Tuesday, September 17, 2019

Telugu Murli 11/09/2019

11-09-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - బేహద్‌ (అనంతమైన) ఉపకారవేతనము (స్కాలర్‌షిప్‌) తీసుకోవాలంటే, ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ స్మృతి రాని విధంగా అభ్యాసము చేయండి ''

ప్రశ్న :- తండ్రికి చెందిన వారిగా అయిన తర్వాత కూడా సంతోషము లేనందుకు కారణమేమి ?
జవాబు :- 1. బుద్ధిలో పూర్తి జ్ఞానముండదు. 2. తండ్రిని యధార్థంగా స్మృతి చేయరు. స్మృతి చేయనందు వలన మాయ మోసము చేస్తుంది. అందువలన ఖుషీ ఉండదు. తండ్రి మనలను విశ్వాధికారులుగా చేస్తున్నారనే నషా పిల్లలైన మీ బుద్ధిలో ఉంటే సదా ఉల్లాసంగా, సంతోషంగా ఉంటారు. తండ్రి వారసత్వమైన పవిత్రత, సుఖ-శాంతులలో సంపన్నంగా(ఫుల్‌గా) అయితే ఖుషీ ఉంటుంది.

ఓంశాంతి. ఓంశాంతి అనగా - నేను ఆత్మ, ఇది నా శరీరము అని పిల్లలైన మీకు బాగా తెలుసు. దీనిని బాగా గుర్తుంచుకోండి. భగవంతుడు అనగా ఆత్మల తండ్రి, మనలను చదివిస్తున్నారు. ఇలా ఎక్కడైనా విన్నారా? వారైతే కృష్ణుడు చదివిస్తున్నారని అనుకుంటారు. కాని వారికైతే నామ-రూపాలున్నాయి కదా. ఇక్కడ చదివించేవారు నిరాకార తండ్రి. ఆత్మ వింటుంది, పరమాత్మ వినిపిస్తారు. ఇది నూతన విషయము కదా! వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది కదా. ఒకటి వినాశ కాలములో విపరీత బుద్ధి, రెండవది వినాశ కాలములో ప్రీతి బుద్ధి. ఇంతకుముందు పిల్లలైన మీరు కూడా ఈశ్వరుడు సర్వవ్యాపి, రాయి-రప్పలలో ఉన్నారు అని అనేవారు. ఈ విషయాలన్నీ బాగా అర్థము చేసుకోవాలి. ఆత్మ అవినాశి, శరీరము వినాశి అని అర్థం చేయించారు. ఆత్మ ఎప్పటికీ తరగదు, పెరగదు. ఇంత చిన్న ఆత్మయే 84 జన్మలు తీసుకొని మొత్తం పాత్రనంతా అభినయిస్తుంది. ఆత్మయే శరీరాన్ని నడిపిస్తుంది. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి చదివిస్తారు కనుక పదవి కూడా తప్పకుండా ఉన్నతమైనదే లభిస్తుంది. ఆత్మయే చదువుకొని పదవిని పొందుతుంది. ఆత్మను ఎవ్వరూ చూడలేరు. ఆత్మ ఎలా వస్తుంది? ఎక్కడ నుండి వెళ్తుంది? అని చూచేందుకు చాలా ప్రయత్నిస్తారు. కాని తెలుసుకోలేరు. ఒకవేళ ఎవరైనా చూసినా అర్థము చేసుకోలేరు. ఆత్మయే శరీరములో నివసిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ వేరు, శరీరము వేరు. ఆత్మ చిన్నదిగా, పెద్దదిగా మారదు. చిన్నదిగా ఉన్న శరీరము పెద్దదవుతుంది. ఆత్మయే పతితంగా మరియు పావనంగా అవుతుంది. '' పతితాత్మలను పావనంగా తయారు చేసే ఓ బాబా రండి! '' అని ఆత్మయే తండ్రిని పిలుస్తుంది. ఆత్మలందరూ వధువులు(బ్రైడ్స్‌/దీతీఱసవర), ప్రేయసులని, వారు రాముడని, వరుడు(బ్రైడ్‌గ్రూమ్‌/దీతీఱసవస్త్రతీశీశీఎ) ఒక్కరే అని కూడా అర్థం చేయించారు. వారు అందరినీ వరులని అనేస్తారు. ఇప్పుడు వరుడు అందరిలో ప్రవేశించేందుకు వీలు లేదు. ఈ విధంగా బుద్ధిలో వ్యతిరేక