Tuesday, September 17, 2019

Telugu Murli 10/09/2019

10-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీరు ఎంత సమయము తండ్రి స్మృతిలో ఉంటారో, అంత సమయము సంపాదనే సంపాదన. స్మృతి ద్వారానే మీరు తండ్రికి సమీపంగా వస్తూ ఉంటారు ''

ప్రశ్న :- స్మృతి చేయలేని పిల్లలు ఏ విషయములో సిగ్గుపడ్తారు ?
జవాబు :- చార్టు వ్రాసేందుకు సిగ్గుపడ్తారు. సత్యము వ్రాస్తే బాబా ఏమంటారో అని అనుకుంటారు. కాని పిల్లలు సత్యమైన చార్టును వ్రాస్తూ ఉంటేనే వారి కళ్యాణము జరుగుతుంది. చార్టు వ్రాయడం వలన చాలా లాభముంది. పిల్లలారా, ఈ విషయములో సిగ్గుడకండి అని తండ్రి చెప్తారు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరిప్పుడు ఇక్కడకు 15 నిముషాలు ముందు వచ్చి బాబా స్మృతిలో కూర్చుంటారు. ఇప్పుడిక్కడ ఇతర ఏ పనీ లేదు. తండ్రి స్మృతిలోనే వచ్చి కూర్చుంటారు. భక్తిమార్గములో అయితే తండ్రి పరిచయమే లేదు. ఇక్కడ తండ్రి పరిచయము లభించింది. ''నన్నొక్కరినే స్మృతి చేయండి'' అని తండ్రి చెప్తారు. నేను పిల్లలందరికి తండ్రిని. తండ్రిని స్మృతి చేయడం వలన వారసత్వము సహజంగా(ఆటోమేటిక్‌గా) గుర్తుకు రావాలి. మీరేమీ చిన్న పిల్లలు కాదు కదా. భలే మేము 5 నెలల పిల్లలము లేక 2 నెలల పిల్లలము అని వ్రాస్తారు కానీ మీ కర్మేంద్రియాలైతే పెద్దవి, కావున ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ తండ్రి మరియు వారసత్వము స్మృతిలో కూర్చోవాలి. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు పురుషార్థము చేయడంలో తత్పరులై ఉన్నామా లేక స్వర్గానికి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నామా అని మీకు తెలుసు. కావున మేమిక్కడ కూర్చొని ఎంత సమయము స్మృతి చేశాము? అని పిల్లలు నోట్‌ చేయాలి. వ్రాయడం వలన తండ్రి అర్థము చేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఎంత సమయము స్మృతి చేశారో తండ్రికి తెలుసు అని అనుకోకండి. తండ్రిని స్మృతి చేశానా లేక బుద్ధి వేరే వైపుకు వెళ్లిపోయిందా? అని ప్రతి ఒక్కరు తమ చార్టు ద్వారా తెలుసుకోగలరు. బాబా ఇప్పుడు వస్తారని గుర్తు చేసుకున్నా, అది కూడా స్మృతియే కదా. ఎంత సమయము స్మృతి చేశామో చార్టులో సత్యంగా వ్రాస్తారు, అసత్యముగా వ్రాస్తే ఇంకా నూరు రెట్లు పాపము పెరుగుతుంది, ఇంకా నష్టపోతారు. అందువలన సత్యంగా వ్రాయాలి. ఎంతగా స్మృతి చేస్తామో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి అంతేకాక తండ్రికి సమీపంగా వస్తూ ఉంటామని కూడా తెలుసు. చివరికి స్మృతి చేయడం పూర్తి అయితే మనము మళ్లీ బాబా