Monday, October 7, 2019

Telugu Murli 08/10/2019

08-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - సత్యమైన తండ్రితో సత్యంగా ఉండండి, సత్యమైన చార్టును ఉంచండి. జ్ఞాన అహంకారమును వదిలి స్మృతిలో ఉండి పూర్తిగా పురుషార్థము చేయండి ''

ప్రశ్న :- మహావీర పిల్లల ముఖ్యమైన గుర్తు ఏది ?
జవాబు :- ఎవరి బుద్ధిలో నిరంతరము తండ్రి స్మృతి ఉంటుందో, వారు మహావీర పిల్లలు. మహావీరులనగా శక్తివంతులు. మహావీరులనగా వారు నిరంతరము సంతోషంగా ఉంటారు. వారు ఆత్మాభిమానులుగా ఉంటారు, వారికి ఏ మాత్రము దేహాభిమానము, దేహ అహంకారము ఉండదు. ఇటువంటి మహావీరుల బుద్ధిలో - నేను ఆత్మను, బాబా నన్ను చదివిస్తున్నారని ఉంటుంది.

ఓంశాంతి. ఆత్మల తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు - మిమ్ములను మీరు ఆత్మలుగా భావించి కూర్చుని ఉన్నారా? ఎందుకంటే ఇది కొంచెము కష్టమని, ఇందులోనే శ్రమ ఉందని తండ్రికి తెలుసు. ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చొని ఉన్నవారినే మహావీరులని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయు వారిని మహావీరులంటారు. సదా స్వయాన్ని ప్రశ్నించుకుంటూ ఉండండి - '' నేను ఆత్మాభిమానిగా ఉన్నానా? '' స్మృతి ద్వారానే మహావీరులుగా అనగా సుప్రీమ్‌గా అవుతారు. ఇతర ధర్మాల వారెవ్వరూ ఇంత సుప్రీమ్‌గా అవ్వలేరు. వారు వచ్చేది కూడా ఆలస్యంగా వస్తారు. మీరు నెంబరు అనుసారం సుప్రీమ్‌గా అవుతారు. సుప్రీమ్‌ అనగా శక్తివంతులు లేక మహావీరులు. వారికి ఆంతరికములో నేను ఆత్మననే ఖుషీ ఉంటుంది. అంతేకాక సర్వాత్మల తండ్రి మమ్ములను చదివిస్తున్నారనే సంతోషము కూడా ఉంటుంది. కొంతమంది తమ చార్టు 25 శాతము, కొంతమంది 100 శాతము చూపిస్తారని కూడా తండ్రికి తెలుసు. కొంతమంది 24 గంటలలో అర్ధగంట మాత్రమే స్మృతి ఉంటుందని అంటారు. కావున ఎంత శాతమవుతుంది? మీ పై మీరు చాలా గమనముంచుకోవాలి. నెమ్మది నెమ్మదిగా మహావీరులుగా అవ్వాలి. వెంటనే అవ్వలేరు. ఇందులో శ్రమ ఉంది. బ్రహ్మజ్ఞానులు, తత్వజ్ఞానులు స్వయాన్ని ఆత్మగా భావిస్తారని అనుకోకండి. వారు బ్రహ్మ తత్వమును అనగా బ్రహ్మ ఉండే నివాస స్థానమునే పరమాత్మగా భావిస్తారు. స్వయాన్ని అహం బ్రహ్మాస్మి అని అంటారు. ఇప్పుడు ఇంటితో యోగము చేయరాదు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు. 24 గంటలలో మేము ఎంత సమయము స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నాము? అని మీ చార్టు చూసుకోవాలి. ఇప్పుడు మనము ఈశ్వరీయ సేవ చేస్తున్నాము, ఈశ్వరీయ సేవలో ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి కేవలం మన్మనాభవ అనగా స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారని అందరికీ తెలపండి. ఇదే మీరు చేసే సేవ. మీరు ఎంత సేవ చేస్తారో అంత ఫలితము కూడా లభిస్తుంది. ఈ విషయాలు చాలా బాగా అర్థము చేసుకోవాలి. మంచి-మంచి మహారథులైన పిల్లలు కూడా ఈ విషయాన్ని పూర్తిగా అర్థము చేసుకోరు. ఇందులో చాలా శ్రమ ఉంది. శ్రమ పడకుండా ఫలితము లభించదు.
