Monday, January 27, 2020

Telugu Murli 28/01/2020

28-01-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీరు స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులుగా భావిస్తే సత్యయుగ వృక్షము కనిపిస్తుంది, మీరు అపారమైన ఖుషీలో ఉంటారు ''

ప్రశ్న :- ఎవరు జ్ఞానములో ఆసక్తి గల పిల్లలుగా ఉంటారో వారి గుర్తులు ఎలా ఉంటాయి ?
జవాబు :- వారు పరస్పరములో జ్ఞాన విషయాలే మాట్లాడ్తారు. ఎప్పుడూ పరచింతన చేయరు ఏకాంతములోకి వెళ్ళి విచార సాగర మథనము చేస్తారు.

ప్రశ్న :- ఈ సృష్టి డ్రామాలోని ఏ రహస్యాన్ని పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు ?
జవాబు :- ఈ సృష్టి డ్రామాలో ఒక్క శివబాబా తప్ప ఏ వస్తువూ సదా స్థిరంగా ఉండదు. పాత ప్రపంచములోని ఆత్మలను క్రొత్త ప్రపంచానికి తీసుకెెళ్లేందుకు ఎవరైనా కావాలి, ఈ డ్రామా రహస్యం కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు.

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు పురుషోత్తమ సంగమ యుగములో వచ్చే తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు తమను తాము బ్రాహ్మణులమని భావిస్తారు. స్వయాన్ని బ్రాహ్మణులమని భావిస్తున్నారా లేక ఇది కూడా మర్చిపోతున్నారా? బ్రాహ్మణులు తమ కులాన్ని ఎప్పుడూ మర్చిపోరు. మీకు కూడా మేము బ్రాహ్మణులమని తప్పకుండా గుర్తుండాలి. ఈ ఒక్క విషయము స్మృతిలో ఉన్నా నావ తీరానికి చేరుతుంది. సంగమ యుగములో మీరు కొత్త కొత్త విషయాలు వింటారు. కనుక మీలో వాటి చింతన నడుస్తూ ఉండాలి. దానిని విచార సాగర మథనమని అంటారు. మీరు జ్ఞానులు-యోగులు(రూప్‌ బసంత్‌). మీ ఆత్మలో మొత్తం జ్ఞానమంతా నింపబడ్తుంది. కనుక మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి. మేము సంగమయుగ బ్రాహ్మణులమని స్వయాన్ని భావించాలి. కొంతమంది ఇది కూడా అర్థము చేసుకోరు. ఒకవేళ స్వయాన్ని సంగమ యుగవాసులుగా భావిస్తే సత్యయుగ వృక్షము కనిపించాలి అంతేకాక అపారమైన సంతోషము కూడా ఉండాలి. తండ్రి ఏం అర్థం చేయిస్తున్నారో, దానిని మనసులో పునరావృతము(రిపీట్‌) చేస్తూ ఉండాలి. ఇప్పుడు మేము సంగమ యుగములో ఉన్నామనే విషయము కూడా మీకు తప్ప వేరెవ్వరికీ తెలియదు. సంగమ యుగములోని చదువు కొంత సమయము కుడా తీసుకుంటుంది. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువు ఇది ఒక్కటే. మేము దేవతలుగా, స్వర్గవాసులుగా అవుతున్నామనే మాట గుర్తున్నా సంతోషంగా ఉంటారు. సంగమయుగ నివాసులైనప్పుడే స్వర్గవాసులుగా అవుతారు. ఇంతకుముందు నరకవాసులుగా ఉన్నప్పుడు చాలా చెడు(మురికి) స్థితి ఉండేది, చెడు పనులు చేసేవారు, ఇప్పుడు వాటిని సమాప్తము చేయాలి. మనుష్యుల నుండి దేవతలుగా, స్వర్గవాసులుగా అవ్వాలి. ఎవరి పత్ని అయినా మరణించినప్పుడు మీ యుగల్‌(భార్య) ఎక్కడ ఉంది? అని మీరు ప్రశ్నిస్తే స్వర్గవాసి అయిందని చెప్తారు. స్వర్గమంటే ఏమిటో కూడా తెలియదు. స్వర్గవాసిగా అయి ఉంటే సంతోషించాలి కదా! ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయాలు తెలుసు. మేమిప్పుడు సంగమ యుగంలో ఉన్నాము, పావనంగా అవుతున్నామని, స్వర్గ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నామని లోలోపల అనుకుంటూ ఉండాలి. క్షణ-క్షణము దీనిని స్మరణ చేయాలి, మర్చిపోరాదు. కానీ మాయ మరపింపజేసి ఒక్కసారిగా కలియుగవాసులుగా చేసేస్తుంది. పూర్తి కలియుగవాసుల వలె కర్మలు చేస్తారు. ఆ అపారమైన సంతోషము ఉండదు. ముఖము శవము వలె ఉంటుంది. అందరూ కామచితి పై కూర్చొని కాలి శవాల వలె అయిపోయారని తండ్రి కూడా అంటారు. మేము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు కనుక ఆ ఖుషీ ఉండాలి కదా. అందువల్లనే అతీంద్రియ సుఖము యొక్క అనుభూతిని అడగాలంటే గోప-గోపికలను అడగమని గాయనముంది. మేము ఆ అనుభూతిలో ఉన్నామా? అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి. మీరు ఈశ్వరీయ మిషన్‌(సంస్థ) కదా. ఈశ్వరీయ మిషన్‌ ఏ పని చేస్తుంది? మొదట శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తుంది. మేము బ్రాహ్మణులమని మర్చిపోరాదు. ఆ బ్రాహ్మణులైతే వెంటనే మేము బ్రాహ్మణులమని అంటారు. వారు గర్భజనితులు, మీరు ముఖవంశావళి. బ్రాహ్మణులైన మీకు చాలా నషా ఉండాలి. బ్రహ్మ భోజనము,............ అని మహిమ కూడా ఉంది. మీరు ఎవ్వరికైనా బ్రహ్మాభోజనాన్ని తినిపించినట్లయితే, మేము పవిత్ర బ్రాహ్మణుల చేతి నుండి తింటున్నామని ఎంతో సంతోషపడ్తరు. మనసా-వాచా-కర్మణా ఎంత పవిత్రంగా ఉండాలి. ఏ అపవిత్ర కర్తవ్యమూ చేయరాదు. కొంత సమయము పడ్తుంది. జన్మత: ఎవ్వరూ అవ్వలేరు. భలే ఒక్క సెకెండులో జీవన్ముక్తి అనే గాయనముంది, తండ్రి పిల్లలుగా అయ్యారంటే ఆస్తి లభించినట్లే. ఇతను ప్రజాపిత బ్రహ్మ, శివుని కుమారుడు అని ఒక్కసారి గుర్తించి ఉంటే చాలు, ఆ నిశ్చయము కలిగిన వెంటనే వారసులుగా అవుతారు. ఒకవేళ మళ్లీ ఏదైనా అకర్తవ్యము చేసినట్లయితే, చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. కాశీకల్వట్‌(కాశీలోని కత్తులబావిలో పడి శివలింగము పై ప్రాణార్పణ చేయడం) గురించి అర్థం చేయించినట్లు, శిక్షలు అనుభవించడం ద్వారా లెక్కాచారము సమాప్తమవుతుంది. ముక్తి కొరకే కాశీలో కత్తుల బావిలో దూకేవారు. ఇక్కడ అలాంటి విషయాలేవీ లేవు. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని శివబాబా పిల్లలకు చెప్తున్నారు. ఎంత సులభము! అయినా అనేక మాయ చక్రాలు వచ్చేస్తాయి. మీ ఈ యుద్ధము అన్ని యుద్ధాల కంటే ఎక్కువ సమయం నడుస్తుంది. బాహుబల యుద్ధము ఇంత సమయము నడవదు. మీరు వచ్చినప్పటి నుండి యుద్ధము ప్రారంభమయ్యింది. పాతవారితో ఎంత యుద్ధము జరుగుతుంది, కొత్తగా వచ్చేవారితో కూడా నడుస్తుంది. ఆ యుద్ధములో కూడా మరణిస్తూ ఉంటారు, ఇతరులు వచ్చి చేరుతూ ఉంటారు. ఇక్కడ కూడా మరణిస్తూ ఉంటారు. వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. వృక్షము తప్పకుండా పెద్దదిగా అవ్వాల్సిందే. వారు తండ్రి కూడా అయినారు, సుప్రీమ్‌ టీచరు కూడా అయినారు, సద్గురువు కూడా అయినారు అనునది గుర్తుండాలి అని బాబా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. కృష్ణుని సద్గురువు, తండ్రి, టీచరు అని అనరు.