వద్దకు వెళ్లిపోతాము. కొందరైతే వెంటనే కొత్త ప్రపంచములోకి వచ్చి పాత్ర చేస్తారు, కొందరు అక్కడే కూర్చొని ఉంటారు. అక్కడ ఏ సంకల్పమూ రాదు. అది ముక్తిధామము, అది సుఖ-దు:ఖాలకు అతీతమైనది. సుఖధామంలోకి వెళ్లేందుకు ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తున్నారు. ఎంతగా మీరు స్మృతి చేస్తే అంతగా వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చార్టును ఉంచడం వలన జ్ఞాన ధారణ కూడా బాగుంటుంది. చార్టు ఉంచడం వలన లాభమే ఉంది. స్మృతిలో ఉండని కారణంగా వ్రాసేందుకు సిగ్గుపడ్తారని బాబాకు తెలుసు. బాబా ఏమంటారు, మురళిలో వినిపిస్తారు. ఇందులో సిగ్గుపడేదేముంది అని తండ్రి అంటారు. మేము స్మృతి చేస్తున్నామా లేదా? అని మనసులో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు. వ్రాస్తే కళ్యాణము జరుగుతుందని కళ్యాణకారి తండ్రి అర్థం చేయిస్తారు. బాబా వచ్చేవరకు ఎంత సమయము కూర్చొని ఉన్నారో, ఆ సమయములో స్మృతి చార్టు ఎంత ఉంది? తేడా చూసుకోవాలి. ప్రియమైన వస్తువునైతే చాలా స్మృతి చేస్తారు. కుమార-కుమారీలకు వివాహము నిశ్చయమైతే ఒకరికొకరు మనసులో గుర్తుండిపోతారు(ముద్ర పడిపోతుంది). వివాహము జరిగిన తర్వాత ఆ స్మృతి స్థిరంగా ఉండిపోతుంది. చూడకుండానే మాకు వివాహము నిశ్చయమైందని అనుకుంటారు. పిల్లలైన మీరిప్పుడు శివబాబా మాకు బేహద్‌ తండ్రి అని తెలుసుకున్నారు. వారిని చూడలేదు కాని బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఆ తండ్రి నామ-రూపాలకు అతీతమని కొందరంటారు - మంచిది. అలాగైతే ఎవరిని పూజిస్తారు? ఎందుకు స్మృతి చేస్తారు? నామ-రూపాలకు అతీతంగా, అనంతంగా ఏ వస్తువూ ఉండదు. వస్తువును చూసినప్పుడే వర్ణిస్తారు. ఆకాశాన్ని కూడా చూస్తారు కదా. వారిని అనంతమని చెప్పలేరు. భక్తిమార్గములో ''ఓ భగవంతా!'' అని భగవంతున్ని స్మృతి చేస్తారు కావున బేఅంత్‌(ఆది-అంత్యాలు లేనివాడు) అని అనరు. ''ఓ భగవంతా!'' అని అనగానే వెంటనే వారు గుర్తుకు వస్తారు. కనుక తప్పకుండా అతడు ఉన్నాడు. ఆత్మను కూడా తెలుసుకోగలరు కాని చూడలేరు.
ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే, వారిని కూడా చూడలేము కానీ తెలుసుకోవచ్చు. తండ్రి వచ్చి చదివిస్తారు కూడా అని పిల్లలైన మీకు తెలుసు. చదివిస్తారు కూడా అని ఇంతకు ముందు తెలియదు. కృష్ణుని పేరు పెట్టేశారు. కృష్ణుడు ఈ కళ్లకు కనిపిస్తాడు, అనంతుడని, నామ-రూపాలకు అతీతుడని, అతనిని గురించి అనలేరు. నన్నొక్కరినే స్మృతి చేయండని కృష్ణుడు ఎప్పుడూ అనడు. అతడు సన్ముఖములో ఉన్నాడు. అతడిని బాబా అని కూడా అనరు. మాతలైతే