Friday, November 8, 2019

Telugu Murli 09/11/2019

09-11-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - మీ స్మృతి చాలా అద్భుతమైనది ఎందుకంటే మీరు ఒకేసారి తండ్రి - టీచరు - సద్గురువు ముగ్గురిని స్మృతి చేస్తారు ''

ప్రశ్న :- ఏ బిడ్డనైనా మాయ గర్విష్ఠిగా తయారు చేసినప్పుడు ఏ విషయాన్ని నిర్లక్ష్యము చేస్తారు?
జవాబు :- గర్విష్ఠి పిల్లలు దేహాభిమానములోకి వచ్చి మురళిని నిర్లక్ష్యం చేస్తారు. సామెత ఉంది కదా - ఎలుకకు ఒక పసుపుకొమ్ము దొరకగానే నేను కూడా పెద్ద వ్యాపారి అయిపోయాను, దుకాణమంతా నాదే అని అనుకుందట.... (చూహే కో మిలీ హల్దీ కీ గాంఠ్‌, సమఝా మై భీ పసారీ హూ), కొంతమంది తమకు కొంచెము జ్ఞానము లభించగానే మహాజ్ఞానిలా భావిస్తుంటారు, నిజమైన జ్ఞాని నిరహంకారిగా, ఎంతో నమ్రతగా ఉంటాడు. చాలా మంది పిల్లలు మురళినే చదవరు, మాకు నేరుగా శివబాబాతోనే సంబంధముందని అంటారు. బాబా చెప్తున్నారు - పిల్లలూ, మురళిలో కొత్త కొత్త విషయాలు వెలువడ్తూ ఉంటాయి కనుక మురళిని ఎప్పుడూ మిస్‌ చేయరాదు, దీని పై చాలా గమనముండాలి.

ఓంశాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు - పిల్లలూ! మీరు ఎవరి స్మృతిలో కూర్చుని ఉన్నారు? (తండ్రి, శిక్షకులు, సద్గురువు) అందరూ ఈ ముగ్గురి స్మృతిలో ఉన్నారా? ప్రతి ఒక్కరు స్వయాన్ని ప్రశ్నించుకోండి - ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే స్మృతి ఉందా? లేక నడుస్తూ - తిరుగుతూ కూడా గుర్తుంటుందా? ఎందుకంటే ఇది అద్భుతమైన విషయము, ఇతర ఏ ఆత్మనూ ఎప్పుడూ ఇలా అనరు. భలే ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధికారులే. కాని వారి ఆత్మలను ఎవ్వరూ తండ్రి, టీచరు, సద్గురువు కూడా మీరే అని అనరు. కాని మొత్తం ప్రపంచములోని ఇతర ఏ జీవాత్మలు ఏ ఆత్మలనూ ఇలా పిలువరు. పిల్లలైన మీరే ఈ విధముగా స్మృతి చేస్తారు. మీ ఆంతరికములో ఈ బాబా బాబాయే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారని అనిపిస్తుంది. అది కూడా అత్యంత శ్రేష్ఠము(సుప్రీమ్‌). ముగ్గురునీ స్మృతి చేస్తున్నారా? లేక ఒక్కరినేనా? వారు ఒక్కరే అయినా మూడు గుణాలతో స్మృతి చేస్తారు. శివబాబా మన తండ్రే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు, దీనిని అసాధారణ(ఎక్స్‌ట్రా ఆర్డినరి)మని అంటారు. కూర్చున్నప్పుడు లేక నడుస్తూ, తిరుగుతూ ఉన్నప్పుడు ఇది గుర్తుండాలి. బాబా, మీరు మాకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారని స్మృతి చేస్తున్నారా? అని బాబా అడుగుతున్నారు. ఏ దేహధారి కూడా ఇలా ఉండేందుకు వీలు లేదు. దేహధారులలో మొదటివాడు కృష్ణుడు. వారిని తండ్రి - టీచరు - సద్గురువు అని అనరాదు. ఇది చాలా అద్భుతమైన విషయము. కావున 3 రూపాలలో స్మృతి చేస్తున్నారా ? సత్యంగా చెప్పండి. భోజనము చేయునప్పుడు కేవలం శివబాబాను స్మృతి చేస్తున్నారా లేక మూడు రూపాలలో స్మృతి చేస్తున్నారా ? అంటే బుద్ధిలోకి మూడు రూపాలూ వస్తున్నాయా? ఏ ఇతర ఆత్మనూ ఇలా అనలేరు. ఇది అద్భుతమైన విషయము. ఈ తండ్రిది విచిత్రమైన మహిమ. కావున అటువంటి తండ్రిని అలాగే స్మృతి చేయాలి. అప్పుడు బుద్ధి ఇటువంటి అద్భుతమైన తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది. ఆ తండ్రే స్వయంగా కూర్చుని తన పరిచయాన్ని ఇస్తున్నారు. అంతేకాక పూర్తి సృష్టిచక్ర జ్ఞానము కూడా ఇస్తున్నారు. ఈ యుగాలిలా ఉన్నాయి, ఒక్కొక్క యుగము ఇన్ని సంవత్సరాలు, ఇలా తిరుగుతూనే ఉంటుంది, ఈ జ్ఞానము కూడా ఆ రచయితే స్వయంగా ఇస్తున్నారు. అందువలన వారిని స్మృతి చేయడం వలన చాలా సహాయము లభిస్తుంది. తండ్రి, టీచరు, సద్గురువు వారొక్కరే. ఇంత శ్రేష్ఠమైన వారెవ్వరూ ఉండరు. కానీ మాయ ఇటువంటి తండ్రిని కూడా మరిపింపచేస్తుంది, అప్పుడు టీచరు, గురువును కూడా మర్చిపోతారు. ఇది ప్రతి ఒక్కరికి తమ తమ హృదయాలలో హత్తుకొని పోవాలి. బాబా, మనలను ఈ విశ్వమంతటికీ అధికారులుగా చేస్తారు. అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వము తప్పకుండా అనంతంగానే ఉంటుంది. దానితో పాటు ఈ మహిమ కూడా బుద్ధిలోకి రావాలి. నడుస్తూ - తిరుగుతూ ఈ మూడు రూపాలు గుర్తు రావాలి. ఈ ఒక్క ఆత్మది మాత్రమే మూడు సేవలు కలిసి ఉన్నాయి. అందుకే వారిని సుప్రీమ్‌(పరమ) అని అంటారు.
ఇప్పుడు సభలు, సమావేశాలకు ఆహ్వానిస్తుంటారు. విశ్వంలో శాంతి ఎలా నెలకొల్పబడ్తుంది? అని అడుగుతారు - అది ఇప్పుడు జరుగుతున్నది, వచ్చి తెలుసుకోండి అని చెప్పండి. ఎవరు చేస్తున్నారు? మీరు తండ్రి కర్తవ్యాన్ని నిరూపిస్తూ తెలిపించాలి. తండ్రి కర్తవ్యానికి, కృష్ణుని కర్తవ్యానికి చాలా వ్యత్యాసముంది. మిగిలిన వారందరి పేర్లు శరీరాలకే ఉంటాయి. కానీ వారి ఆత్మ మహిమ చేయబడ్తుంది. ఆ పరమాత్మ తండ్రి, టీచరే కాక సద్గురువు కూడా అయ్యారు. వారి ఆత్మలో జ్ఞానముంది, అయితే ఎలా ఇవ్వాలి? శరీరము ద్వారానే ఇస్తారు కాబట్టే వారి మహిమను గానము చేస్తారు. ఇప్పుడు శివజయంతిలో కాన్ఫరెన్స్‌(సమ్మేళనము) జరుపుతారు, అన్ని ధర్మాల నేతలను(పెద్దవారిని) పిలుస్తారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కారని అర్థం చేయించాలి. అందరిలో ఈశ్వరుడుంటే ప్రతి ఆత్మ భగవంతుడైన తండ్రి, టీచరు, సద్గురువుగా ఉన్నారా ? వారిలో ఈ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముందా? ఉంటే తెలపండి అని అడగండి. ఇది ఎవ్వరూ వినిపించలేరు.
శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన తండ్రికి ఎంత మహిమ ఉందో పిల్లలైన మీరు ఆంతర్యములో గ్రహించాలి. వారు పూర్తి విశ్వాన్నంతా పావనంగా చేస్తారు, ప్రకృతి కూడా పావనమైపోతుంది. సమావేశాలలో మొట్టమొదటగా గీతా భగవంతుడెవరు? అని అడగండి. సత్యయుగములోని దేవీదేవతా ధర్మమును స్థాపించేదెవరు? కృష్ణుడంటే, తండ్రిని మటుమాయం చేస్తారు లేకుంటే వారు నామ-రూపాలకు అతీతమైనవారని అంటారు అనగా వారు లేనే లేనట్లు మాట్లాడ్తారు. అందువలన తండ్రి లేనందున అనాథలైపోయారు కదా. అనంతమైన తండ్రిని గురించి తెలియదు. ఒకరి పై ఒకరు కామఖడ్గాన్ని ప్రయోగిస్తూ ఎంతో విసిగిస్తూ ఉంటారు. ఒకరికొకరు దు:ఖము కలిగించుకుంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో మెదులుతూ ఉండాలి. కాంట్రాస్ట్‌(తేడా) చెప్పాలి కదా. ఈ లక్ష్మీనారాయణులు భగవాన్‌ - భగవతి కదా, వీరి వంశావళి కూడా ఉంటుంది కదా. మరి అందరూ అటువంటి గాడ్‌-గాడెస్‌(భగవాన్‌-భగవతీలు)గా ఉండాలి కదా అని అడగండి. మీరు సర్వధర్మాల వారిని పిలుస్తారు. ఎవరు బాగా విద్యావంతులై(చదువుకున్నవారిగా) ఉంటారో, తండ్రి పరిచయాన్ని ఇవ్వగలరో, అటువంటి వారినే పిలవాలి. ఎవరైనా వచ్చి రచయిత - రచనల ఆదిమధ్యాంతాల పరిచయము ఇవ్వగలిగితే, వారు వచ్చి వెళ్లేందుకు, ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని వ్రాయండి. కానీ వారు రచయిత - రచనల పరిచయమును ఇవ్వగలగాలి. ఈ జ్ఞానాన్ని మీరు తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరని మీకు తెలుసు. ఎవరైనా విదేశాల నుండి రచయిత రచనల ఆదిమధ్యాంతాల పరిచయాన్నిస్తే, వారి ఖర్చులు మేమే భరిస్త్తామని అందరికీ తెలపండి. ఇటువంటి ప్రకటనలు, వార్తాపత్రికలలో అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఎవ్వరూ ఇవ్వలేరు. మీరు సాహసవంతులు కదా. మీరు మహావీరులు, మహావీరవనితలు. విశ్వచక్రవర్తి పదవిని ఈ లక్ష్మీనారాయణులు పొందుకున్నారని మీకు తెలుసు. వారిలో ఉన్న శూరత్వమేది? ఈ విషయాలన్నీ బుద్ధిలో మెదులుతూ ఉండాలి. మీరు ఎంతో శ్రేష్ఠమైన కార్యము చేస్తున్నారు. మొత్తం విశ్వాన్నంతా పావనంగా చేస్తున్నారు. అందువలన తండ్రిని మరియు వారసత్వమును కూడా స్మృతి చేయాలి. కేవలం శివబాబా గుర్తున్నారా? అని కాదు, వారి మహిమను కూడా తెలపాలి. ఈ మహిమ నిరాకారునిది కానీ నిరాకారుడు తన పరిచయమునెలా ఇస్తారు? సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమునిచ్చేందుకు నోరు కావాలి కదా, నోటికి కూడా ఎంత మహిమ! మానవులు గోముఖము చూచేందుకు వెళ్తూ ఉంటారు. ఎన్నో కుదుపులు, ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. రకరకాల మాటలు, విషయాలు తయారు చేస్తారు. బాణము వేస్తూనే గంగ వెలువడిందని అంటారు. కొంతమంది గంగను పతితపావని అని అంటారు. నీరు పతితులను పావనంగా ఎలా చేయగలదు? పతితపావనులు ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రి పిల్లలైన మీకు ఎంతగానో