అందరికి కళ్యాణము చేయాలనే ఆసక్తి మీలో ఉండాలి. మహారథి పిల్లలు సర్వీసు చేస్తూ ఉంటారు. వారికైతే చాలా సంతోషముంటుంది. ఎక్కడ నుండి ఆహ్వానము లభిస్తుందో అక్కడకు పరుగులు పెడ్తూ ఉంటారు. ప్రదర్శని సర్వీసు కమిటీలో కూడా మంచి మంచి పిల్లలే ఎన్నుకోబడ్తారు. వారికి ఆదేశాలు లభిస్తాయి, సర్వీసు చేెస్తూ ఉంటే వీరు ఈశ్వరీయ మిషన్‌కు చెందిన మంచి పిల్లలని అంటారు. వీరు చాలా మంచి సర్వీసు చేస్తారని తండ్రి కూడా సంతోషిస్తారు. మేము సర్వీసు చేస్తున్నామా ? అని మీ మనసును మీరే ప్రశ్నించుకోండి. ఆన్‌ గాడ్‌ఫాదర్‌లీ సర్వీస్‌(గాడ్‌ఫాదర్‌ సేవలో) అని చెప్తారు. గాడ్‌ఫాదర్‌ సర్వీసు ఏది ? మన్మనాభవ అను సందేశాన్ని అందరికీ ఇవ్వండి, అంతే. ఆదిమధ్యాంతాల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. మీ పేరే స్వదర్శన చక్రధారులు కనుక దాని చింతన నడవాలి. స్వదర్శన చక్రము ఎప్పుడూ ఆగదు. మీరు చైతన్యమైన లైట్‌ హౌస్‌లు, మీ మహిమ చాలా గాయనం చేయబడ్తుంది. బేహద్‌ తండ్రి మహిమ కూడా మీరు తెలుసుకున్నారు. వారు జ్ఞాన సాగరులు, పతితపావనులు, గీతా భగవంతుడు, వారే జ్ఞాన-యోగాల బలము ద్వారా ఈ కార్యాన్ని చేయిస్తారు. ఇందులో యోగబలము యొక్క ప్రభావము చాలా ఉంది. భారతదేశ ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. అది మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు. సన్యాసులైతే హఠయాగులు, వారు పతితులను పావనంగా చేయలేరు. జ్ఞానము ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. జ్ఞానము ద్వారా మీరు జన్మ తీసుకుంటారు. గీతను తల్లి-తండ్రి అని అంటారు, మాత-పితలు కదా. మీరు శివబాబా పిల్లలు. మరి మాతా-పితలు కావాలి కదా. మనుష్యులు మాతా-పితలని గానము చేస్తారు కానీ అర్థము తెలియదు. దీని అర్థము ఎంత గుహ్యమైనదో తండ్రి అర్థం చేయిస్తున్నారు. గాడ్‌ఫాదర్‌ అని అంటారు, మళ్లీ మాత-పిత అని ఎందుకు అంటారు? సరస్వతి ఉంది కానీ వాస్తవానికి సత్య-సత్యమైన తల్లి పుత్రుడైన బ్రహ్మయే అని బాబా అర్థం చేయించారు. సాగరము మరియు బ్రహ్మ పుత్ర(నది), మొట్టమొదట వీరి కలయికే జరుగుతుంది. బాబా ఇతనిలో ప్రవేశిస్తారు. ఇవి ఎంతటి సూక్ష్మమైన విషయాలు. చింతన చేసేందుకు ఈ విషయాలు చాలామంది బుద్ధిలో ఉండవు. తక్కువ పదవిని పొందేవారు, పూర్తి తక్కువ బుద్ధి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించమని వారి కొరకు తండ్రి మళ్లీ మళ్లీ చెప్తారు. ఇది సులభం కదా. ఆత్మలమైన మన తండ్రి పరమాత్మ. నన్ను ఒక్కరినే(మామేకమ్‌ యాద్‌ కరో) స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనము అవుతాయని వారు ఆత్మలైన మీకు చెప్తున్నారు. ఇది ముఖ్యమైన విషయము. మందబుద్ధి కలిగిన వారు పెద్ద విషయాలను