కృష్ణుని బిడ్డగా భావించి ఒడిలో కూర్చోబెట్టుకుంటారు. జన్మాష్టమికి చిన్ని కృష్ణుని ఊయలలో ఊపుతారు. అతడు సదా చిన్నగానే ఉంటాడా, తర్వాత రాస-విలాసాన్ని కూడా చేస్తాడు. మరి కొద్దిగా పెద్దవాడిగా అయ్యాడు కదా. ఆ తర్వాత ఇంకా పెద్దవానిగా అవుతాడో లేక ఏమైనాడో, ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదు. సదా చిన్న శరీరమే ఉండదు కదా. కొద్దిగా కూడా ఆలోచించరు. ఈ పూజలు మొదలైనవి ఆచారాలుగా కొనసాగుతాయి. జ్ఞానమైతే ఎవ్వరిలోనూ లేదు. కృష్ణుడు కంసపురములో జన్మించినట్లు చూపిస్తారు. ఇప్పుడు కంసపురమను మాటే లేదు. ఎవ్వరికీ ఈ ఆలోచనలు రావు. భక్తులైతే కృష్ణుని సర్వత్రా ఉన్నారని అంటారు. అతడికి స్నానము కూడా చేయిస్తారు, తినిపిస్తారు కూడా. అతడైతే తినడు. మూర్తి(విగ్రహము) ముందు పెట్టి తర్వాత వారే తినేస్తారు. ఇది కూడా భక్తిమార్గమే కదా. శ్రీనాథునికి కూడా నైవేద్యము పెడ్తారు, శ్రీనాథుడు తినడు, స్వయం పెట్టినవారే తినేస్తారు. దేవతలను పూజించినప్పుడు కూడా ఇలా చేస్తారు. స్వయం వారే దేవతలను తయారు చేస్తారు, వారికి పూజ చేసిన తర్వాత నీటిలో ముంచేస్తారు. నగలు మొదలైనవన్నీ తేసేసి ముంచేస్తారు. అక్కడ చాలా మంది ఉంటారు. వారు ఎవరికి ఏమి దొరికితే అవి తీసేసుకుంటారు. దేవీల చిత్రాలనే ఎక్కువగా పూజిస్తారు. లక్ష్మీ, దుర్గ ఇరువురి మూర్తులను తయారు చేస్తారు. పెద్ద తల్లి(బ్రహ్మ) కూడా ఇక్కడ కూర్చుని ఉంది కదా, వారిని బ్రహ్మపుత్ర అని కూడా అంటారు. ఈ జన్మలో భవిష్య రూపాన్ని కూడా పూజ చేస్తున్నామని భావిస్తారు కదా. ఇది ఎంత విచిత్రమైన డ్రామా. ఇలాంటి విషయాలు శాస్త్రాలలో లేవు. ఇవి వాస్తవిక కర్మలు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానముంది. ఆత్మల చిత్రాలు చాలా తయారు చేశారని మీరు అర్థం చేసుకున్నారు. రుద్ర యజ్ఞమును రచించినప్పుడు లక్షలాది సాలిగ్రామాలను తయారు చేస్తారు. దేవీల లక్షలాది చిత్రాలను ఎప్పుడూ తయారు చేయరు. వారైతే ఎంతమంది పూజారులుంటారో అన్ని దేవీ విగ్రహాలను తయారుచేస్తారు. కానీ రుద్రయజ్ఞంలో ఒకే సమయంలో లక్షలాది సాలిగ్రామాలను తయారు చేస్తారు. సాలిగ్రామాల పూజకు ఫలానా రోజు అని నిశ్చయముండదు. ముహూర్తము మొదలైనవేవీ ఉండవు. దేవతల పూజ నిర్ణయించిన సమయంలో జరుగుతుంది. సేట్లకు రుద్రుని లేక సాలిగ్రామాలను రచించాలని సంకల్పము రాగానే బ్రాహ్మణులను పిలుస్తారు. ఒక్క తండ్రిని మాత్రమే రుద్రుడని అంటారు, వారితో పాటు ఎన్నో సాలిగ్రామాలను తయారు చేస్తారు. ఇన్ని సాలిగ్రామాలను తయారు చేయండని సేఠ్లు చెప్తారు. అందుకు తిథి, తారీఖులను