Tuesday, December 24, 2019

Telugu Murli 25/12/2019

25-12-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - స్మృతియాత్రలో సోమరులుగా అవ్వకండి, స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది, సర్వాత్మలకు సేవ చేసి వారిని శుద్ధంగా తయారు చేసేందుకే బాబా వచ్చారు ''

ప్రశ్న :- ఏ స్మృతి స్థిరంగా ఉన్నట్లయితే ఆహార పానీయాలు శుద్ధంగా అవుతాయి ?
జవాబు :- సత్య ఖండానికి వెళ్లేందుకు, మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు మేము బాబా వద్దకు వచ్చాము అనే స్మృతి ఉన్నట్లయితే ఆహార-పానీయాలు శుద్ధమైపోతాయి. ఎందుకంటే దేవతలు ఎప్పుడూ అశుద్ధ పదార్థాలు తినరు. మనము సత్యఖండానికి, పావన ప్రపంచానికి అధికారులుగా అయ్యేందుకు సత్యమైన తండ్రి వద్దకు వచ్చాము. కనుక పతితులుగా (అశుద్ధమైన వారిగా) అవ్వలేము.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు - పిల్లలారా, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరిని స్మృతి చేస్తారు? బేహద్‌ తండ్రిని. వారెక్కడ ఉంటారు? '' హే పతితపావనా! '' అని వారిని పిలవడం జరుగుతుంది. ఈ రోజులలో సన్యాసులు కూడా పతితపావన సీతారామ్‌ అనగా పతితులను పావనంగా చేసే 'రామా' రండి అని పిలుస్తారు. పావన ప్రపంచమని సత్యయుగమును, పతిత ప్రపంచమని కలియుగమును అంటారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? కలియుగాంతములో. కనుక బాబా మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని పిలుస్తారు. మనము ఎవరు? ఆత్మలము. పవిత్రంగా అవ్వాల్సింది ఆత్మయే. ఆత్మ పవిత్రంగా అయితే శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ పతితంగా అవ్వడం వలన పతిత శరీరము లభిస్తుంది. ఈ శరీరము మట్టిబొమ్మ. ఆత్మ అవినాశి. మేము చాలా పతితంగా అయ్యాము, మమ్ములము పావనంగా చేయండి అని ఆత్మ ఈ అవయవాల ద్వారా చెప్తుంది, పిలుస్తుంది. బాబా పావనంగా చేస్తారు. 5 వికారాల రూపి రావణుడు పతితంగా చేస్తాడు. పావనంగా ఉండే మనము మళ్లీ 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నామని బాబా స్మృతి తెప్పించారు. బాబా చెప్తారు - ఈ మనుష్య సృష్టి రూపి వృక్షానికి నేను బీజరూపుడను. ఓ పరమపిత పరమాత్మ, ఓ గాడ్‌ఫాదర్‌ ముక్తినివ్వండి అని నన్ను పిలుస్తారు. నన్ను విడిపించండి, మార్గదర్శకునిగా అయి నన్ను శాంతిధామానికి తీసుకెళ్ళండి అని ప్రతి ఒక్కరు తమ గురించి చెప్తారు. స్థిరమైన శాంతి ఎలా లభిస్తుంది? అని సన్యాసులు కూడా అడుగుతారు. ఇప్పుడు శాంతిధామము మన ఇల్లు. పాత్ర చేసేందుకు ఆత్మలు అక్కడి నుండే వస్తాయి. అక్కడ కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి, శరీరాలు ఉండవు. ఆత్మలు అశరీరిగా అనగా శరీర రహితంగా ఉంటాయి. నగ్నము అంటే అర్థము దుస్తులు ధరించకుండా అని కాదు. శరీరము లేకుండా ఆత్మలు నగ్నంగా(అశరీరులుగా) ఉంటాయి. తండ్రి చెప్తారు - పిల్లలారా! ఆత్మలైన మీరు మూలవతనంలో శరీరాలు లేకుండా ఉంటారు. దానిని నిరాకార ప్రపంచమని అంటారు.
