Thursday, December 19, 2019

Telugu Murli 20/12/2019

20-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - సర్వ ఖజానాలతో మిమ్ములను సంపన్నంగా చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు కేవలం ఈశ్వరీయ మతమును అనుసరించండి, బాగా పురుషార్థము చేసి వారసత్వము తీసుకోండి, మాయతో ఓడిపోకండి. ''

ప్రశ్న :- ఈశ్వరీయ మతము, దైవీ మతము మరియు మనుష్య మతాలకు గల ముఖ్యమైన వ్యత్యాసమేది?
జవాబు :- ఈశ్వరీయ మతము ద్వారా పిల్లలైన మీరు వాపసు మీ ఇంటికి వెళ్తారు, మళ్లీ నూతన ప్రపంచములో ఉన్నత పదవిని పొందుతారు. దైవీ మతము ద్వారా మీరు సదా సుఖంగా ఉంటారు. ఎందుకంటే అది కూడా తండ్రి ద్వారా ఈ సమయములోనే లభించిన మతము. అయితే మళ్లీ క్రిందకు దిగుతారు. మానవ మతము మిమ్ములను దుఃఖితులుగా చేస్తుంది. ఈశ్వరీయ మతమును అనుసరించేందుకు మొట్టమొదట చదివించే తండ్రి పై పూర్తి నిశ్చయముండాలి.

ఓంశాంతి. తండ్రి అర్థమునైతే తెలిపించారు. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. ఓంశాంతి అన్నప్పుడు ఆత్మకు తన ఇల్లు గుర్తుకొస్తుంది. నేను ఆత్మ, శాంతి స్వరూపాన్ని తర్వాత కర్మేంద్రియాలు లభించినప్పుడు శబ్ధము(టాకీ)లోకి వస్తుంది. మొదట కర్మేంద్రియాలు చిన్నవిగా ఉంటాయి తర్వాత కర్మేంద్రియాలు పెద్దవిగా అవుతాయి. ఇప్పుడు పరమపిత పరమాత్మ నిరాకారుడు. మాట్లాడాలంటే వారికి కూడా రథము కావాలి. ఆత్మలైన మీరు ఎలాగైతే పరంధామములో ఉండి, ఇక్కడకు వచ్చి టాకీగా అవుతారో అలాగే తండ్రి కూడా చెప్తున్నారు - మీకు జ్ఞానము ఇచ్చేందుకు నేను కూడా టాకీగా అయ్యాను. తండ్రి తన పరిచయాన్ని, తన రచన ఆదిమధ్యాంతాల పరిచయాన్ని ఇస్తున్నారు. ఇది ఆత్మిక చదువు, అది భౌతికమైన శారీరిక చదువు. వారు స్వయాన్ని శరీరంగా భావిస్తారు. మనము ఆత్మలము, ఈ చెవుల ద్వారా వింటున్నామని ఇతరులెవ్వరూ చెప్పరు. ఆ తండ్రి పతితపావనులని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. వారే వచ్చి స్వయంగా, వారెలా వస్తారో అర్థం చేయిస్తున్నారు. మీ వలె నేను గర్భములో ప్రవేశించను. నేను ఇతనిలో ప్రవేశిస్తాను. ఇక ఏ ప్రశ్నలు రావు. ఇది నా రథము. ఇతనిని తల్లి అని కూడా అంటారు. అన్నింటికంటే పెద్ద నది బ్రహ్మపుత్ర. ఇది అన్నింటికంటేె పెద్ద నది, కాని నీటి నది కాదు. ఇది మహానది అనగా అన్నింటికంటేె పెద్ద జ్ఞాన నది. కనుక తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు - నేను మీ తండ్రిని. మీరు ఎలా మాట్లాడుతున్నారో, నేను కూడా అలా మాట్లాడ్తున్నాను. నా పాత్ర అందరికంటేె చివరిలో ఉంది. మీరు పూర్తిగా పతితమైనప్పుడు, మిమ్ములను పావనంగా చేసేందుకు నేను రావలసి వస్తుంది. ఈ లక్ష్మీనారాయణులను ఇలా తయారు చేసిందెవరు? ఈశ్వరుడు తప్ప ఇతరులెవ్వరూ చేయలేరు. అనంతమైన తండ్రియే స్వర్గానికి యజమానులుగా చేసి ఉంటారు కదా. ఆ తండ్రియే జ్ఞానసాగరులు. నేను ఈ మానవ సృష్టికి చైతన్యమైన బీజమునని వారే చెప్తారు. ఆదిమధ్యాంతాలు నాకు తెలుసు. నేను సత్యమును, చైతన్య బీజరూపాన్ని. ఈ సృష్టి వృక్ష జ్ఞానము నాలో మాత్రమే ఉంది. దీనిని సృష్టి చక్రము లేక డ్రామా అని అంటారు. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఆ హద్దులోని డ్రామా(సినిమా) 2 గంటలు ఉంటుంది. ఈ డ్రామా రీలు 5 వేల సంవత్సరాలది. నమయము గడిచే కొలది 5 వేల సంవత్సరాల కంటే తక్కువవుతూ పోతుంది. మొదట మనము దేవీ దేవతలుగా ఉండేవారమని మీకు తెలుసు. నెమ్మది నెమ్మదిగా మనము క్షత్రియ కులములోకి వచ్చేశాము. ఈ రహస్యమంతా బుద్ధిలో ఉంది కదా. కనుక దీనిని స్మరిస్తూ ఉండాలి. మనమే మొదట పాత్రను అభినయించేందుకు వచ్చాము. కావున మనమే దేవీ దేవతలుగా ఉండేవారము. 1250 సంవత్సరాలు రాజ్యపాలన చేశాము. సమయము గడుస్తూ పోతుంది కదా. లక్షల సంవత్సరాలనే మాట లేనే లేదు. లక్షల సంవత్సరాల గురించి ఎవ్వరూ ఆలోచన కూడా చేయలేరు.