నిర్ణయించరు. శివజయంతి రోజే రుద్రునికి పూజ చేస్తారని కాదు. ఎక్కువగా బృహస్పతి(గురువారము)వారమునే శుభదినంగా నిర్ణయిస్తారు. దీపావళి రోజు లక్ష్మి చిత్రమును పళ్ళెములో ఉంచి పూజిస్తారు. మళ్లీ ఆ విగ్రహాన్ని యథా స్థానంలో ఉంచుతారు. మహాలక్ష్మి అని పేరు పెట్టేస్తారు. ఆమె యుగల్‌ రూపము కదా. మనుష్యులకు ఈ విషయాలు తెలియదు. లక్ష్మికి ధనము ఎలా లభిస్తుంది? ఆమెకు యుగల్‌ అయితే కావాలి కదా. కనుక వీరు యుగళులు. అందుకే మహాలక్ష్మి అని పేరు పెట్టేస్తారు. దేవతలు ఎప్పుడుండినారు, మహాలక్ష్మి ఎప్పుడు ఉండి వెళ్లిపోయారు? ఈ విషయాలన్నీ మానవులకు తెలియదు. మీకిప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీలో కూడా అందరూ ఒకే విధముగా ధారణ చేయరు. ఇంత జ్ఞానము అర్థం చేయించిన తర్వాత కూడా శివబాబా గుర్తున్నారా? వారసత్వము గుర్తుందా? అని బాబా అడుగుతారు. ఇదే ముఖ్యమైన విషయము. భక్తిమార్గములో ధనమును ఎంతగా వృథా చేస్తారు. ఇక్కడ మీది ఒక పైసా కూడా వృథా అవ్వదు. మీరు సంపన్నంగా అయ్యేందుకే సేవ చేస్తారు. భక్తిమార్గములో అయితే చాలా ధనాన్ని ఖర్చు చేస్తారు, నిరుపేదలైపోతారు. అంతా మట్టిలో కలిసిపోతుంది. ఎంత వ్యత్యాసముంది. ఇప్పుడు ఏమి చేసినా ఈశ్వరీయ సేవలో శివబాబాకు ఇస్తారు. శివబాబా అయితే తినరు, మీరే తింటారు. బ్రాహ్మణులైన మీరు మధ్యలో నిమిత్తులుగా(ట్రస్టీలుగా) ఉన్నారు. బ్రహ్మకు ఇవ్వడం లేదు. మీరు శివబాబాకు ఇస్తారు. బాబా, మీ కొరకు ధోతి-చొక్కా తెచ్చామని అంటారు. ఇతనికి ఇవ్వడం వలన మీకేమీ జమ అవ్వదని బాబా చెప్తారు. శివబాబాను స్మృతి చేసి ఇతనికి ఇచ్చిందే జమ అవుతుంది. బ్రాహ్మణులు శివబాబా ఖజానా ద్వారాయే పోషింపబడ్తున్నారని మీకు తెలుసు. ఏమి పంపమంటారు? అని బాబాను అడిగే అవసరము లేదు. ఎందుకంటే ఇతడు తీసుకోడు. బ్రహ్మాబాబాను స్మృతి చేస్తే మీది జమ అవ్వనే అవ్వదు. బ్రహ్మ కూడా శివబాబా ఖజానా నుండే తీసుకోవాలి. తద్వారా శివబాబాయే గుర్తుకొస్తారు. ఇతడు మీ వస్తువులను ఎందుకు తీసుకుంటాడు? బ్రహ్మకుమారీలకు ఇవ్వడము కూడా తప్పే. మీరు ఎవరి వద్దనైనా దుస్తులను తీసుకొని ధరిస్తే వారే గుర్తుకు వస్తూ ఉంటారని బాబా అర్థం చేయిస్తారు. తేలికైన(చిన్న) వస్తువైతే దాని విషయం వేరు. మంచి వస్తువు అయితే ఫలనావారు ఇది ఇచ్చారని ఎక్కువగా గుర్తుకొస్తుంది. వారిది ఏమీ జమ అవ్వదు. కావున నష్టము జరుగుతుంది కదా. నన్నొక్కరినే స్మృతి చేయమని శివబాబా చెప్తారు. నాకు దుస్తులు మొదలైనవేవీ అవసరం లేదు. దుస్తులు మొదలైనవి పిల్లలకు కావాలి. వాటిని శివబాబా ఖజానా నుండి ధరిస్తారు. నాకైతే