జ్ఞానమున్నందు వల్లనే కిందకు దిగజారుతూ వచ్చారు. ఎందుకంటే చాలా నిందిస్తూ, పాపాలు చేస్తూ, అవమానిస్తూ వచ్చారు. తండ్రిని చాలా ఎక్కువగా నిందించారు. పిల్లలెప్పుడైనా తండ్రిని నిందిస్తారా! కాని ఈ రోజుల్లోని పిల్లలు చెడిపోయినప్పుడు తండ్రిని నిందించేందుకు కూడా వెనుకాడరు. కాని వీరు బేెహద్‌ తండ్రి. బాబా మీరు కూర్మావతారము, మత్స్యావతారులంటూ ఆత్మయే బేహద్‌ తండ్రిని అవమానిస్తుంది. రాణులను ఎత్తుకెళ్లాడని, వెన్న దొంగిలించాడని కృష్ణుని కూడా నిందించి గ్లాని చేశారు. వెన్న దొంగిలించే అవసరము అతడికేముంది. బుద్ధి ఎంత తమోప్రధానంగా తయారయింది! నేను వచ్చి మిమ్ములను పావనంగా చేసేందుకు చాలా సహజమైన యుక్తిని తెలుపుతున్నానని తండ్రి అంటారు. తండ్రియే పతితపావనులైన సర్వశక్తివంతులైన అథారిటి. సాధు-సన్యాసులు మొదలైనవారిని శాస్త్రాల అథారిటి అని అంటారు. శంకరాచారిని కూడా వేదశాస్త్రాల అథారిటి అని అంటారు. వారికి ఎంత అట్టహాసము ఉంది! శివాచార్యునికైతే ఏ ఆడంబరము లేదు. వీరి వద్ద ఏ గుంపూ లేదు. వీరు కూర్చొని అన్ని వేదశాస్త్రాల సారమునంతా వినిపిస్తారు. ఒకవేళ శివబాబా అట్టహాసము చూపిస్తే మొదట ఇతడు(బ్రహ్మ) కూడా ఆడంబరమును చూపించుకోవాలి. కాని అలా కాదు. నేను పిల్లలైన మీ సేవకుడనని తండ్రి అంటారు. ఇతనిలో తండ్రి ప్రవేశించి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు పతితమయ్యారు. పావనమైన మీరే 84 జన్మల తర్వాత పతితమయ్యారని పిల్లలకు అర్థము చేయిస్తారు. ఈ చరిత్ర-భూగోళాలు మళ్లీ పునరావృతమౌతాయి. ఇతడే 84 జన్మలు అనుభవించాడు. మళ్లీ వారికే సతోప్రధానంగా అయ్యే యుక్తిని తెలుపుతారు. తండ్రియే సర్వశక్తివంతులు. బ్రహ్మ ద్వారా అన్ని వేదశాస్త్రాల సారమునంతా అర్థం చేయిస్తారు. చిత్రాలలో బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. కానీ వాస్తవానికి శాస్త్రాల విషయమే లేదు. బాబా వద్దా శాస్త్రాలు లేవు, ఇతడి వద్దా శాస్త్రాలు లేవు, మీ వద్ద కూడా శాస్త్రాలు లేవు. వీరైతే మీకు నిత్యము క్రొత్త క్రొత్త విషయాలు వినిపిస్తారు. శాస్త్రాలన్నీ భక్తిమార్గములోనివని మీకు తెలుసు. నేను శాస్త్రాలను వినిపించను. నేను మీకు ఇతని నోటి ద్వారా వినిపిస్తాను. మీకు రాజయోగమును నేర్పిస్తాను. దీనికే భక్తిమార్గములో భగవద్గీత అని పేరు పెట్టేశారు. నా వద్ద కాని, మీ వద్ద కాని గీత మొదలైనవేమైనా ఉన్నాయా? ఇది చదువు. చదువులో అధ్యాయాలు, శ్లోకాలు మొదలైనవి ఉండవు. నేను పిల్లలైన మిమ్ములను చదివిస్తున్నాను. కల్ప-కల్పము ఇలాగే చదివిస్తూ ఉంటాను. స్వయాన్ని ఆత్మగా భావించమని ఎంత సహజమైన విషయాన్ని అర్థం చేయిస్తాను. ఈ శరీరమైతే మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ అవినాశి, శరీరము క్షణ-క్షణము(తగులబడుతూ) క్షీణిస్తూ ఉంటుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకుంటుంది.