మనము ఎలా మెట్లు క్రిందకు దిగుతూ వచ్చామో పిల్లలకు మెట్ల చిత్రము గురించి కూడా అర్థం చేయించడం జరిగింది. ఎక్కువలో ఎక్కువ అంటే పూర్తి 84 జన్మలు తీసుకుంటాయి. కొన్ని ఆత్మలు ఒక్క జన్మ కూడా తీసుకుంటాయి. ఆత్మలు పై నుండి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను పావనంగా చేసేందుకే వచ్చాను అని తండ్రి చెప్తారు. శివబాబా బ్రహ్మ ద్వారా మిమ్ములను చదివిస్తున్నారు. శివబాబా ఆత్మలకు తండ్రి, బ్రహ్మను ఆదిదేవుడని అంటారు. ఈ దాదాలో తండ్రి ఎలా వస్తారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ''ఓ పతితపావనా! రండి'' అని నన్ను పిలుస్తారు కూడా. ఆత్మలు ఈ శరీరము ద్వారా పిలిచారు. ముఖ్యమైనది ఆత్మనే కదా. ఇది దుఃఖధామము. ఇక్కడ కలియుగములో చూడండి, కూర్చుని ఉండగానే ఆకస్మాత్తుగా మృత్యువు సంభవిస్తుంది. అక్కడ అలాంటి ఏ అనారోగ్యాలు ఉండవు. దాని పేరే స్వర్గము. ఎంత మంచి పేరు. చెప్తూనే మనస్సుకు ఆనందము కలుగుతుంది. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము స్వర్గముండేదని క్రైస్తవులు కూడా చెప్తారు. ఇక్కడ భారతవాసులకైతే ఏమీ తెలియదు. ఎందుకంటే వారు చాలా సుఖాన్ని చూశారు. కనుక దుఃఖాన్ని కూడా ఎక్కువగా చూస్తున్నారు. తమోప్రధానంగా అయ్యారు. 84 జన్మలు కూడా వీరే తీసుకుంటారు. అర్ధకల్పము తర్వాత మళ్లీ ఇతర ధర్మాలవారు వస్తారు. అర్ధకల్పము దేవీ దేవతలు ఉండేవారని అప్పుడు వేరే ధర్మాలు ఉండేవి కావని ఇప్పుడు మీకు తెలుసు. మళ్లీ త్రేతాలో రామరాజ్యము ఉన్నప్పుడు కూడా ఇస్లాం మతస్థులు. బౌద్ధులు ఉండేవారు కాదు. మనుష్యులు గాఢాంధకారములో ఉన్నారు. ప్రపంచ ఆయువు లక్షల సంవత్సరాలని చెప్తారు, అందుకే కలియుగము ఇంకా చిన్న బిడ్డ అని తికమకపడ్తున్నారు. ఇప్పుడు కలియుగము పూర్తి అయ్యి సత్యయుగము వస్తుందని మీకు తెలుసు. అందుకే ఆస్తి తీసుకునేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. మీరంతా స్వర్గవాసులుగా ఉండేవారు. తండ్రి స్వర్గము స్థాపన చేసేందుకే వస్తారు. స్వర్గములో మీరు మాత్రమే వస్తారు. మిగిలినవారంతా ఇల్లైన శాంతిధామానికి వెళ్లిపోతారు. అది మధురమైన ఇల్లు. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. ఇక్కడకు వచ్చి పాత్రధారులుగా అవుతారు. శరీరము లేకుండా ఆత్మ మాట్లాడలేదు. అక్కడ శరీరము లేని కారణంగా ఆత్మలు శాంతిగా ఉంటాయి. మళ్లీ అర్ధకల్పము దేవీ దేవతలు, సూర్యవంశీ చంద్రవంశము వారు ఉంటారు. మరలా ద్వాపర కలియుగాలలో మనుష్యులు ఉంటారు. దేవతల రాజ్యముండేది. ఇప్పుడది ఎక్కడకు పోయిందో ఎవ్వరికీ తెలియదు. ఈ జ్ఞానము మీకు