మనము దేవీ దేవతలుగా ఉండేవారమని తర్వాత పాత్ర చేస్తూ, సంవత్సరం తర్వాత సంవత్సరం గడుస్తూ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. నెమ్మది - నెమ్మదిగా సుఖము తగ్గిపోతూ వస్తుంది. ప్రతి వస్తువు సతోప్రధానంగా, సతో, రజో, తమోగా అవుతుంది. తప్పకుండా పాతవైపోతాయి. ఇది అనంతమైన విషయము. ఈ విషయాలన్నీ బుద్ధిలో బాగా ధారణ చేసి ఇతరులకు కూడా అర్థం చేయించాలి. అందరూ ఒకే విధంగా ఉండరు. తప్పకుండా అనేక విధాలుగా అర్థము చేయిస్తూ ఉంటారు. చక్రము గురించి అర్థం చేయించడం అన్నిటికంటే సులభము. డ్రామా మరియు వృక్షము - ఈ రెండు ముఖ్య చిత్ర్రాలు. కల్పవృక్షమనే పేరుంది కదా. కల్పము ఆయువు ఎన్ని సంవత్సరాలో ఎవ్వరికీ తెలియదు. మానవ మతాలు అనేకమున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ఇప్పుడు మీరు అనేక మనుష్యుల మతాల గురించి కూడా తెలుసుకున్నారు. అంతేకాక ఈ ఈశ్వరీయ మతమును గురించి కూడా అర్థం చేసుకున్నారు. ఎంత వ్యత్యాసముంది! ఈశ్వరీయ మతము ద్వారా మీరు మళ్లీ నూతన ప్రపంచములోకి వెళ్తారు. ఇతర ఏ మతాల ద్వారా గాని, దైవీ మతము లేక మానవ మతాల ద్వారా గాని వాపసు వెళ్ళలేరు. దైవీ మతము ద్వారా కూడా మీరు క్రిందికే దిగుతారు ఎందుకంటే కళలు తగ్గిపోతూ వస్తాయి. ఆసురీ మతము ద్వారా కూడా దిగిపోతారు. కానీ దైవీ మతములో సుఖముంది, ఆసురీ మతములో దుఃఖముంది. దైవీ మతము కూడా ఈ సమయములో ఆ తండ్రి ఇచ్చిందే. అందువలన మీరు సుఖంగా ఉంటారు. అనంతమైన తండ్రి ఎంతో దూరము నుండి వస్తారు. మనుష్యులు సంపాదన కొరకు విదేశాలకు వెళ్తారు. చాలా ధనము సంపాదించిన తర్వాత మళ్లీ వచ్చేస్తారు. తండ్రి కూడా చెప్తున్నారు - నేను పిల్లలైన మీ కొరకు చాలా ఖజానాలు తీసుకొస్తాను. ఎందుకంటే నేను మీకు చాలా ధనము(మాల్‌) ఇచ్చాను. అదంతా మీరు పోగొట్టుకున్నారు. వాస్తవానికి ఎవరైతే ప్రాక్టికల్‌గా పోగొట్టుకున్నారో, వారితోనే మాట్లాడ్తాను. 5 వేల సంవత్సరాల మాట మీకు గుర్తుంది కదా. అవును బాబా, 5 వేల సంవత్సరాల క్రితము మీతో కలుసుకున్నాను, మీరు వారసత్వము ఇచ్చారని అంటారు. బేహద్‌ తండ్రితో తప్పకుండా బేహద్‌ వారసత్వము తీసుకున్నామని మీకు గుర్తు వచ్చింది. బాబా! మీ నుండి నూతన ప్రపంచము యొక్క రాజ్య పదవిని వారసత్వంగా తీసుకున్నాను. మంచిదే, ఇప్పుడు మళ్లీ పురుషార్థము చేయండి. బాబా, మాయా భూతము మమ్ములను