నేను ఒకేసారి వస్తానని తండ్రి చెప్తారు. శివరాత్రిని జరుపుకుంటారు కూడా. వాస్తవానికి శివజయంతి అని ఉండాలి కాని జయంతి అని చెప్తే తల్లి గర్భము ద్వారా జన్మ తీసుకున్నట్లవుతుంది కనుక శివరాత్రి అని అంటారు. ద్వాపర-కలియుగాలు అనే రాత్రిలో నన్ను వెతుకుతారు. నన్ను సర్వవ్యాపి అని అంటారు. కనుక మీలో కూడా ఉన్నట్లే కదా. మరెందుకు నన్ను వెతుకుతారు? సాక్షాత్‌ దేవతలుగా ఉన్నవారు ఆసురీ సాంప్రదాయస్థులుగా అవుతారు. దేవతలు ఎప్పుడైనా సారాయి తాగుతారా? ఆ దైవీ సాంప్రదాయ ఆత్మలే దిగజారినప్పుడు సారాయి మొదలైనవి తాగడం మొదలుపెట్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము తప్పకుండా వినాశనమవుతుందని తండ్రి చెప్తారు. పాత ప్రపంచములో అనేక ధర్మాలున్నాయి. కొత్త ప్రపంచములో ఒకే ధర్మము ఉంటుంది. ఒక్క ధర్మము నుండే అనేక ధర్మాలు వెలువడినాయి. మళ్లీ అన్నీ కలిసి ఒకే ధర్మంగా అవ్వాలి. కలియుగము ఇంకా ఇప్పుడు 40 వేల సంవత్సరాలుందని మనుష్యులు అనేస్తారు. దీనిని ఘోరాంధకారమని అంటారు. జ్ఞానసూర్యుడు ఉదయించగానే అజ్ఞానాంధకారము నశించిందని (జ్ఞాన సూర్య ప్రగటా, అజ్ఞాన్‌ అంధేరా వినాశ్‌.........) గాయనముంది. మానవులలో చాలా అజ్ఞానముంది. తండ్రి జ్ఞానసూర్యులు. జ్ఞానసాగరులు వస్తే భక్తిమార్గములో మీలో ఉన్న అజ్ఞానము తొలగిపోతుంది. మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అవుతారు. తుప్పు, మురికి వదిలిపోతుంది. ఇది యోగాగ్ని. కామాగ్ని నల్లగా తయారు చేస్తుంది. యోగాగ్ని అనగా శివబాబా స్మృతి పవిత్రంగా, తెల్లగా చేస్తుంది. కృష్ణునికి శ్యామసుందరుడని పేరు పెట్టారు. కాని అర్థము తెలియదు. తండ్రి వచ్చి అర్థము చేయిస్తారు. మొట్టమొదట సత్యయుగములో ఎంత సుందరంగా ఉండేవాడు. ఆత్మ పవిత్రంగా, సుందరంగా ఉంటే సుందరమైన, పవిత్రమైన శరీరమునే తీసుకుంటుంది. అక్కడ ధనము, సంపత్తులు అన్నీ కొత్తవిగా ఉంటాయి. కొత్త భూమి మళ్లీ పాతదిగా అవుతుంది. ఇప్పుడీ పాత ప్రపంచము తప్పకుండా వినాశనమవ్వాలి. దీని కొరకు చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా కులమును మేమే వినాశనము చేసుకుంటున్నామని వారు(విదేశీయులు) ఎంతగా భావిస్తారో అంతగా భారతీయులు భావించరు. ఎవరో ప్రేరకులు ఉన్నారు. విజ్ఞానము ద్వారా మా వినాశనము మేమే చేసుకుంటున్నామని విదేశీయులు భావిస్తారు. క్రీస్తు పూర్వము 3 వేల సంవత్సరాల క్రితము స్వర్గముండేదని కూడా వారు భావిస్తారు. ఈ దేవీ దేవతల రాజ్యముండేది. భారతదేశమే ప్రాచీనంగా ఉండేది. ఈ రాజయోగము ద్వారా లక్ష్మినారాయణులు ఈ విధంగా అయ్యారు. ఆ రాజయోగమును మళ్లీ తండ్రియే నేర్పించగలరు. సన్యాసులు నేర్పించలేరు. ఈ రోజుల్లో ఎంత మోసము చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి మేము భారతదేశపు ప్రాచీన యోగము నేర్పిస్తామని చెప్తారు మళ్లీ మరొకవైపు గుడ్లు తినవచ్చు, మత్తు పానీయాలు మొదలైనవి భలే తాగండి, ఏమైనా చేయండి అని చెప్తారు. మరి వారు రాజయోగమును ఎలా నేర్పించగలరు! మనుష్యులను దేవతలుగా