అర్థము చేసుకోరు. కనుకనే మన్మనాభవ అని గీతలో కూడా ఉంది. బాబా, స్మృతియాత్ర చాలా కష్టమైనది, క్షణ-క్షణము మర్చిపోతాము, ఏదో ఒక పాయింట్‌ పై ఓడిపోతాము అని అందరూ బాబాకు వ్రాస్తారు. ఇది మాయకు మరియు ఈశ్వరీయ సంతానానికి మధ్య జరిగే బాక్సింగ్‌(మల్ల యుద్ధము), దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. మాయ పై విజయము పొంది కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలని అర్థం చేయిస్తారు. మొట్టమొదట మీరు కర్మ సంబంధములోకి వచ్చారు. అందులో వస్తూ వస్తూ మళ్లీ మీరు అర్ధకల్పము తర్వాత కర్మ బంధనములోకి వచ్చారు. మొట్టమొదట మీరు పవిత్రాత్మలుగా వచ్చారు. సుఖ-దు:ఖాల కర్మబంధనము ఉండేది కాదు. తర్వాత సుఖ సంబంధంలోకి వచ్చారు. మేము సంబంధములో ఉండేవారము, ఇప్పుడు దు:ఖములో ఉన్నాము, మళ్లీ తప్పకుండా సుఖములో ఉంటామని కూడా ఇప్పుడు మీకు తెలుసు. క్రొత్త ప్రపంచము ఉన్నప్పుడు అధిపతులుగా ఉండేవారము, పవిత్రంగా ఉండేవారము, ఇప్పుడు పాత ప్రపంచంలో పతితులుగా ఉన్నాము. మళ్లీ మనమే దేవతలుగా అవుతాము కనుక ఇది గుర్తు చేసుకోవాలి కదా.
తండ్రి చెప్తారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి, మీరు నా ఇంటికి వచ్చేస్తారు. శాంతిధామం ద్వారా సుఖధామంలోకి వచ్చేస్తారు. మొట్టమొదట ఇంటికి వెళ్ళాలి. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే, మీరు పవిత్రంగా అవుతారు. పతితపావనుడైన నేను మీరు ఇంటికి వచ్చేందుకు మిమ్ములను పవిత్రంగా చేస్తున్నాను. ఇలా ఇలా స్వయంతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దాదాపు ఇప్పుడు చక్రము తప్పకుండా పూర్తి అవుతుంది, మేము ఇన్ని జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. యోగబలముతోనే పావనంగా అవుతాము. ఈ యోగబలము చాలా ప్రసిద్ధమైనది. ఇది తండ్రియే నేర్పించగలరు. ఇందులో శరీరము ద్వారా ఏమీ చేయవలసిన అవసరము లేదు. కనుక పూర్తి రోజంతా ఈ విషయాల గురించి మథనము నడవాలి. ఏకాంతములో ఎక్కడైనా కూర్చోండి లేక వెళ్ళండి, బుద్ధిలో ఇదే నడుస్తూ ఉండాలి. ఏకాంతము చాలా ఉంది. ఇంటి పైకప్పు పైకి వెళ్లేందుకు భయపడాల్సిన అవసరము లేదు. మొదట మీరు మురళి విన్న తర్వాత పర్వతాల పైకి వెళ్ళేవారు, విన్నదానిని గురించి చింతన చేసేందుకు మీరు పర్వతాల పైకి వెళ్ళి కూర్చునేవారు. జ్ఞానములో ఆసక్తి ఉన్నవారు పరస్పరము జ్ఞానము విషయాలే మాట్లాడుకుంటారు. జ్ఞానము లేకుంటే పరచింతన చేస్తూ ఉంటారు. ప్రదర్శనిలో మీరు ఎంతమందికి ఈ మార్గాన్ని తెలుపుతారు. మన ధర్మము చాలా సుఖమునిచ్చేదని అర్థం చేసుకున్నారు. ఇతర ధర్మాల వారికి కేవలం తండ్రిని స్మృతి చేయండి అని అర్థం చేయించాలి. వీరు ముసల్మానులు, నేను ఫలానా అని భావించరాదు. ఆత్మను