కొంతమంది చార్టు వ్రాసి పంపిస్తారు. కొంతమంది పంపనే పంపరు. జ్ఞాన అహంకారము చాలా ఉంది. స్మృతిలో కూర్చునే శ్రమ చేయరు. ముఖ్యమైన విషయము 'స్మృతి' యేనని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నా చార్టు ఎలా ఉంది? అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. ఎలా ఉందో నోట్‌ చేసుకుంటూ ఉండాలి. చార్టు వ్రాసే ఫుర్సత్తే లేదని చాలామంది అంటూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చేయడమే ముఖ్యమైనదని తండ్రి చెప్తున్నారు. ఇచ్చట స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా మధ్య మధ్యలో నేను ఎంత సమయము స్మృతిలో ఉన్నానని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు స్మృతిలోనే ఉండాలి. చక్రము తిప్పినా పర్వాలేదు. మనము బాబా వద్దకు తప్పకుండా వెళ్లాలి. పవిత్రులై సతోప్రధానంగా అయ్యి వెళ్లాలి. ఈ విషయాన్ని చాలా బాగా తెలుసుకోవాలి. చాలామంది వెంటనే మర్చిపోతారు. తమ సత్యమైన చార్టును తెలుపరు. ఇలాంటి మహారథులు చాలామంది ఉన్నారు. సత్యమెప్పుడూ చెప్పనే చెప్పరు. అర్ధకల్పము అసత్య ప్రపంచము కొనసాగినందున అసత్య సంస్కారము ఆంతరికములో గట్టి పడిపోయింది. ఇందులో కూడా సాధారణంగా ఉండేవారు వెంటనే చార్టు వ్రాస్తారు. స్మృతియాత్ర ద్వారా మీరు పాపాలను భస్మము చేసుకొని పావనమౌతారని తండ్రి చెప్తున్నారు. కేవలం జ్ఞానము ద్వారా పావనంగా అవ్వలేరు. స్మృతి యాత్ర ముఖ్యమైనది. మిగిలింది ఎంత ఉన్నా ఏం లాభము? మీరు పిలిచింది పావనంగా అయ్యేందుకే. పావనంగా అవ్వాలంటే స్మృతి చెయ్యాలి. ప్రతి ఒక్కరు సత్యంగా తమ తమ చార్టు తెలపాలి. ఇక్కడ మీరు ముప్పాతిక గంట కూర్చున్నప్పుడు, నేను ఎంత సమయము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉన్నాను? అని స్వయం పరిశీలించుకోవాలి. చాలామంది సత్యము చెప్పేందుకు సిగ్గుపడ్తారు. తండ్రికి సత్యము చెప్పరు. వారు సేవను గురించిన సమాచారము - ఇది చేశాను, ఇంత సేవ చేశాను, ఇంతమందికి అర్థం చేయించాను అని తెలుపుతారు. కానీ స్మృతియాత్రను గురించిన చార్టు వ్రాయరు. తండ్రి చెప్తున్నారు - స్మృతియాత్రలో లేనందునే మీ బాణము ఎవ్వరికీ తగలదు. జ్ఞాన ఖడ్గములో స్మృతి అనే పదును నింపుకోరు. జ్ఞానమేమో వినిపిస్తారు. పోతే యోగబాణము తగలడం చాలా కష్టము. బాబా చెప్తున్నారు - 45 నిమిషాలలో 5 నిమిషాలు కూడా స్మృతియాత్రలో కూర్చుని ఉండరు. స్వయాన్ని ఆత్మగా భావించి ఎలా స్మృతి చేయాలో వారికి అర్థము కాదు. చాలామంది మేము నిరంతరము స్మృతిలో