ఎలా తయారు చేయగలరు? ఆత్మ ఎంత ఉన్నతమైనది! పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ సతోప్రధానమైన ఆత్మ తమోప్రధానంగా అయిపోతుందని తండ్రి అర్థం చేయిస్తారు. మీరిప్పుడు మళ్లీ స్వర్గమును స్థాపిస్తున్నారు. అక్కడ ఏ ఇతర ధర్మము ఉండనే ఉండదు. ఇప్పుడు తప్పకుండా నరకము వినాశనమవ్వనున్నదని తండ్రి చెప్తున్నారు. ఇక్కడి వరకు వచ్చినవారు తప్పకుండా స్వర్గానికి వెళ్తారు. శివబాబా జ్ఞానమును కొద్దిగా విన్నా తప్పకుండా స్వర్గములోకి వెళ్తారు. తర్వాత ఎంతగా చదువుకుంటారో, తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు అందరికీ వినాశకాలమే. ఎవరైతే వినాశ కాలములో ప్రీతిబుద్ధి కలిగి ఉంటారో, తండ్రిని తప్ప మరెవ్వరినీ స్మృతి చేయరో వారే ఉన్నత పదవిని పొందుతారు. దీనిని బేహద్‌ స్కాలర్‌షిప్‌ అని అంటారు. ఈ విషయములో రేస్‌ చేయాలి. ఇది ఈశ్వరీయ లాటరీ. మొదట స్మృతి, రెండవది దైవీగుణాలు ధారణ చేయాలి. రాజ-రాణిగా అవ్వాలంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. కొందరు చాలా మంది ప్రజలను తయారు చేస్తారు కొందరు కొద్ది మందినే తయారు చేస్తారు. సర్వీసు ద్వారా ప్రజలు తయారవుతారు. మ్యూజియం, ప్రదర్శిని మొదలైన వాటిలో చాలా మంది ప్రజలు తయారవుతారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు తర్వాత సూర్యవంశము, చంద్రవంశములోకి వెళ్లారు. మీరిప్పుడు బ్రాహ్మణ కులస్థులు. తండ్రి బ్రాహ్మణ కులమును దత్తు తీసుకొని వారిని చదివిస్తారు. నేను ఒక కులమును, రెండు వంశాలను తయారు చేస్తానని తండ్రి చెప్తారు. సూర్యవంశ మహారాజ-మహారాణి, చంద్రవంశి రాజా-రాణులను డబల్‌ కిరీటధారులని అంటారు. మళ్లీ తర్వాత వికారీ రాజులుగా అయినప్పుడు వారికి ప్రకాశ కిరీటము ఉండదు. ఆ డబల్‌ కిరీటధారులైన వారి మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు. పవిత్రుల ఎదుట తల వంచి నమస్కరిస్తారు. సత్యయుగములో ఈ విషయాలు ఉండవు. అది పావన ప్రపంచము. అక్కడ పతితులు ఉండనే ఉండరు. దానిని సుఖధామము, నిర్వికారి ప్రపంచమని అంటారు. దీనిని వికారీ ప్రపంచమని అంటారు. ఇక్కడ ఒక్కరు కూడా పావనంగా లేరు. సన్యాసులు ఇల్లు-వాకిలి వదిలి పారిపోతారు. రాజా గోపీచందుని ఉదాహరణ కూడా ఉంది కదా. మానవులెవ్వరూ ఒకరికొకరు గతి-సద్గతిని ఇవ్వలేరని మీకు తెలుసు. సర్వుల సద్గతిదాతను నేను ఒక్కరినే. నేను వచ్చి అందరినీ పావనంగా చేస్తాను. ఒకటేమో పావనంగా అయ్యి శాంతిధామానికి వెళ్లిపోతారు, రెండవది పవిత్రమై సుఖధామానికి వెళ్లిపోతారు. ఇది అపవిత్రమైన దు:ఖధామము. సత్యయుగములో జబ్బులు మొదలైనవేవీ ఉండవు. మీరు ఆ సుఖధామానికి అధికారులుగా ఉండేవారు. తర్వాత రావణరాజ్యములో దు:ఖధామానికి అధికారులుగా అయ్యారు. కల్ప-కల్పము మీరు నా శ్రీమతానుసారము స్వర్గమును స్థాపిస్తారు. కొత్త ప్రపంచ రాజ్యమును తీసుకుంటారు. తర్వాత మళ్లీ పతితులుగా, నరకవాసులుగా అవుతారు. దేవతలే మళ్లీ వికారులుగా అవుతారు. వామమార్గములో దిగజారిపోతారు అని తండ్రి చెప్తారు.