ఓడించిందని చెప్పకండి. దేహాభిమానానికి వశమైన తర్వాతనే మీరు మాయతో ఓడిపోతారు. లోభ వశమై లంచము తీసుకున్నారు. విధి లేని పరిస్థితి మాట వేరే. లోభము లేకుంటే కడుపుకు పూజ జరగదని బాబాకు తెలుసు. ఫర్వాలేదు. భలే తినండి కాని ఎక్కడైనా చిక్కుకొని మరణించకండి, మీరే దుఃఖపడ్తారు. ధనము లభిస్తే సంతోషంగా తింటారు. పోలీసులు పట్టుకుంటే జైలుకు వెళ్ళవలసి వస్తుంది. ఇలాంటి పనులు చేయకండి, దానికి నేను బాధ్యుడను కాదు. పాపము చేస్తే జైలుకు వెళ్తారు. అచ్చట జైళ్ళు మొదలైనవి ఉండవు. డ్రామా ప్లాను అనుసారము కల్పక్రితము ఏ వారసత్వము 21 జన్మలకు లభించిందో మళ్లీ అదే విధంగా తీసుకుంటారు. మొత్తం రాజధాని అంతా తయారవుతుంది. పేద ప్రజలు, ధని ప్రజలు. కాని అక్కడ దుఃఖము ఉండదు. ఈ తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. అందరూ ఒకే విధంగా తయారవ్వలేరు. సూర్య వంశ, చంద్ర వంశ రాజ్యములో అందరూ కావాలి కదా. తండ్రి మనకు విశ్వచక్రవర్తి పదవిని ఎలా ఇస్తున్నారో పిల్లలకు తెలుసు. మళ్లీ మనము క్రిందకు దిగిపోతాము. అంతా స్మృతికి వచ్చింది కదా? పాఠశాలలో చదువు గుర్తుంటుంది కదా. ఇక్కడ కూడా తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. ఈ ఆత్మిక చదువును మొత్తం ప్రపంచంలో మరెవ్వరూ చదివించలేరు. గీతలో కూడా '' మన్మనాభవ '' అని వ్రాయబడి ఉంది. దానిని మహామంత్రమని, వశీకరణ మంత్రమని అంటారు అనగా మాయ పై విజయము పొందే మంత్రము. మాయను జయిస్తే, జగత్తును జయిస్తారు. పంచ వికారాలనే మాయ అని అంటారు. రావణుని చిత్రము చాలా స్పష్టంగా ఉంది. 5 వికారాలు స్త్రీ లోనివి, 5 వికారాలు పురుషునిలోనివి. వాటి ద్వారా గాడిదగా అనగా టట్టూగా అయిపోతారు. అందువలన రావణుని పై గాడిద తలను చూపిస్తారు. జ్ఞానము లేనప్పుడు మనము కూడా అలాగే ఉండేవారమని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. తండ్రి కూర్చొని ఎంతో రమణీకంగా విషయాలను చదివిస్తారు. ఆయన సుప్రీమ్‌ టీచరు. వారి ద్వారా మనము ఏం చదువుకుంటున్నామో దానిని మళ్లీ ఇతరులకు వినిపిస్తాము. మొదట చదివించే వారిలో నిశ్చయము చేయించాలి. ఆ తండ్రి మాకు ఈ విషయాలు అర్థం చేయించారని చెప్పండి. మీరు వింటారో, వినరో మీ ఇష్టము. వీరు అనంతమైన తండ్రి కదా. శ్రీమతమే శ్రేష్ఠంగా చేస్తుంది. కనుక శ్రేష్ఠమైన నూతన ప్రపంచము కూడా తప్పకుండా కావాలి కదా.