నేర్పిస్తున్నారు. తండ్రి ఇలా ఇలా చేయమని చెప్తూనే ఉంటారు. రచయిత అయిన తండ్రి పరిచయమును, రచన పరిచయమును ఎవరిస్తారు? ఋషులు-మునులు మొదలైనవారంతా నేతి - నేతి(మాకు తెలియదు, ఇది కాదు) అని అంటూ వచ్చారని సాధు సన్యాసులు మొదలైనవారికి తెలుసు అనగా వారు నాస్తికులు కదా. ఇప్పుడు ఎవరైనా ఆస్తికులున్నారేమో చూడండి. ఇప్పుడు పిల్లలైన మీరు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతున్నారు. మిమ్ములను ఇంత ఉన్నతంగా చేసిన అనంతమైన తండ్రిని గురించి మీకు తెలుసు. '' ఓ గాడ్‌ఫాదర్‌! ముక్తినివ్వండి.... అని ధీనంగా పిలుస్తూ కూడా ఉన్నారు. ఈ సమయములో విశ్వమంతటా రావణరాజ్యముంది. అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు, మళ్లీ శ్రేష్టాచారులుగా కూడా అవుతారు కదా. మొట్టమొదట పవిత్ర ప్రపంచముండేదని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి అపవిత్ర ప్రపంచాన్ని తయారు చేయరు(స్థాపించరు). తండ్రి వచ్చి పవిత్ర ప్రపంచమునే స్థాపన చేస్తారు, దానిని శివాలయమని అంటారు. శివబాబా శివాలయాన్ని తయారుచేస్తారు కదా. వారెలా తయారుచేస్తారో కూడా మీకు తెలుసు. మహాప్రళయము, జలమయము మొదలైనవేవీ జరగవు. శాస్త్రాలలో ఏదేదో వ్రాసేశారు. మిగిలి ఉన్న పంచ పాండవులు హిమాలయ పర్వతాల పై కరిగిపోయినట్లు వ్రాశారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో, దీని వలన ఫలితమేమిటో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలన్నీ ఆ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆ తండ్రి తండ్రే కాక టీచరు, సద్గురువు అని కూడా మీకు తెలుసు. అక్కడ ఈ మందిరాలు ఉండవు. ఈ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్లిపోయారు. వారి స్మారక చిహ్నాలుగా మందిరాలు ఇక్కడే ఉన్నాయి. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. సెకండు తర్వాత సెకండు నూతన విషయము జరుగుతూ ఉంటుంది, చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ తండ్రి తన పిల్లలకు చాలా మంచి సూచనలు, ఆదేశాలను ఇస్తున్నారు. చాలా దేహాభిమానము గల పిల్లలు, మాకంతా తెలుసు అని భావిస్తారు, మురళి కూడా చదవరు. గౌరవమే ఉంచరు. బాబా హెచ్చరిస్తున్నారు - ఒక్కొక్క సమయంలో చాలా మంచి మురళి నడుస్తుంది, మిస్‌ చేయరాదు. 10-15 రోజులు మురళి చదవనివారు, మిస్‌ చేసుకున్నవారు కూర్చుని ఆ మురళిలు చదవాల్సిందే. రచయిత-రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఎవరైనా వచ్చి చెప్తే, వారి ఖర్చులన్నీ భరిస్తామని ఛాలెంజ్‌ చేయండి. తెలిసినవారే ఇలాంటి ఛాలెంజ్‌(సవాలు) చేస్తారు కదా. టీచరుకు కూడా స్వయం తెలిసినప్పుడే కదా అడుగుతారు. తెలియకుంటే ఎలా అడుగుతారు? ఎలా ఛాలెంజ్‌ చేస్తారు? కొంతమంది పిల్లలు మురళిని కూడా లక్ష్యపెట్టరు. మాకు శివబాబాతో నేరుగా సంబంధముంది, అంతే చాలని అంటారు. కాని శివబాబా ఏం చెప్తున్నారో వినాలి కదా. కేవలం స్మృతి చేస్తే చాలని