తండ్రి నుండి ఇప్పుడే లభిస్తుంది. ఏ ఇతర మనుష్యులలో ఈ జ్ఞానముండదు. తండ్రియే వచ్చి మనుష్యులకు ఈ జ్ఞానమునిస్తారు. దీని ద్వారానే మనుష్యులు దేవతలుగా అవుతారు. మీరిక్కడకు మనుష్యుల నుండి దేవతలుగా అయేందుకు వచ్చారు. దేవతల ఆహార-పానీయాలు అశుద్ధంగా ఉండవు. వారెప్పుడూ బీడి మొదలైనవి తాగరు. ఇక్కడి పతిత మనుష్యులు ఏమేం తింటూ ఉంటారో అడగనే అడగకండి. ఈ భారతదేశము మొదట సత్య ఖండంగా ఉండేదని తండ్రి అర్థం చేయిస్తారు. తప్పకుండా సత్యమైన తండ్రే స్థాపన చేసి ఉంటారు. తండ్రినే సత్యమని అంటారు. నేనే భారతదేశాన్ని సత్య ఖండముగా చేస్తానని తండ్రి కూడా చెప్తారు. పిల్లలైన మీరు సత్యమైన దేవతలుగా ఎలా అవ్వగలరో కూడా మీకు నేర్పిస్తాను. ఎంతమంది పిల్లలు ఇక్కడికి వస్తారు! అందువల్లనే ఈ ఇల్లు మొదలైనవి కట్టించవలసి వస్తుంది. చివరి వరకు కట్టబడ్తూనే ఉంటాయి, చాలా కట్టబడ్తాయి. ఇల్లు కొనుగోలు కూడా చేస్తారు. శివబాబా బ్రహ్మ ద్వారా కార్యము చేస్తారు. బ్రహ్మ నల్లగా(పతితంగా) అయిపోయాడు. ఎందుకంటే ఇది అనేక జన్మల అంతిమ జన్మ కదా. ఇతను మళ్లీ సుందరంగా(పవిత్రంగా) అవుతాడు. కృష్ణుని చిత్రాలు కూడా నల్లనివి సుందరమైనవి ఉన్నాయి కదా. మ్యూజియంలో పెద్ద పెద్ద మంచి చిత్రాలున్నాయి, వాటి పై మీరు ఎవరికైనా చాలా బాగా అర్థం చేయించగలరు. ఇక్కడ బాబా మ్యూజియంను కట్టించరు. దీనిని శాంతిస్తంభము అని అంటారు. మనము మన ఇల్లైన శాంతిధామానికి వెళ్తామని, అక్కడి నివాసులమని మళ్లీ ఇక్కడకు వచ్చి శరీరము తీసుకొని పాత్రను అభినయిస్తామని మీకు తెలుసు. ఇక్కడ ఎవరూ సాధు సన్యాసులు లేక పండితులు చదివించడం లేదని పిల్లలకు మొట్టమొదట నిశ్చయముండాలి. ఈ దాదా సింధ్‌లో నివసించేవాడు కాని ఇందులో ఎవరు ప్రవేశించి మాట్లాడుతున్నారో వారు జ్ఞాన సాగరులు. వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. గాడ్‌ఫాదర్‌ అని అంటారు కాని వారికి నామ-రూపాలు లేనే లేవని, వారు నిరాకారులని, వారికి ఏ ఆకారమూ లేదని అంటారు. మళ్లీ వారు సర్వవ్యాపి అని కూడా అంటారు. అరే, పరమాత్ముడు ఎక్కడ ఉన్నారు? అని అడిగితే వారు సర్వవ్యాపి అని అందరిలోనూ ఉన్నారని అంటారు. అరే! అందరిలో ఆత్మ ఉంది, అందరూ సోదరులు కదా. మరి అందరిలోనూ పరమాత్మ ఎక్కడ నుండి వచ్చారు? ఆత్మ కూడా ఉంది మరియు పరమాత్మ కూడా ఉన్నారు అని చెప్పము. బాబా మీరు వచ్చి పతితులైన మమ్ములను పావనంగా చేయండి అని పరమాత్ముడైన తండ్రిని పిలుస్తారు. ఈ వ్యాపారము, ఈ సేవ చేసేందుకే నన్ను పిలుస్తారు. మీరు వచ్చి మా అందరినీ శుద్ధంగా చేయండి, పతిత ప్రపంచములోకి రండి అని నన్ను