ఎవరైతే సేవాధారి పిల్లలుగా ఉంటారో వారికి సేవ చేయు ఆసక్తి చాలా ఉంటుంది. మేము ఉద్యోగము వదలమంటారా? అని కొంతమంది బాబాను అడుగుతారు. అర్హులుగా ఉంటే భలే సేవ చేయమని అనుమతినిస్తారు. ఇటువంటి సంతోషకరమైన వార్త అందరికీ వినిపించాలి. తండ్రి చెప్తున్నారు - మీరు వచ్చి మీ రాజ్య భాగ్యమును తీసుకోండి. మీరు 5000 సంవత్సరాల క్రితము రాజ్యభాగ్యము తీసుకున్నారు, ఇప్పుడు మళ్లీ తీసుకోండి. కేవలం నా మతమును అనుసరించండి.
మాలో ఏ అవగుణాులు ఉన్నాయి? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మీరు ఈ బ్యాడ్జిల ద్వారా చాలా సేవ చేయవచ్చు - ఇది చాలా ఫస్ట్‌క్లాస్‌ సాధనము. భలే దీని ఖరీదు తక్కువ కావచ్చు, కానీ దీని ద్వారా చాలా ఉన్నత పదవి పొందవచ్చు. మనుష్యులు చదువుకునేందుకు పుస్తకాలు మొదలైన వాటి పై ఎంత ఖర్చు చేస్తారు! ఇక్కడ పుస్తకాలు మొదలైనవాటి అవసరమే లేదు. కేవలం అందరి చెవులకు ఈ సందేశమును అందించాలి, ఇది తండ్రి తెలిపిన సత్యమైన మంత్రము. మిగిలినవారంతా అసత్య మంత్రాలను ఇస్తూ ఉంటారు. అసత్యమైన(నకిలీ) వస్తువుకు విలువ ఉండదు. వజ్రాలకు విలువ ఉంది కాని రాళ్లకు ఉండదు. ఒక్కొక్క మహావాక్యము లక్షల విలువ గలది అని గాయనము దేనికైతే ఉందో ఆ గాయనం ఈ జ్ఞానము కొరకే. తండ్రి చెప్తున్నారు - శాస్త్రములైతే అనేకమున్నాయి. మీరు అర్ధకల్పము నుండి వాటిని చదువుతూ వచ్చారు. కాని వాటి ద్వారా ఏమీ లభించలేదు. ఇప్పుడు మీకు బాబా జ్ఞాన రత్నాలనిస్తున్నాను. వారిది శాస్త్రాల అథారిటి. తండ్రి జ్ఞానసాగరులు. వీరి ఒక్కొక్క మహావాక్యము లక్షల - కోట్ల రూపాయల విలువ గలది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. అక్కడకు వెళ్ళి పదమాపతులుగా అవుతారు. మహిమ ఈ జ్ఞానానికే ఉంది. వారు శాస్త్రాలు మొదలైనవి చదువుతూ నిరుపేదలుగా అయిపోయారు. కనుక ఇప్పుడు ఈ జ్ఞాన రత్నాలను దానము కూడా చేయాలి. తండ్రి చాలా సహజమైన యుక్తులు తెలియచేస్తున్నారు. మీరు మీ ధర్మాన్ని మరచి బయట వెతుకుతూ ఉన్నారని చెప్పండి. భారతీయులైన మీది ఆది సనాతన దేవిదేవతా ధర్మము, అది ఇప్పుడు ఏమయింది? 84 లక్షల యోనులు అన్నందున ఏ విషయమూ బుద్ధిలో నిలువదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు, 84 జన్మలు తీసుకున్నారు. ఈ లక్ష్మీ నారాయణులు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారే కదా. వారిప్పుడు ధర్మభ్రష్ఠులు, కర్మభ్రష్ఠులుగా అయిపోయారు. ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి కాని ఈ ఆది సనాతన ధర్మము లేనే లేదు. ఈ ధర్మము ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. ఎంత సహజము. వీరు తండ్రి, వీరు దాదా(అన్న). ప్రజాపిత బ్రహ్మ ఉన్నాడు కనుక బ్రహ్మకుమారీ-కుమారులు అనేకమంది తప్పకుండా ఉంటారు కదా. తండ్రి వచ్చి రావణుని జైలు నుండి, శోకవాటిక నుండి విడిపిస్తారు. శోకవాటికకు అర్థము ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు - ఇది శోక ప్రపంచము, దు:ఖ ప్రపంచము. అది సుఖ ప్రపంచము. మీరు మీ శాంతి ప్రపంచాన్ని, సుఖ ప్రపంచాన్ని స్మృతి చేస్తూ ఉండండి. నిరాకార(ఇన్‌కార్పోరియల్‌/Iఅషశీతీజూశీతీవaశ్రీ) ప్రపంచమని అంటారు కదా. ఇంగ్లీష్‌ పదాలు చాలా బాగున్నాయి. ఇంగ్లీష్‌ కొనసాగుతూ వస్తూనే ఉంది. ఇప్పుడు అనేక భాషలైపోయాయి. మనుష్యులు ఏమీ అర్థము చేసుకోరు. ఇప్పుడు నిర్గుణ బాలల సంస్థ అని అంటారు. నిర్గుణము అనగా ఏ గుణమూ లేదని అర్థము. ఈ పేరుతోనే ఒక సంస్థను కూడా తయారుచేశారు. నిర్గుణానికి అర్థము కూడా తెలియదు. అర్థము లేకుండా పేర్లు పెట్టేస్తారు. ఇటువంటివి లెక్కలేనన్ని సంస్థలున్నాయి. భారతదేశములో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మ సంస్థ ఉండేది, అప్పుడు ఏ ఇతర ధర్మాలు లేవు. కాని మనుష్యులు 5000 సంవత్సరాలకు బదులు కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. కనుక మీరు అందరినీ ఈ అజ్ఞాన అంధకారము నుండి వెలికి తీయాలి, సేవ చేయాలి. భలే ఇది తయారైన డ్రామా కాని శివబాబా యజ్ఞము నుండి తింటూ, త్రాగుతూ సేవ చేయకుంటే బాబాకు కుడిభుజంగా ఉన్న ధర్మరాజు తప్పకుండా శిక్షిస్తారు కనుక హెచ్చరిస్తున్నారు. సేవ చేయడం చాలా సులభము. అందరికీ చాలా ప్రీతిగా అర్థం చేయిస్తూ ఉండండి. మేము మందిరానికి వెళ్ళాము, గంగానదీ తీరానికి వెళ్లాము అని శివబాబా వద్దకు కొంతమంది నుండి సమాచారము అందుతుంది. ఉదయమే లేచి మందిరాలకు వెళ్తే ధార్మిక బుద్ధి గలవారికి అర్థం చేయించడం సులభంగా ఉంటుంది. అన్నిటికంటే లక్ష్మీనారాయణుల మందిరాలలో సేవ చేయడం చాలా మంచిది. వారిని అలా తయారు చేయువారు శివబాబా. కనుక అక్కడకు వెళ్ళి వారికి అర్థం చేయించండి. ఈ అడవికి అగ్ని అంటుకుంటుంది, ఇవన్నీ సమాప్తమైపోతాయి తర్వాత మీ పాత్ర కూడా పూర్తి అవుతుంది. మీరు వెళ్ళి రాచకులములో జన్మ తీసుకుంటారు. పోను పోను రాజ్యము ఎలా లభిస్తుందో తెలిసిపోతుంది. డ్రామాలో అన్ని విషయాలు ముందే వినిపించరు. అక్కడ ఏ పదవి పొందుకుంటారో మీరే తెలుసుకుంటారు. ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు రాజకుటుంబములో వస్తారు కదా. రాజుల వద్ద చాలా ధనముంటుంది. ఇప్పుడు మీరు అవినాశి జ్ఞానరత్నాలను దానము చేస్తారు.