అనుకోరాదు. తండ్రి చాలా మంచి మంచి మధురమైన మాటలు వినిపిస్తారు. కానీ మాయ పూర్తి గర్విష్టులుగా చేసేస్తుంది. ఒక సామెత ఉంది కదా - ఎలుకకు పసుపు కొమ్ము దొరికినంత మాత్రానికే, అంగడి అంతా నాదే అని అనుకున్నదట. చాలామంది మురళిని చదవనే చదవరు. మురళిలో కొత్త - కొత్త విషయాలు వెలువడ్తుంటాయి కదా. ఆ విషయాలన్నీ అర్థము చేసుకోవాలి. తండ్రి స్మృతిలో కూర్చున్నప్పుడు, వారిని తండ్రిగానే కాదు టీచరు, సద్గురువుగా కూడా స్మృతి చేయాలి లేకుంటే ఎలా చదువుకుంటారు? ఎవరు చదివిస్తారు? ఆ తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. పిల్లలే తండ్రిని ప్రత్యక్షము చేస్తారు(సన్‌ షోజ్‌ ఫాదర్‌) పుత్రుడు తండ్రిని ప్రత్యక్షము చేస్తారు, తర్వాత తండ్రి పిల్లలను ప్రత్యక్షము చేస్తారు. ఆత్మను ప్రత్యక్షము చేస్తారు. తర్వాత తండ్రిని ప్రత్యక్షము చేయడం పిల్లల కర్తవ్యము. తండ్రి కూడా పిల్లలను వదిలిపెట్టరు. ఈ రోజు ఫలానా చోటికి, ఈ రోజు ఇక్కడకు వెళ్లండని అంటారు. వీరికి ఆజ్ఞలిచ్చే వారెవ్వరూ లేరు. ఆహ్వానము మొదలైనవి వార్తాపత్రికలలో వస్తాయి. ఈ సమయంలో ప్రపంచములోని వారంతా నాస్తికులే. ఆ తండ్రే వచ్చి ఆస్తికులుగా చేస్తారు. ఈ సమయంలో ప్రపంచమంతా పైసకు కొరగానిదిగా(వర్త్‌ నాట్‌ ఏ పెన్నీగా) ఉంది. అమెరికా వద్ద ఎంత ధనము, సంపద ఉన్నా పైసకు పనికిరాదు. ఇదంతా నాశనమైపోతుంది కదా. ఈ ప్రపంచమంతటిని మీరు 16 అణాల సమానంగా(రూపాయ, ఒక పౌండ్‌గా) సంపన్నంగా చేస్తున్నారు. అక్కడ నిరుపేదలెవ్వరూ ఉండరు.
పిల్లలైన మీరు సదా జ్ఞానాన్ని స్మృతి చేస్తూ హర్షితంగా ఉండాలి. అతీంద్రియ సుఖమును గురించి అడగాలంటే గోప-గోపికలనే అడగండి అనే మహిమ ఉంది. ఇవన్నీ సంగమ యుగములోని విషయాలే. సంగమ యుగము గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. విహంగమార్గ సేవ చేస్తే బహుశా మహిమ వస్తుంది ''ఓహో ప్రభూ! మీ లీలలు అద్భుతమనే మహిమ కూడా ఉంది. భగవంతుడు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారని ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. పిల్లలకు ఈ నషా, సంతోషము స్థిరంగా ఉండాలి. అంత్యము వరకు నషా ఉండాలి. ఇప్పుడైతే నషా వెంటనే సోడా నీటి వలె అవుతుంది. సోడా కూడా అలా అవుతుంది కదా. కొంత సమయము అలా వదిలేస్తే ఉప్పునీరుగా అయిపోతుంది. అలా అవ్వరాదు. ఎవరికైనా వారు ఆశ్చర్యపడునట్లు అర్థం చేయించాలి. బాగుంది, బాగుంది అని అంటారు. కానీ వారు సమయాన్ని కేటాయించి, జీవితాలను తయారు చేసుకోవడం చాలా కష్టము. వృత్తి వ్యాపారాదులు చేయరాదని బాబా ఎప్పుడూ చెప్పరు. పవిత్రులుగా అవ్వండి. నేను చెప్పే చదువును గుర్తుంచుకోండి అని చెప్తారు. వీరు టీచరు కదా. ఇది అసాధారణమైన చదువు, మామూలు చదువు కాదు. ఏ మానవుడు కూడా ఈ చదువును నేర్పించలేరు. ఆ ఒక్క తండ్రి మాత్రమే భాగ్యశాలి రథములో వచ్చి చదివిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది(భృకుటి) సింహాసనము. దాని పై అకాలమూర్తి