ఉంటామని అంటారు. బాబా చెప్తున్నారు - ఈ స్థితి ఇప్పుడే రాదు. నిరంతరము స్మృతిలో ఉంటే ఇప్పటికి కర్మాతీత స్థితి వచ్చేయాలి. జ్ఞాన పరాకాష్ట అందుకొని ఉండాలి. వారు ఇతరులకు కొద్దిగా అర్థం చేయించినా వారికి బాణము బాగా తగులుతుంది. శ్రమ ఉంటుంది కదా. విశ్వానికి అధికారులుగా ఎవ్వరూ ఊరికే అవ్వలేరు. మాయ మీ బుద్ధి యోగమును ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది. బంధు-మిత్రులు మొదలైనవారు గుర్తుకు వస్తూ ఉంటారు. ఎవరైనా విదేశాలకు వెళ్లవలసి వస్తే వారి బంధు-మిత్రులు స్టీమరు, విమానము మొదలైనవన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్లే కోరిక వారిని లాగుతూ ఉంటుంది. బుద్ధి యోగము పూర్తిగా వేరైపోతుంది. ఇతరవైపులకు బుద్ధి వెళ్లకుండా ఉండడం చాలా కష్టమైన విషయము. కేవలం ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. ఈ దేహము కూడా గుర్తు రాకూడదు. మీకు ఈ స్థితి చివర్లో వస్తుంది.
రోజు రోజుకు స్మృతియాత్ర ఎంతెంత పెంచుకుంటూ ఉంటారో అంత కళ్యాణము ఉంటుంది. ఎంత స్మృతిలో ఉంటారో అంత సంపాదన ఉంటుంది. శరీరాన్ని వదిలితే ఆ సంపాదన చేయలేరు. చిన్న శిశువుగా జన్మిస్తారు. కావున సంపాదించలేరు. ఆత్మ ఈ సంస్కాన్ని తీసుకెళ్లినా స్మృతిని కలుగజేసే టీచరు కావాలి కదా. తండ్రిని స్మృతి చేయమని వారు కూడా స్మృతినిప్పించాలి కదా. తండ్రి స్మృతి ద్వారా మాత్రమే పావనంగా అవుతారని మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. వారు గంగా స్నానమే శ్రేష్ఠమని అనుకుంటారు. అందువలన గంగా స్నానమే చేస్తూ ఉంటారు. ఈ బాబా ఇవన్నీ అనుభవించినవారే కదా. ఇతను అనేకమంది గురువులను ఆశ్రయించారు. వారు నీటితో స్నానము చేసేందుకు వెళ్తారు. ఇక్కడ మీరు స్మృతి యాత్రలో స్నానము చేస్తారు. తండ్రి స్మృతి ద్వారా తప్ప దేనితో కూడా ఆత్మ పావనంగా అవ్వనే అవ్వలేదు. దాని పేరే యోగము అనగా స్మృతియాత్ర. జ్ఞానాన్ని స్నానమని అనుకోరాదు. ఇది యోగ స్నానము. జ్ఞానమనగా చదువు. యోగ స్నానము ద్వారా పాపాలు తొలగిపోతాయి. జ్ఞానము మరియు యోగము - రెండు వేరు వేరు విషయాలు. స్మృతి ద్వారానే జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. తండ్రి చెప్తున్నారు - ఈ స్మృతియాత్ర ద్వారానే మీరు పావనమై సతోప్రధానంగా అవుతారు. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలారా! జ్ఞానమును చాలా బాగా అర్థము చేసుకోండి. ఇది మర్చిపోరాదు. స్మృతియాత్ర ద్వారానే జన్మ-జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. పోతే జ్ఞానము ద్వారా సంపాదన జరుగుతుంది. స్మృతి, చదువు ఈ రెండు వేరు వేరు విషయాలు. జ్ఞాన-విజ్ఞానాలు. జ్ఞానమనగా చదువు, విజ్ఞానమనగా యోగము అనగా స్మృతి. జ్ఞాన-యోగాలలో దేనిని శ్రేష్ఠమని అనుకుంటున్నారు. స్మృతియాత్ర చాలా గొప్పది. దీనిలోనే కష్టముంది. అందరూ స్వర్గానికేమో వెళ్తారు. సత్యయుగము స్వర్గము. త్రేతా యుగము సగము(సెమీ, అసంపూర్ణ) స్వర్గము. ఈ చదువు అనుసారము అక్కడకు వెళ్లి విరాజమానమై ఉంటారు. ముఖ్యమైనది యోగము. ఎగ్జిబిషన్‌, మ్యూజియమ్‌ మొదలైన వాటిలో కూడా మీరు జ్ఞానము అర్థం చేయిస్తారు. యోగము చేయించలేరు, అర్థం చేయించలేరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు. జ్ఞానము విస్తారంగా తెలుపుతారు. తండ్రి చెప్తున్నారు - ముఖ్యంగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని తెలపండి. ఈ జ్ఞానమునిచ్చేందుకే మీరు ఇన్ని చిత్రాలు మొదలైనవి తయారు చేస్తున్నారు. యోగము కొరకు చిత్రాలు అవసరము లేదు. జ్ఞానము అర్థం చేయించేందుకు చిత్రాలు తయారుచేయబడ్తాయి. స్వయాన్ని ఆత్మగా భావించడం వలన దేహ అహంకారము పూర్తిగా తొలగిపోతుంది. జ్ఞానాన్ని వర్ణించేందుకు తప్పకుండా నోరు అవసరము. యోగానికైతే ఒకే ఒక మాట - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. చదువు కొరకైతే దేహము అవసరము. శరీరము లేకుండా ఎలా చదువుతారు, చదివిస్తారు?
తండ్రి పతితపావనులు. వారితో యోగము చేయాల్సి వస్తుంది కదా. కానీ యోగం చెయ్యడం ఎవ్వరికీ తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి నేర్పిస్తున్నారు. మనుష్యులు మనుష్యులకు ఎప్పుడూ నేర్పించలేరు. తండ్రియే చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. దీనినే పరమాత్మ జ్ఞానమని అంటారు. పరమాత్మ ఒక్కరే జ్ఞానసాగరులు. ఇవి బాగా అర్థము చేసుకునే విషయాలు. అందరికీ ఇదే చెప్పండి - అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఆ తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. నూతన ప్రపంచ స్థాపన జరుగుతోందని వారికి తెలియనే తెలియదు. అందుకే భగవంతుని స్మృతి చెయ్యరు. సంకల్పములోనే లేకుంటే, తెలియనే తెలియకుంటే, ఎందుకు చేస్తారు? పరమపిత పరమాత్మ ఒక్క శివభగవానుడే అని కూడా మీకు తెలుసు. బ్రహ్మ దేవతాయ నమ: అని అంటారు, తర్వాత శివ పరమాత్మాయ నమ: అని అంటారు. ఆ తండ్రే అత్యంత శ్రేష్ఠమైనవారు. కానీ వారెవరో కూడా తెలియదు. రాయి, రప్పలలో ఉంటే నమస్కారమెవరికి చేస్తున్నారు? అర్థ రహితంగా మాట్లాడ్తూ ఉంటారు. ఇక్కడ మీరు శబ్ధము నుండి దూరంగా వెళ్లాలి అనగా నిర్వాణధామము, శాంతిధామానికి వెళ్లాలి. శాంతిధామము, సుఖధామము అని అంటారు. అది స్వర్గ ధామము. నరకమును ధామమని అనరు. పదాలు చాలా సులభము. క్రైస్తవ ధర్మమెంత కాలము కొనసాగుతుందో కూడా వారికి తెలియదు. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము స్వర్గముండేదని కూడా అంటారు అనగా దేవీ దేవతల రాజ్యముండేది. ఆ తర్వాత 2 వేల సంవత్సరాలు క్రైస్తవ ధర్మము. ఇప్పుడు మళ్లీ దేవతా ధర్మము రావాలి కదా. మానవుల బుద్ధి ఏ మాత్రము పని చేయదు. డ్రామా రహస్యము తెలియని కారణంగా ఎన్నో ప్లాన్లు(ప్రణాళికలు) చేస్తూ ఉంటారు. ఈ విషయాలు పెద్ద వయస్సు గల(వృద్ధ) మాతలు అర్థము చేసుకోలేరు. ఇప్పుడు మీ అందరిదీ వానప్రస్థ స్థితి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. శబ్ధము నుండి దూరంగా వెళ్లాలి. వారు నిర్వాణధామానికి వెళ్లారని అంటారు. కానీ ఎవ్వరూ వెళ్లలేదు. పునర్జన్మ తప్పకుండా తీసుకోవాల్సిందే. వాపసు ఎవ్వరూ వెళ్ళలేరు. వానప్రస్థములోకి వెళ్లేందుకు వెళ్లుటకు గురువుల సాంగత్యము చేస్తారు. వానప్రస్థ ఆశ్రమాలు చాలా ఉన్నాయి. మాతలు కూడా చాలామంది ఉన్నారు. మీరు వెళ్లి అక్కడ కూడా సేవ చేయండి. వానప్రస్థమంటే ఏమో, మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు వానప్రస్థులు. ప్రపంచమంతా వానప్రస్థులే. ఇప్పుడు మానవులంతా వానప్రస్థులే. సర్వుల సద్గతిదాత సద్గురువు మాత్రమే. అందరూ వెళ్లే తీరాలి. మంచి పురుషార్థము చేసేవారు ఉన్నత పదవిని పొందుతారు. దీనిని కయామత్‌(వినాశ) సమయమని అంటారు. కయామత్‌ అర్థము కూడా వారికి తెలియదు. పిల్లలైన మీరు కూడా నెంబరువారుగా అర్థము చేసుకుంటారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ఇప్పుడు మనము తప్పనిసరిగా మన ఇంటికి వెళ్లాలని అందరూ అర్థం చేసుకోవాలి. ఆత్మలు శబ్ధానికి దూరంగా వెళ్లాలి. మళ్లీ పాత్రను చేయాల్సిందే. పాత్ర రిపీట్‌(పునరావృతము) అవుతుంది. కానీ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే ఉన్నత పదవి పొందుతారు. దైవీగుణాలు కూడా ధారణ చేయాలి. ఏ మురికి పని, దొంగతనము మొదలైనవి చేయరాదు. మీరు యోగము ద్వారా మాత్రమే పుణ్యాత్మలుగా అవుతారు, జ్ఞానముతో అవ్వరు. ఆత్మ పవిత్రంగా అవ్వాలి. శాంతిధామములోకి పవిత్రాత్మలు మాత్రమే వెళ్లగలవు. అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా మిగిలి ఉన్న ఆత్మలు ఇక్కడకు వస్తూ ఉంటాయి.