నా శరీరమే లేదు. వీరు శివబాబా ఖజానా నుండి తీసుకునేందుకు హక్కుదారులు. రాజ్యానికి కూడా హక్కుదారులు. తండ్రి ఇంటిలోనే పిల్లలు తింటూ త్రాగుతూ ఉంటారు కదా. మీరు కూడా సర్వీసు చేస్తూ సంపాదిస్తూ ఉన్నారు. ఎంత ఎక్కువగా సర్వీసు చేస్తే, అంత ఎక్కువ సంపాదన జరుగుతుంది. శివబాబా భండారము నుండే తింటారు, త్రాగుతారు. వారికి ఇవ్వకుంటే జమ అవ్వదు. శివబాబాకే ఇవ్వవలసి ఉంటుంది. బాబా, మీ ద్వారా భవిష్య 21 జన్మలకు పదమాపదమ్‌ పతులుగా అవుతాము. ధనమైతే సమాప్తమవుతుంది. అందువలన సమర్థులకు మేము ఇచ్చేస్తాము. తండ్రి సమర్థులు కదా. 21 జన్మల వరకు వారే ఇస్తారు. పరోక్షంగా కూడా ఈశ్వరార్థము ఇస్తారు కదా. అలా పరోక్షంగా ఇచ్చింది అంత సమర్థవంతమైనది కాదు. ఇప్పుడు చాలా సమర్థంగా ఉంటుంది ఎందుకంటే వారు సన్ముఖములో ఉన్నారు. సర్వశక్తివంతులు ఈ సమయంలోనే ఉన్నారు.
ఈశ్వరార్థంగా ఏదైనా కొద్దిగా దాన-పుణ్యాలు చేస్తే అల్పకాలానికి ఎంతో కొంత లభిస్తుంది. తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు - ఇక్కడైతే నేను సన్ముఖములో ఉన్నాను. ఇచ్చే దాతను నేనే. ఇతను కూడా శివబాబాకు సర్వస్వము సమర్పించి విశ్వచక్రవర్తి పదవి తీసుకున్నారు కదా. ఈ వ్యక్తములోని అతని అవ్యక్త రూపమే సాక్షాత్కారమవుతుందని కూడా మీకు తెలుసు. ఇతనిలోకి శివబాబా వచ్చి పిల్లలతో మాట్లాడ్తారు. మనమే మానవుల నుండి తీసుకోవాలని ఎప్పుడూ అనుకోరాదు. శివబాబా భండారానికి పంపించండి అని చెప్పండి. ఇతనికి(బ్రహ్మబాబా) ఇస్తే ఏమీ లభించదు, ఇంకా నష్టపోతారని చెప్పండి. పేదవారు 3-4 రూపాయల విలువ గల ఏదైనా వస్తువు ఇచ్చినా శివబాబా భండారములో వేస్తే పదమంత జమ అవుతుంది, స్వయానికి నష్టము కలిగించుకోవద్దని వారికి చెప్పండి. దేవీలకు మాత్రమే ఎక్కువగా పూజలు చేస్తారు ఎందుకంటే జ్ఞానమునిచ్చేందుకు దేవీలైన మీరే నిమిత్తంగా అవుతారు. గోపులు(సోదరులు) కూడా అర్థం చేయిస్తారు కానీ తరచుగా మాతలే బ్రాహ్మణీలుగా అయ్యి దారి తెలుపుతారు. అందువల్లనే దేవీల కీర్తి ఎక్కువగా ఉంది. ఎక్కువగా దేవీల పూజలు జరుగుతాయి. అర్ధకల్పము మీరు పూజ్యులుగా ఉండేవారని కూడా మీకు తెలుసు. మొదట సంపూర్ణ పూజ్యులుగా, తర్వాత సగము పూజ్యులుగా అవుతారు. ఎందుకంటే రెండు కళలు తగ్గిపోతాయి. రాముని వంశము త్రేతాలో ఉంటుందని అంటారు. వారైతే లక్షల సంవత్సరాలని చెప్తారు. అందుకు ఏ లెక్కాచారమూ ఉండదు. భక్తిమార్గములోని వారి బుద్ధికి, మీ బుద్ధికి రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది! మీది ఈశ్వరీయ బుద్ధి, వారిది రావణ బుద్ధి ఈ చక్రమంతా 5 వేల