ఆహ్వానిస్తారు. బాబా, మేము పతితులమని అంటారు. తండ్రి పావన ప్రపంచాన్ని చూడనే చూడరు. పతిత ప్రపంచములోనే మీ సేవ చేసేందుకు వచ్చారు. ఇప్పుడు ఈ రావణ రాజ్యము వినాశనమైపోతుంది. ఇప్పుడు రాజయోగము నేర్చుకుంటున్న మీరు అక్కడకు వెళ్ళి రాజాధి రాజులుగా అవుతారు. మిమ్ములను లెక్కలేనన్ని సార్లు చదివించాను మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత మిమ్ములనే చదివిస్తాను. సత్య, త్రేతా యుగాల రాజధాని ఇప్పుడు స్థాపనవుతూ ఉంది. మొదట బ్రాహ్మణ కులము. ప్రజాపిత బ్రహ్మ అని మహిమ చేయబడింది కదా. అతడిని ఆడమ్‌, ఆదిదేవుడని అంటారు. ఇది ఎవ్వరికీ తెలియదు. చాలా మంది ఇక్కడకు వచ్చి విని మళ్లీ మాయకు వశమైపోతారు. పుణ్యాత్మలుగా అవుతూ అవుతూ పాపాత్మలుగా అవుతారు. మాయ చాలా శక్తివంతమైనది. అందరినీ పాపాత్మలుగా చేసేస్తుంది. ఇక్కడ ఎవరూ పవిత్రాత్మలు, పుణ్యాత్మలు లేనే లేరు. దేవీ దేవతలు పవిత్రాత్మలుగా ఉండేవారు. అందరూ పతితులుగా అయినప్పుడు తండ్రిని పిలుస్తారు. ఇప్పుడిది రావణ రాజ్యము, పతిత ప్రపంచము. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. సత్యయుగాన్ని పుష్పాల ఉద్యానవనమని అంటారు. మొగల్‌గార్డన్‌లో ఎంతో ఫస్ట్‌క్లాస్‌ అయిన మంచి మంచి పుష్పాలు ఉంటాయి. జిల్లేడు పూలు కూడా లభిస్తాయి కాని శివుని పై వాటిని ఎందుకు ఉంచుతారో ఎవ్వరికీ తెలియదు. ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. నేను చదివించునప్పుడు వారిలో కొందరు ఫస్ట్‌క్లాస్‌ గుండుమల్లెలు, కొందరు రత్నజ్యోతి పుష్పాలు, కొందరు జిల్లేడు పూలు కూడా ఉన్నారు. నంబరువారుగా అయితే ఉన్నారు కదా. దీనిని దుఃఖధామము, మృత్యులోకమని అంటారు. సత్యయుగము అమరలోకము. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. శాస్త్ర్రాలనైతే ఈ దాదా చదివారు. తండ్రి శాస్త్రాలను చదివించరు. తండ్రి అయితే స్వయంగా సద్గతిదాత కాని గీతను ఉదహరిస్తారు. సర్వశాస్త్రమయి శిరోమణి గీతను భగవంతుడు ఉపదేశించాడని అంటారు. కానీ భగవంతుడని ఎవరిని అంటారో భారతవాసులకు తెలియదు. తండ్రి చెప్తారు - నేను నిష్కామ సేవ చేస్తాను. మిమ్ములను విశ్వాధికారులుగా చేస్తాను, నేను అవ్వను. స్వర్గములో మీరు నన్ను స్మృతి చేయరు. దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు, సుఖములో ఎవ్వరూ స్మృతి చేయరు. దీనిని సుఖ-దుఃఖాల ఆట అని అంటారు. స్వర్గములో వేరే ఇతర ధర్మమేదీ ఉండదు. అవన్నీ తర్వాత వస్తాయి. ఇప్పుడీ పాత ప్రపంచము వినాశనమైపోతుంది, చాలా తీవ్రంగా ప్రకృతి వైపరిత్యాలు, తుఫానులు వస్తాయి. అంతా సమాప్తమైపోతుంది.