పిల్లలైన మీరు స్మృతియాత్రలో చాలా సమయముండాలి. ఇక్కడ మీకు మంచి సహయోగము లభిస్తుంది. పరస్పర సహాయము, బలము లభిస్తుంది కదా. పిల్లలైన మీరు కొంతమంది అయినా, మీ బలము పని చేస్తురది. గోవర్ధన పర్వతాన్ని వ్రేలితో ఎత్తినట్లు చూపిస్తారు కదా. మీరు గోప-గోపికలు కదా. సత్యయుగములోని దేవీ దేవతలను గోప-గోపికలని అనరు. మీరు మాత్రమే మీ వ్రేలిని (సహకారమును) ఇస్తారు. ఇనుప యుగమును బంగారు యుగముగా లేక నరకమును స్వర్గముగా చేసేందుకు మీరు ఒక్క తండ్రితో బుద్ధి యోగమును జోడిస్తారు. యోగము ద్వారానే పవిత్రంగా అవుతారు. ఈ విషయాలు మర్చిపోరాదు. ఈ శక్తి మీకిక్కడ లభిస్తుంది. బయటి ప్రపంచములో ఆసురీ మానవుల సాంగత్యముంటుంది. అక్కడ స్మృతి చేయడం చాలా కష్టము. ఇంత అచంచలంగా అక్కడ ఉండలేరు. సంగఠన అవసరము కదా. ఇక్కడ అందరూ కలిసి ఏకరసంగా కూర్చుంటారు. అందువలన సహాయము లభిస్తుంది. ఇక్కడ వృత్తి-వ్యాపారాలు, ఇతర పనులేవీ ఉండవు. బుద్ధి ఇక ఎక్కడికెెళ్తుంది? బయటి ప్రపంచములో వ్యాపారాలు, ఇల్లు మొదలైనవి తప్పకుండా తమ వైపుకు లాగుతాయి. ఇక్కడ ఇతరములేవీ లేవు. ఇచ్చట వాతావరణము చాలా శుద్ధంగా ఉంటుంది. డ్రామానుసారము మీరు చాలా దూరము వచ్చి కొండ పై కూర్చొని ఉన్నారు. ఖచ్చితమైన జ్ఞాపక చిహ్నాలు కూడా మీ ఎదురుగానే ఉన్నాయి. పై కప్పు పై స్వర్గమును చూపించారు(దిల్వాడా మందిరములో). అలా కాకుంటే ఇంకెక్కడ చూపించాలి? అందువలన బాబా అంటున్నారు - ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు స్వయాన్ని పరిశీలన(చెక్‌) చేసుకోండి. మేము బాబా స్మృతిలో ఉన్నామా? స్వదర్శన చక్రము కూడా(బుద్ధిలో) తిరుగుతూ ఉండాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ స్మృతి చార్టు పై పూర్తి గమనముంచాలి. ఎంత సమయము ఆ తండ్రిని స్మృతి చేస్తున్నామో, స్మృతి చేసే సమయములో బుద్ధి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉందో స్వయాన్ని పరిశీలించుకోవాలి.
2. ఈ కయామత్‌(చివరి జడ్జ్‌మెంట్‌) సమయములో శబ్ధము నుండి అతీతంగా వెళ్లే పురుషార్థము చేయాలి. తండ్రి స్మృతితో పాటు దైవీగుణాలు కూడా తప్పకుండా ధారణ చేయాలి. దొంగతనము మొదలైన మురికి పనులేవీ చేయరాదు.

వరదానము :- '' సదా సర్వ ప్రాప్తులతో నిండుగా ఉండే హర్షిత ముఖ్‌, హర్షిత చిత్‌ భవ ''
ఏదైనా దేవీ లేక దేవతామూర్తిని ఎప్పుడు తయారు చేసినా ఆ మూర్తిలో ముఖాన్ని సదా హర్షితంగా చూపిస్తారు. అనగా ఈ సమయంలో మీరు హర్షితముఖులుగా ఉన్నందున స్మృతిచిహ్న చిత్రాలలో కూడా చూపిస్తారు. హర్షితముఖులంటే సదా సర్వ ప్రాప్తులతో నిండుగా (భర్‌పూర్‌గా) ఉండేవారు. ఎవరైతే నిండుగా ఉంటారో వారే హర్షితంగా ఉండగలరు. ఒకవేళ ఏదైనా అప్రాప్తి ఉంటే హర్షితంగా ఉండరు. ఎంత హర్షితంగా ఉండేందుకు ప్రయత్నించినా, వారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ హృదయంతో కాదు. మీరు హృదయపూర్వకంగా నవ్వుతారు. ఎందుకంటే మీరు సర్వ ప్రాప్తులతో నిండుగా ఉండే హర్షితచిత్తులు.

స్లోగన్‌ :- '' పాస్‌ విత్‌ ఆనర్‌గా అవ్వాలంటే ప్రతి ఖజానా యొక్క జమ ఖాతా నిండుగా ఉండాలి. ''

No comments:

Post a Comment