మనము మురికి(కిచడా) ప్రపంచములో ఉన్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇతరులెవ్వరూ అర్థము చేసుకోలేరు. అక్కడ మనము స్వర్గములో(బహిస్త్‌), వైకుంఠములో సదా సుఖంగా ఉంటాము. ఇక్కడ నరకంలో ఎంతో దుఃఖములో ఉన్నారు. దీనిని నరకము అనండి లేక విషయవైతరణి నది అనండి, పేరు ఏదైనా, ఇది పాత ఛీ - ఛీ ప్రపంచము. సత్యయుగ స్వర్గమెక్కడ, కలియుగ నరకమెక్కడ? అని మీరిప్పుడు ఫీల్‌ చేస్తారు. స్వర్గమును అద్భుతమైన ప్రపంచమని ( వండర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌) అంటారు. త్రేతా యుగమును కూడా అలా అనరు. ఇక్కడ ఈ మురికి ప్రపంచములో ఉండేందుకు మనుష్యులకు ఎంత ఖుషీ కలుగుతుంది. పేడ పురుగును భ్రమరము భూ-భూ అంటూ తన సమానంగా చేస్తుంది. మీరు కూడా బురదలో పడి ఉండినారు. నేను వచ్చి భూ-భూ చేసి మిమ్ములను పురుగుల నుండి అనగా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేశాను. ఇప్పుడు మీరు డబుల్‌ కిరీటధారులుగా అవుతారు. కనుక మీకు ఎంత ఖుషీ ఉండాలి! పురుషార్థము కూడా పూర్తిగా చేయాలి. అనంతమైన తండ్రి తెలిపే జ్ఞానము చాలా సులభమైనది. తండ్రి సత్యంగా చెప్తున్నారని హృదయానికి తెలుస్తుంది. ఇప్పుడందరూ మాయ అనే ఊబిలో చిక్కుకొని ఉన్నారు. వెలుపలి ఆడంబరము(షో) చాలా ఎక్కువగా ఉంది. బాబా అర్థం చేయిస్తున్నారు - నేను వచ్చి మిమ్ములను ఊబి నుండి రక్షించి స్వర్గములోకి తీసుకెళ్తాను. స్వర్గమనే పేరు విన్నారు. ఇప్పుడు స్వర్గము లేనే లేదు. కేవలం దాని చిత్రము మాత్రమే ఉంది. స్వర్గానికి యజమానులైన వీరు చాలా ధనవంతులుగా ఉండేవారు. భలే భక్తి మార్గములో ప్రతి రోజు మందిరాలకు వెళ్ళేవారు. కాని ఈ జ్ఞానము ఏ మాత్రము లేదు. భారతదేశములో ఆదిసనాతన దేవీ దేవతా ధర్మము ఉండేదని, వీరి రాజ్యము ఎప్పుడు ఉండేదో ఇప్పుడు మీకు అర్థమయింది. ఇది మరెవ్వరికీ తెలియదు. దేవీదేవతా ధర్మానికి బదులు హిందువులమని అంటున్నారు. ప్రారంభములో హిందూ మహాసభ అధ్యక్షులు వచ్చారు, మనము వికారీ అసురులము, స్వయాన్ని దేవతలమని ఎలా పిలుచుకుంటాము? మీరు వస్తే, దేవీ దేవతా ధర్మ స్థాపన మళ్లీ ఎలా జరుగుతోందో అర్థం చేయిస్తామని, మేము మిమ్ములను స్వర్గానికి అధికారులుగా చేస్తాము, కూర్చొని నేర్చుకోండి అని పిల్లలు చెప్పారు. అందుకు ఆ ప్రెసిడెంటు, దాదాగారూ మాకు తీరిక ఎక్కడుంది? అని జవాబిచ్చారు. తీరిక లేకుంటే దేవతలుగా ఎలా అవుతారు? ఇది చదువు కదా. పాపం వారి అదృష్టములో లేదు, చనిపోయాడు. అలాగని వారు ప్రజలలోకి వస్తారని కాదు. అలా రారు. ఊరికే అలా వచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ పవిత్రంగా అయ్యేందుకు జ్ఞానము లభిస్తుందని విని వచ్చాడు. అయితే సత్యయుగములోకి రాలేడు. మళ్లీ హిందూ ధర్మములోకే వస్తాడు.