చూడాలి, ఆత్మకే అర్థం చేయించాలి. ప్రదర్శినిలో అర్థం చేయిస్తూ ఉంటే నేను నా సోదర ఆత్మకు అర్థం చేయిస్తున్నానని అభ్యాసమవుతుంది. ఇప్పుడు మనకు తండ్రి నుండి వారసత్వము లభిస్తూ ఉంది. స్వయాన్ని ఆత్మగా బావించి సోదరులకు జ్ఞానాన్నిస్తారు - ఇప్పుడు తండ్రి వద్దకు పదండి, చాలా సమయము విడిపోయి ఉన్నారు. అది శాంతిధామము, ఇక్కడ ఎంత దు:ఖము, అశాంతి మొదలైనవి ఉన్నాయి! ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించే అభ్యాసము చేసినట్లయితే, నామ, రూప, దేహములన్నీ మర్చిపోతారు. ఫలానావారు ముసల్మానులు అని ఎందుకు భావిస్తారు? ఆత్మగా భావించి అర్థము చేయించండి. ఈ ఆత్మ మంచిదా లేక చెడ్డదా? అని అర్థం చేసుకోగలరు. చెడు నుండి దూరంగా తొలగిపోవాలని ఆత్మ గురించే చెప్పబడ్తుంది. ఇప్పుడు మీరు బేహద్‌ తండ్రి పిల్లలు. ఇక్కడ పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్లీ వాపసు వెళ్ళాలి, పావనమవ్వాలి. తండ్రిని తప్పకుండా స్మృతి చేయాల్సి వస్తుంది. పావనంగా అయితే, పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. తండ్రి కూడా ప్రతిజ్ఞ చేయమని అంటారు. బాబా యుక్తి కూడా తెలుపుతారు - ఆత్మలైన మీరు సోదరులు. శరీరములోకి వస్తే సోదరీ-సోదరులు. సోదరీ-సోదరులు ఎప్పుడూ వికారాలోకి వెళ్ళరు. పవిత్రంగా అయి తండ్రిని స్మృతి చేయడం వలన మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. మాయతో ఓడిపోయినా మళ్లీ లేచి నిల్చోండి. ఎంత బాగా నిల్చుకుంటే అంత ప్రాప్తి అవుతుంది. లాభ- నష్టాలుంటాయి కదా. అర్ధకల్పము జమ అవుతుంది. మళ్లీ రావణ రాజ్యములో నష్టమైపోతుంది. లెక్కాచారము కదా. గెలవడం అంటే జమ, ఓడిపోవడం అంటే నష్టము. కనుక స్వయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తే పిల్లలైన మీకు సంతోషము కలుగుతుంది. వారు కేవలం మహిమ చేస్తారు. కొంచెం కూడా తెలివి లేదు. అన్ని పనులు తెలివిహీనులై చేస్తారు. మీరు పూజలు మొదలైనవి చేయరు, మహిమ అయితే చేస్తారు కదా. ఆ ఒక్క తండ్రి భక్తికే అవ్యభిచారి భక్తి అని మహిమ ఉంది. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్ములను స్వయంగా చదివిస్తారు. మీరు ప్రశ్నలడిగే అవసరమే లేదు. చక్రము స్మృతిలో ఉండాలి. మనము మాయ పై విజయం ఎలా పొందుతామో, మళ్లీ ఓడిపోతామో అర్థం చేసుకోవాలి. ఓడిపోతే 100 రెట్లు శిక్ష లభిస్తుందని తండ్రి అర్థం చేయిస్తారు. సద్గురువును నిందింపజేయకండి అని తండ్రి చెప్తున్నారు. లేకుంటే స్వర్గంలో స్థానము లభించదు. ఇది సత్యనారాయణ కథ. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. గీతను, సత్యనారాయణ కథను వేరు చేశారు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే ఈ గీత ఉంది.