మధురాతి మధురమైన పిల్లలకు పురుషోత్తమ సంగమ యుగములో నేను ఒకేసారి వస్తానని, యుగ యుగములో రానని, కల్పము యొక్క సంగమ యుగములో వస్తానని తండ్రి వచ్చి తమ పరిచయమునిచ్చారు. కల్పము యొక్క సంగమములో ఎందుకు వస్తాను? ఎందుకంటే నరకమును స్వర్గంగా చేస్తాను. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తాను. బాబా, మాకు ఖుషీ లేదు, ఉల్లాసము లేదు అని కొంతమంది పిల్లలు వ్రాస్తారు. అరే, తండ్రి మిమ్ములను విశ్వాధికారులుగా చేస్తారు, ఇలాంటి తండ్రిని స్మృతి చేసినా మీకు ఖుషీ ఉండదా! మీరు పూర్తిగా స్మృతి చేయరు అందుకే ఖుషీ ఉండదు. పతితంగా తయారు చేయు పతిని ఖుషీగా స్మృతి చేస్తారు, డబల్‌ కిరీటధారిగా చేసే తండ్రిని స్మృతి చేస్తే ఖుషీ ఉండదా! తండ్రికి పిల్లలుగా అయ్యారు అయినా ఖుషీ లేదని చెప్తారు అంటే జ్ఞానము అర్థం చేయిస్తారు! రాతిబుద్ధి గలవారిగా తయారైన ఆత్మలను పారసబుద్ధిగా తయారుచేస్తాను. జ్ఞానసాగరులైన ఫుల్‌గా, ప్రేమలో ఫుల్‌గా(సంపూర్ణముగా) ఉన్నారు. జ్ఞానసాగరులు, సుఖసాగరులు, ప్రేమసాగరులు కదా. అలాంటి తండ్రి ద్వారా మీకు ఈ వారసత్వము లభిస్తుంది. ఇలా (లక్ష్మినారాయణులుగా) అయ్యేందుకే మీరు వస్తారు. మిగిలిన సత్సంగాలు మొదలైనవన్నీ భక్తిమార్గములోనివి. అందులో లక్ష్యమేమీ ఉండదు. దీనినైతే గీతాపాఠశాల అని అంటారు. వేదపాఠశాల ఉండదు. గీత ద్వారా నరుని నుండి నారాయణునిగా అవుతారు. తండ్రియే తప్పకుండా తయారు చేస్తారు కదా. మనుష్యులు మనుష్యులను దేవతలుగా చేయలేరు. పిల్లలారా! స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి పదే పదే పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరు దేహము కాదు. నేను ఒక దేహమును వదిలి మరొక దేహమును తీసుకుంటానని ఆత్మయే చెప్తుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఎలాగైతే శివబాబాకు ఏ అట్టహాసమూ లేదో, సేవకుడై పిల్లలను చదివించేందుకు వచ్చారో, అలా తండ్రి సమానంగా అథారిటీ ఉన్నా తండ్రి వలె నిరహంకారులుగా ఉండాలి. పావనంగా అయి పావనంగా చేయు సేవ చేయాలి.
2. వినాశకాల సమయములో ఈశ్వరీయ లాటరీని తీసుకునేందుకు ప్రీతిబుద్ధి గలవారై స్మృతి చేస్తూ దైవీగుణాలు ధారణ చేసేందుకు పోటీ పడాలి (రేస్‌ చేయాలి).

వరదానము :- '' ఈశ్వరీయ సేవ ద్వారా వెరైటి మేవాను (ఆహారాన్ని) ప్రాప్తి చేసుకునే అధికారి ఆత్మా భవ ''
సేవ చేస్తే మేవా(బలమైన ఆహారము) లభిస్తుందని అంటారు. ఈశ్వరీయ జ్ఞానమివ్వడమే ఈశ్వరీయ సేవ. ఎవరైతే ఈ సేవ చేస్తారో వారికి అతీంద్రియ సుఖము, శక్తులు, సంతోషాలనే వెరైటి మేవా లభిస్తుంది. బ్రాహ్మణులైన మీరే ఇందుకు అధికారులు. ఎందుకంటే ఈశ్వరీయ చదువును చదవడం, చదివించడమే మీ కర్తవ్యము. దీని ద్వారానే మీరు ఈశ్వరునికి చెందినవారిగా అవుతారు. కనుక ఈశ్వరీయ సేవ చేసినందున ఈశ్వరీయ ఫలానికి అధికారులుగా అయిపోయామనే నషాలో ఉండండి.

స్లోగన్‌ :- '' తండ్రి జతలో ఉండి కర్మలు చేస్తే డబల్‌లైట్‌గా ఉంటారు ''

No comments:

Post a Comment