ఈ జ్ఞానము భారతదేశ వాసుల కొరకే. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతూ ఉందని, పతితుల నుండి పావనంగా తయారు చేయు తండ్రి వచ్చారని, వారు నన్ను స్మృతి చేయమని చెప్తున్నారని అందరికీ తెలపండి. ఇది ఎంత సహజము కానీ ఎంత తమోప్రధాన బుద్ధిగా ఉన్నారంటే కొంచెము కూడా ధారణ జరగదు, వికారాలు ప్రవేశమై ఉన్నాయి. జంతువులు కూడా రకరకాలుగా ఉంటాయి, కొన్నింటిలో క్రోధము ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క జంతువు స్వభావము ఒక్కొక్క రీతిగా ఉంటుంది. రకరకాల దు:ఖమిచ్చే స్వభావాలు ఉంటాయి. అన్నింటికంటే ముందు దు:ఖమిచ్చే వికారము - కామ ఖడ్గమును ఉపయోగించడం. రావణరాజ్యములో ఉండేదే వికారాల రాజ్యము. తండ్రి ప్రతి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. మంచి మంచి కన్యలు ఎంతోమంది పాపం ఖైదు(బంధనము)లో ఉన్నారు, వారిని బంధనములో ఉన్నవారని అంటారు. వాస్తవానికి వారిలో జ్ఞానము అత్యున్నత స్థితిలో ఉంటే వారిని ఎవ్వరూ బంధించలేరు. కాని మోహ పాశాలు చాలా ఉన్నాయి. సన్యాసులకు కూడా తమ ఇల్లు-వాకిలి గుర్తుకొస్తూ ఉంటుంది, చాలా కష్టంగా ఆ పాశము తెగిపోతుంది. ఇప్పుడు మీరు బంధు-మిత్రులు మొదలైన వారందరిని మర్చిపోవాలి. ఎందుకంటే ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. పవిత్రంగా అవ్వాలి. 84 జన్మల పాత్రను అభినయించే తీరాలి. మధ్యలో ఎవ్వరూ వాపసు వెళ్ళలేరు. ఇప్పుడు నాటకం పూర్తి అయింది. కనుక పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. ఇప్పుడు మనము మన ఇంటికి తప్పకుండా తిరిగి వెళ్ళాలి. పాత్ర పూర్తి అయింది, బాబాను చాలా స్మృతి చేయాలనే ఉత్కంఠత ఉండాలి. స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ఇంటికి వెళ్ళి మళ్లీ సుఖధామములోకి వస్తారు. చాలామంది ఈ ప్రపంచము నుండి త్వరగా వెళ్ళిపోవాలని భావిస్తారు. కాని ఎక్కడకు వెళ్తారు? మొదట ఉన్నత పదవి పొందేందుకు శ్రమ చేయాలి కదా. మేము ఎంతవరకు అర్హులుగా అయ్యామని మీ నాడిని మీరే చూసుకోవాలి. స్వర్గములోకి వెళ్లి ఏం చేస్తారు? మొదట అర్హులుగా తయారవ్వాలి కదా. పిల్లలను చూసి భగవంతుడు ఈ పిల్లలు చాలా బాగున్నారు, సేవ చేసేందుకు అర్హులుగా ఉన్నారని చెప్తారు. కొంతమంది అర్హులుగా లేరని కూడా చెప్తారు. అనవసరంగా తమ పదవిని కూడా భ్రష్ఠము చేసుకుంటారు. తండ్రి సత్యమునే చెప్తారు కదా. పతితపావనా! రండి, సుఖధామానికి యజమానులుగా చేయండి అని పిలుస్తారు. అపారమైన సుఖమునివ్వమని వేడుకుంటారు కదా. ఏదైనా కొంత సేవ చేసేందుకు అర్హులుగా అవ్వండని తండ్రి చెప్తారు. ఎవరైతే నా భక్తులుగా ఉన్నారో వారికి ఇప్పుడు శివబాబా వారసత్వము ఇస్తున్నారని సంతోషకరమైన వార్త వినిపించండి. నన్ను స్మృతి చేసి పవిత్రులుగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారని వారు చెప్తున్నారు. ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకోనుంది. మీ ఎదుట ఉన్న ఈ(లక్ష్మీనారాయణులు) లక్ష్యమును చూచినందున మీకు చాలా సంతోషముంటుంది - మేము ఇలా తయారవ్వాలని గుర్తుంటుంది. రోజంతా బుద్ధిలో ఇది గుర్తుంటే ఎప్పుడూ ఎలాంటి దుష్ట కర్మలు జరగవు. నేను ఇలా తయారవుతున్నాను కదా, ఇటువంటి ఉల్టా పని ఎలా చేయగలనని ఆలోచిస్తారు. అయితే అదృష్టములో లేకుంటే ఇటువంటి యుక్తులు కూడా రచించరు, తమ సంపాదన కూడా చేసుకోరు. ఈ సంపాదన ఎంత మంచిది. ఇంట్లో కూర్చొని అందరూ ఈ సంపాదన చేసుకోవాలి, ఇతరలకు కూడా చేయించాలి. ఇంటిలో కూర్చొని ఈ స్వదర్శన చక్రము తిప్పండి, ఇతరులను కూడా స్వదర్శన చక్రధారులుగా చేయండి. ఎంత ఎక్కువమందిని తయారు చేస్తారో, అంత మీ పదవి శ్రేష్ఠమవుతుంది. ఈ లక్ష్మీనారాయణుల వలె అవ్వగలరు, మీ లక్ష్యము ఇదే కదా. సూర్యవంశీయులుగా అవ్వడంలోనే అందరూ చేతులెత్తుతారు. ఈ చిత్రాలు కూడా ప్రదర్శనిలో చాలా ఉపయోగపడ్తాయి. ఈ చిత్రాల ద్వారా అర్థము చేయించాలి. అత్యంత ఉన్నతమైన తండ్రి ఏదైతే వినిపిస్తారో, అదే మేము వింటాము. భక్తిమార్గములోని మాటలు వినడం మాకు ఇష్టము లేదని చెప్పండి. ఈ చిత్రాలు చాలా మంచివి. వీటిని ఉపయోగించి మీరు చాలా సేవ చేయవచ్చు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మేము ఎంతవరకు అర్హులుగా అయ్యామని మీ నాడి మీరే చూసుకోండి. అర్హులుగా అయి సేవకు ఋజువునివ్వాలి. జ్ఞాన పరాకాష్ఠ(చరమసీమ)తో బంధనముక్తులుగా అవ్వాలి.
2. ఒక్క తండ్రి మతమును అనుసరిస్తూ ఆంతరికములోని అవగుణాలను తొలగించుకోవాలి. దు:ఖము కలిగించే స్వభావాన్ని వదిలి సుఖమునిచ్చే వారిగా అవ్వాలి. జ్ఞానరత్నాలను దానము చేయాలి.

వరదానము :- '' స్థిరమైన భావి(భవిష్యత్తు) తెలిసినా, శ్రేష్ఠ కార్యానికి ప్రత్యక్ష రూపమునిచ్చే సదా సమర్థ్‌ భవ ''
నూతన శ్రేష్ఠమైన విశ్వము తయారయ్యే భవిష్యత్తు స్థిరంగా ఉన్నా 'సమర్థ భవ' అను వరదానము పొందిన పిల్లలు కేవలం కర్మ మరియు ఫలము, పురుషార్థము మరియు ప్రాలబ్ధము, నిమిత్తము మరియు నిర్మానాల కర్మ సిద్ధాంతానుసారము నిమిత్తంగా ఉండి కార్యాలు చేస్తారు. ప్రపంచంలోని వారికి నమ్మకము, ఆశ కనిపించదు. కానీ మీరు ఈ కార్యము అనేకసార్లు జరిగిందని, ఇప్పుడు కూడా జరిగే ఉందని అంటారు. ఎందుకంటే స్వ పరివర్తన జరగడమే ప్రత్యక్ష ప్రమాణము. దీని ముందు ఇతర ఋజువులు అవసరమే లేదు. అందుకు తోడు పరమాత్మ కార్యము సదా సఫలమయ్యే ఉంది.

స్లోగన్‌ :- '' తక్కువగా చెప్పి , ఎక్కువగా చేయాలనే లక్ష్యము మహాన్‌గా చేస్తుంది ''

No comments:

Post a Comment