మాయ చాలా ప్రబలమైనదని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఏదో ఒక తప్పు చేయిస్తూ ఉంటుంది. ఏదైనా ఎప్పుడైనా విరుద్ధమైన పాపము జరిగితే తండ్రికి సత్యమైన హృదయముతో వినిపించాలి. రావణ ప్రపంచములో పాపాలు జరుగుతూనే ఉంటాయి. అనేక జన్మల పాపులమని అంటూ ఉంటారు. ఇది ఎవరు అన్నారు? ఆత్మనే చెప్తుంది. తండ్రి ముందు లేక దేవతల ముందుకెళ్ళి ఆత్మనే ఇలా అంటుంది. జన్మ-జన్మల నుండి మనము తప్పకుండా పాపము చేస్తూ వచ్చామని ఇప్పుడు మీరు ఫీల్‌ చేస్తున్నారు. రావణ రాజ్యములో మీరు పాపాలు తప్పకుండా చేశారు. అనేక జన్మల నుండి చేసిన పాపాలనైతే వర్ణించలేరు. ఈ జన్మలోనివి వర్ణించగలరు. అవి వినిపించినా తేలికగా అవుతారు. సర్జన్‌ ముందు, జబ్బు ఏమిటో వినిపించాలి. ఫలానావారిని చంపాను, దొంగతనము చేశాను, ఇలా వినిపించేందుకు సిగ్గుపడరు, కాని వికారాల గురించి వినిపించేందుకు సిగ్గుపడ్తారు. సర్జన్‌ ముందు సిగ్గుపడ్తే జబ్బు ఎలా బాగవుతుంది? చెప్పకపోతే లోపల మనసును తింటూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేయలేరు. సత్యము వినిపిస్తే స్మృతి చేయగలరు. తండ్రి అంటున్నారు - నేను సర్జన్‌ను. మీకు ఎన్ని మందులు ఇస్తున్నాను? మీ శరీరము సదా కంచనంగా అవుతుంది. సర్జన్‌కు తెలిపినందున తేలికైపోతారు. కొంతమంది వారంతకు వారే వ్రాస్తారు - బాబా, మేము జన్మ-జన్మంతరాలు పాపము చేశాము. పాపాత్మల ప్రపంచములో పాపాత్మలుగానే అయ్యాము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, పాపాత్మలతో ఇచ్చి పుచ్చుకునే వ్యవహారము చేయరాదు. ఈ తండ్రి సత్యమైన సద్గురువు, అకాలమూర్తి. వారెప్పుడూ పునర్జన్మ తీసుకోరు. వారు అకాలతక్త్‌(అకాలసింహాసనము) అని పేరుంచారు, కానీ వారికి అర్థము తెలియదు. తండ్రి అర్థం చేయించారు - ఇది ఆత్మల సింహాసనము. భృకుటిలోనే శోభిస్తుంది, తిలకము కూడా ఇక్కడే ఉంచుకుంటారు కదా. (తిలకము కూడా ఇక్కడే దిద్దుకుంటారు కదా). నిజానికి తిలకము ఒక బిందువు వలె ఉంచుకునేవారు. ఇప్పుడు మీకు మీరే తిలకమిచ్చుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఎవరైతే చాలా సర్వీసు చేస్తారో, వారు పెద్ద మహారాజులుగా అవుతారు. నూతన ప్రపంచములో పాత ప్రపంచములోని చదువును చదవరు. అందువలన ఇంత ఉన్నతమైన చదువు పై చాలా అటెన్షన్‌ ఇవ్వాలి. ఇక్కడ కూర్చొని ఉన్నా కొంతమంది బుద్ధియోగము బాగుంటుంది, కొంతమందిది ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంది. కొందరు 10 నిమిషాలు, కొంతమంది 15 నిమిషాలని వ్రాస్తారు. ఎవరి చార్టు బాగుంటుందో వారికి నషా ఎక్కుతుంది. బాబా, ఇంత సమయము మేము మీ స్మృతిలో ఉన్నాము. 