అయిన ఆత్మ వచ్చి ఆసీనమవుతుంది, దానికి ఆ పాత్ర లభించింది. మిగిలినవన్నీ కృత్రిమ(ఆర్టిఫిషియల్‌) విషయాలు. ఇవి బాగా ధారణ చేసేందుకు(ముడి వేసుకోవాలి) గుర్తు పెట్టుకోవాలి. ముడిని తాకగానే గుర్తుకొస్తుంది. కానీ పిల్లలు ఎందుకు ముడి వేసుకుంటున్నారో కూడా మర్చిపోతారు. మీకు ఇది చాలా బాగా గుర్తుండాలి. తండ్రి స్మృతితో పాటు జ్ఞానము కూడా ఉండాలి. ముక్తే కాక జీవన్ముక్తి కూడా ఉంది. మీరు పదే పదే మర్చిపోతారు. అందువలన గుర్తు చేయిస్తూ ఉంటాను. శివబాబాను స్మృతి చేయండి. వారు తండ్రి, టీచరు కాక సద్గురువు కూడా అయ్యారు. చిన్న పిల్లలు ఇలా స్మృతి చేయరు. తండ్రి, టీచరు, గురువు అని కృష్ణుడిని అనరు. కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. అతడు గురువెలా అవుతాడు? దుర్గతిలో గురువు అవసరము. తండ్రి వచ్చి అందరికీ సద్గతినిస్తారనే మహిమ కూడా ఉంది. కృష్ణుని నల్లని బొగ్గులా తయారుచేశారు. తండ్రి చెప్తున్నారు - ఈ సమయంలో అందరూ కామచితి పైకెక్కి నల్ల బొగ్గు వలె అయ్యారు. అందుకే నల్లనివాడు(శ్యామము) అని అంటారు. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన ఎంతో నిగూఢమైన విషయాలు. అందరూ గీతను పఠిస్తారు. అన్ని శాస్త్రాలను ఒప్పుకునేది భారతీయులే. అందరి చిత్రాలను ఉంచుకుంటారు. మరి ఇది వ్యభిచార భక్తియే కదా. ఒక్క శివునికి చేయునదే అవ్యభిచార భక్తి. జ్ఞానము కూడా ఒక్క శివబాబా ద్వారానే లభిస్తుంది. ఈ జ్ఞానమే ప్రత్యేకమైనది(డిఫెరెంట్‌). దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము(స్పిరిచ్యువల్‌ నాలెడ్జ్‌ ) అని అంటారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. నశించే నషా (మత్తు)ను వదిలి, పైసకు కొరగాకుండా(వర్త్‌ నాట్‌ ఏ పెన్నీ) ఉన్న మేమిప్పుడు, సంపూర్ణ రూపాయి(వర్త్‌ పౌండ్‌)గా అవుతూ ఉన్నాము, స్వయం భగవంతుడే మమ్ములను చదివిస్తున్నారు, ఇది మాములు చదువు కాదు, అసాధారణమైన విద్య అనే అలౌకిక నషా ఉండాలి.
2. ఆసిక్తులై తండ్రిని ప్రత్యక్షము చేయు సేవ చేయాలి. గర్విష్ఠులై ఎప్పుడూ మురళిని మిస్‌ చేయరాదు.

వరదానము :- '' ప్రతి అడుగులో వరదాత ద్వారా వరదానాలు ప్రాప్తి చేసుకొని శ్రమ నుండి ముక్తులుగా ఉండే అధికారి ఆత్మా భవ ''
ఎవరైతే వరదాత పిల్లలుగా ఉంటారో వారికి ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాలు స్వతహాగానే లభిస్తాయి. వరదానాలే వారి పాలన, వరదానాల పాలన ద్వారానే పాలింపబడ్తారు. ఏ కష్టమూ లేకుండా ఇంత శ్రేష్ఠ ప్రాప్తులు అవ్వడాన్నే వరదానమని అంటారు. కనుక జన్మ-జన్మలకు అధికారులుగా అయిపోయారు. ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాలు లభిస్తున్నాయి, సదా లభిస్తూనే ఉంటాయి. అధికారి ఆత్మలకు దృష్టి ద్వారా, మాటల ద్వారా, సంబంధాల ద్వారా వరదానాలే వరదానాలు లభిస్తాయి.

స్లోగన్‌ :- '' సమయ వేగమనుసారము పురుషార్థ వేగాన్ని తీవ్రము చేయండి ''

No comments:

Post a Comment