తండ్రి చెప్తున్నారు - నేను మీకు నరుని నుండి నారాయణునిగా అయ్యే కథను వినిపిస్తాను, దీనిని గీత అని కూడా అంటారు, అమరనాథుని కథ అని కూడా అంటారు. మూడవ నేత్రాన్ని ఆ తండ్రియే ఇస్తారు. మనం దేవతలుగా అవుతామని కూడా మీకు తెలుసు కనుక గుణాలు కూడా తప్పకుండా కావాలి. ఈ సృష్టిలో ఏ వస్తువూ సదా స్థిరంగా ఉండదు. సదా స్థిరంగా ఉండేవారు ఒక్క శివబాబా మాత్రమే. మిగిలినవారంతా క్రిందకి రావాల్సిందే. కానీ వారు కూడా సంగమ యుగంలో వచ్చి అందరిని వాపసు తీసుకెళ్తారు. పాత ప్రపంచములోని ఆత్మలను నూతన ప్రపంచములోకి తీసుకెళ్లేందుకు ఎవరో ఒకరు కావాలి కదా. డ్రామాలో ఈ రహస్యమంతా ఉంది. తండ్రి వచ్చి పవిత్రంగా చేస్తారు. దేహధారులెవ్వరినీ భగవంతుడని అనజాలరు. ఈ సమయంలో ఆత్మకు గల రెక్కలు తెగిపోయాయి కనుక ఎగరలేదని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చి జ్ఞాన-యోగాలనే రెక్కలనిస్తారు. యోగబలముతో మీ పాపాలు భస్మమైపోతాయి, పుణ్యాత్మలుగా అవుతారు. మొట్టమొదట శ్రమ కూడా చేయాలి అందువలన తండ్రి మామేకం యాద్‌ కరో, చార్టు పెట్టండి అని చెప్తున్నారు. ఎవరి చార్టు బాగుంటుందో వారు వ్రాస్తారు. వారికి సంతోషముంటుంది. ఇప్పుడు అందరూ శ్రమ చేస్తారు. చార్టు వ్రాయకుంటే యోగమనే పదును నిండదు. చార్టు వ్రాయడంలో చాలా లాభముంది. చార్టుతో పాటు పాయింట్లు కూడా ఉండాలి. చార్టులో అయితే సేవ ఎంత చేశారు? స్మృతి ఎంత చేశారు? రెండూ వ్రాస్తారు. పురుషార్థము ఎలా చేయాలంటే చివర్లో ఏ వస్తువూ గుర్తు రాకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించి పుణ్యాత్మగా అవ్వాలి. ఈ శ్రమ చేయాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు విశేషమైన హోంవర్క్‌
అవ్యక్త స్థితిని అనుభవం చేసేందుకు సదా ' సమస్యలను దూరంగా తరిమేయాలి, సంపూర్ణతను సమీపానికి తీసుకురావాలి' అని గుర్తుంచుకోండి. అలా ఉండేందుకు ఈశ్వరీయ మర్యాదలలో నిర్లక్ష్యంగా ఉండరాదు. ఆసురీ మర్యాదలు లేక మాయను నిర్లక్ష్యం చేయండి. సమస్యను ఎదిరిస్తే సమస్య సమాప్తమైపోతుంది.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఏకాంతములో జ్ఞాన మనన చింతన చేయాలి. స్మృతియాత్రలో ఉంటూ మాయ పై విజయాన్ని పొంది, కర్మాతీత స్థితిని పొందుకోవాలి.
2. ఎవరికైనా జ్ఞానాన్ని తెలియజేసే సమయములో, మేము సోదర ఆత్మకు జ్ఞానాన్నిస్తున్నామని బుద్ధిలో ఉండాలి. నామ, రూప, దేహములను మరచిపోవాలి. పావనులగుటకు ప్రతిజ్ఞ చేసి పావనులై పావన ప్రపంచానికి యజమానులవ్వాలి.

వరదానము :- '' అఖండయోగ పద్ధతి ద్వారా అఖండ పూజ్యులుగా అయ్యే శ్రేష్ఠ మహాన్‌ ఆత్మా భవ ''
ఈ రోజులలో ఎవరైతే మహాత్ములని పిలువబడ్తున్నారో వారికి అఖండానంద్‌ మొదలైన పేర్లు పెడ్తారు. కాని అన్నిటిలో అఖండ స్వరూపులు మీరే. ఆనందములోనూ అఖండము, సుఖములోనూ అఖండము......... కేవలం సాంగత్య దోషములోకి రాకండి. ఇతరుల అవగుణాలను చూస్తున్నా, వింటున్నా వాటిని లెక్క చేయకండి. అలా ఉంటే ఈ విశేషత ద్వారా అఖండ యోగులుగా అవుతారు. ఎవరైతే అఖండ యోగులుగా ఉంటారో వారే అఖండ పూజ్యులుగా అవుతారు. మీరు ఎటువంటి మహాత్ములంటే అర్థకల్పము మీ జడచిత్రాలకు పూజ జరుగుతుంది.

స్లోగన్‌ :- '' దివ్యబుద్ధియే సైలెన్స్‌ శక్తికి ఆధారము ''

No comments:

Post a Comment