15 నిమిషాల కంటే ఎక్కువ సమయము మేము మీ స్మృతిలో ఉన్నామని ఎవ్వరూ వ్రాయలేరు. బుద్ధి అటు, ఇటూ పరుగెడుతూ ఉంటుంది. అందరూ ఏకరసంగా అయితే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. తండ్రి ఎంతో మధురాతి మధురమైన, ప్రియమైన(మీఠీ మీఠీ లవలీ) మాటల ద్వారా వినిపిస్తారు. ఈ విధంగా ఏ గురువూ నేర్పించలేదు. గురువు ద్వారా కేవలం ఒక్కరు మాత్రమే నేర్చుకోరు. గురువు ద్వారా వేల మంది నేర్చుకుంటారు కదా. సద్గురువు నుండి మీరు ఎంతో నేర్చుకుంటారు. ఇది మాయను వశపరచుకునే మంత్రము. మాయ అనగా పంచ వికారాలు. ధనమును సంపద అని అంటారు. వీరి దగ్గర చాలా సంపద ఉందని లక్ష్మీనారాయణులను గురించి చెప్తారు. లక్ష్మీనారాయణులను ఎప్పుడూ తల్లి-తండ్రి అని అనరు. ఆదిదేవుడు, ఆదిదేవిని జగత్పిత, జగదంబ అని అంటారు, వీరిని అలా అనరు. వీరు స్వర్గానికి యజమానులు. అవినాశి జ్ఞాన ధనము తీసుకొని మనము ఇంత గొప్ప ధనవంతులుగా అయ్యాము. అంబ వద్దకు అనేక ఆశలతో వెళ్తారు. లక్ష్మీ వద్దకైతే కేవలం ధనము కొరకే వెళ్తారు. ఇతరమేదీ కోరరు. అందువలన ఎవరు గొప్ప? అంబ వద్ద ఏం లభిస్తుందో, లక్ష్మి వద్ద ఏం లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు. లక్ష్మి నుండి కేవలం ధనము మాత్రమే వేడుకుంటారు. అంబ నుండి మీకు సర్వస్వమూ లభిస్తుంది. అంబ పేరు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మాతలు దుఃఖము కూడా చాలా సహించవలసి వచ్చింది. అందువలన మాతల పేరు చాలా ప్రసిద్ధి చెందుతుంది. మంచిది. అయినా తండ్రి చెప్తున్నారు - తండ్రిని స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. చక్రాన్ని స్మృతి చేయండి. దైవీ గుణాలు ధారణ చేయండి. చాలామందిని మీ సమానంగా చేయండి. మీరు గాడ్‌ఫాదర్‌ విద్యార్థులు. కల్పక్రితము కూడా అయ్యారు. మళ్లీ ఇప్పుడు కూడా అదే లక్ష్యము. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే సత్యమైన కథ. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ వ్యాధిని(జబ్బును) సర్జన్‌ వద్ద ఎప్పుడూ దాచరాదు. మాయా భూతాల నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. స్వయానికి రాజ తిలకమిచ్చుకునేందుకు సేవ తప్పకుండా చేయాలి.
2. స్వయాన్ని అవినాశి జ్ఞాన ధనము ద్వారా ధనవంతులుగా చేసుకోవాలి. ఇప్పుడు పాపాత్మలతో ఇచ్చి పుచ్చుకోరాదు. చదువు పై పూర్తి గమనముంచాలి.

వరదానము :- '' గీతా పాఠాన్ని చదివి చదివించే నష్టోమోహా స్మృతి స్వరూప భవ ''
గీతా జ్ఞానములోని మొదటి పాఠం - అశరీరి ఆత్మగా అవ్వండి, అంతిమ పాఠం నష్టోమోహా స్మృతిస్వరూపులుగా అవ్వండి. మొదటి పాఠమేమో విధి, అంతిమ పాఠం - విధి ద్వారా సిద్ధి. కనుక ప్రతి సమయంలో మొదట స్వయం ఆ పాఠాన్ని మీరే చదవండి, తర్వాత ఇతరులకు చదివించండి. ఎటువంటి శ్రేష్ఠమైన కర్మలు చేసి చూపించాలంటే వాటిని చూచి అనేక ఆత్మలు శ్రేష్ఠమైన కర్మలు చేసి తమ భాగ్యరేఖను శ్రేష్ఠంగా చేసుకోగలగాలి.

స్లోగన్‌ :- '' పరమాత్మ స్నేహంలో ఉంటే, శ్రమ నుండి ముక్తులైపోతారు ''

No comments:

Post a Comment