తండ్రి ఇప్పుడు వచ్చి బుద్ధిహీనులను బుద్ధివంతులుగా చేస్తారు. తండ్రి ఎంత ధన సంపత్తులను ఇచ్చారు! అదంతా ఎక్కడకు పోయింది? ఇప్పుడు ఎంతగా దివాలా తీశారు! స్వర్ణిమ పక్షిలా (బంగారు పిచుక) ఉండే భారతదేశము ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు మళ్లీ పతితపావనుడైన తండ్రి వచ్చి రాజయోగమును నేర్పిస్తున్నారు. అది హఠయోగము, ఇది రాజయోగము. ఈ రాజయోగము ఇరువురి కొరకు (స్త్రీ పురుషులు). ఆ హఠయోగము కేవలం పురుషులే నేర్చుకుంటారు. పురుషార్థము చేయండి, విశ్వాధికారులై చూపించండి అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము వినాశనము తప్పకుండా జరుగుతుంది. కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. ఈ యుద్ధము అంతిమ యుద్ధము. ఈ యుద్ధము ప్రారంభమైతే ఆగదు. మీరు ఎప్పుడు కర్మాతీత స్థితిని పొందుతారో, స్వర్గానికి వెళ్లేందుకు అర్హులుగా అవుతారో అప్పుడు ఈ యుద్ధము ప్రారంభమవుతుంది. అయినా తండ్రి చెప్తున్నారు - స్మృతియాత్రలో సోమరులుగా అవ్వకండి. ఇందులోనే మాయ విఘ్నాలు వేస్తుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి ద్వారా బాగా చదివి ఫస్ట్‌క్లాస్‌ పుష్పాలుగా అవ్వాలి, ఈ ముళ్ళ అడవిని పుష్పాల తోటగా పరివర్తన చేయడంలో తండ్రికి పూర్తి సహయోగము చేయాలి.
2. కర్మాతీత స్థితిని పొందేందుకు లేక స్వర్గములో ఉన్నత పదవికి అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు స్మృతియాత్రలో తత్పరులవ్వాలి. సోమరులుగా అవ్వరాదు.

వరదానము :- '' ఒకే స్థానంలో ఉంటూ అనేక ఆత్మలకు సేవ చేసే లైట్‌ - మైట్‌ సంపన్న భవ ''
ఎలాగైతే లైట్‌హౌస్‌ ఒకే స్థానంలో స్థితమై ఉండి దూర-దూర స్థానాలకు కాంతినిచ్చే సేవ చేస్తుందో, అలా మీరందరు ఒకే స్థానంలో ఉంటూ అనేకమంది సేవార్థము నిమిత్తంగా అవ్వగలరు. ఇందులో కేవలం లైట్‌-మైట్‌లతో సంపన్నంగా అయ్యే అవసరముంది. మనసు - బుద్ధి సదా వ్యర్థం ఆలోచించడం నుండి మ్తుంగా ఉండాలి, మన్మనాభవ మంత్రానికి సహజ స్వరూపంగా ఉండాలి. మనసా శుభ భావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ వైబ్రేషన్లతో సంపన్నంగా ఉంటే ఈ సేవ సహజంగా చేయగలరు. ఇదే మనసా సేవ.

స్లోగన్‌ :- '' ఇప్పుడు బ్రాహ్మణాత్మలైన మీరు మైట్‌గా (శక్తిగా) అవ్వండి, ఇతర ఆత్మలను మైక్‌గా చేయండి ''

No comments:

Post a Comment