సంవత్సరాలదని, అది తిరుగుతూ ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. రాత్రిలో ఉన్నవారు లక్షల సంవత్సరాలని అంటారు. పగలులో ఉన్నవారు 5 వేల సంవత్సరాలని చెప్తారు. అర్ధకల్పము భక్తిమార్గములో మీరు అసత్యమైన విషయాలనే విన్నారు. సత్యయుగములో ఇలాంటి విషయాలే ఉండవు. అక్కడైతే వారసత్వము లభిస్తుంది. మీకిప్పుడు ప్రత్యక్షంగా మతము లభిస్తుంది. శ్రీమద్బగవద్గీత ఉంది కదా. మరే శాస్త్రాలకు శ్రీమత్‌ అను పేరు లేదు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత ఈ పురుషోత్తమ సంగమ యుగము, గీతా యుగము వస్తుంది. లక్షల సంవత్సరాలు ఉండేందుకు వీలు లేదు. ఎప్పుడైనా ఎవరైనా వస్తే వారిని సంగమ యుగము వద్దకు తీసుకెళ్లండి. బేహద్‌ తండ్రి రచయిత అనగా తమ పరిచయాన్ని రచన యొక్క పరిచయమునంతా ఇచ్చారని చెప్పండి. అచ్ఛా, తండ్రిని స్మృతి చేయండి, మరేమీ ధారణ చేయలేకపోతే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు. పవిత్రంగా అయితే అవ్వాల్సిందే. తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటారు కావున దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. మంచిది!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. 21 జన్మల వరకు పదమాల సంపాదన జమ చేసుకునేందుకు నేరుగా ఈశ్వరీయ సేవలో సర్వస్వమూ సఫలము చేయండి. నిమిత్తమాత్రులై శివబాబా పేరు పై సేవ చేయండి.
2. స్మృతిలో ఎంత సమయము కూర్చుంటారో అంత సమయము బుద్ధి ఎక్కడెక్కడకు వెళ్తుందో చెక్‌ చేసుకోవాలి. తమ సత్య-సత్యమైన లెక్కాచారాన్ని సత్యంగా వ్రాయాలి. నరుని నుండి నారాయాణునిగా అయ్యేందుకు తండ్రి మరియు వారసత్వము స్మృతిలో ఉండాలి.

వరదానము :- '' అవినాశి ప్రాప్తుల స్మృతి ద్వారా మీ శ్రేష్ఠ భాగ్యపు స్మృతిలో ఉండే ఇచ్ఛా మాత్రం అవిద్యా భవ ''
స్వయం భాగ్యవిధాతయే తండ్రి అయినప్పుడు వారి భాగ్యమెలా ఉంటుంది! భాగ్యము మా జన్మ సిద్ధ అధికారమనే ఖుషీలో సదా ఉండండి - ''వాహ్‌! నా శ్రేష్ఠ భాగ్యము, వాహ్‌! భాగ్యవిధాత నా తండ్రి'' అనే పాట పాడుతూ సంతోషంగా ఎగురుతూ ఉండండి. అనేక జన్మలకు జతలో ఉండే ఎవ్వరూ లాక్కోలేని, లూటీ చేయలేని అవినాశి ఖజానా లభించింది. ఇది ఎంత గొప్ప భాగ్యము! ఎలాంటి కోరికా లేదు. మానసిక సంతోషము లభించిందంటే సర్వ ప్రాప్తులు లభించాయి. అప్రాప్తి వస్తువే లేదు అందువలన మీరు ఇచ్ఛా మాత్రం అవిద్యగా అయిపోయారు.

స్లోగన్‌ :- '' వికర్మలు చేసే సమయం అయిపోయింది. ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు, మాటలు కూడా చాలా మోసం చేస్తాయి. ''

No comments:

Post a Comment