Wednesday, October 9, 2019

Telugu Murli 10/10/2019

10-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - మీది బుద్ధి ద్వారా చేయు యాత్ర. దీనిని ఆత్మిక యాత్ర అని అంటారు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, శరీరమని అనుకోరు. శరీరమని భావించడమంటే తలక్రిందులుగా వ్రేలాడుట ''

ప్రశ్న :- మాయ ఆడంబరపు వైభవము ద్వారా మానవులకు ఎటువంటి గౌరవము లభిస్తుంది ?
జవాబు :- ఆసురీ(పైశాచిక) గౌరవము. మానవులు ఈ రోజు ఎవరిని గౌరవిస్తారో రేపు వారినే అవమానిస్తారు, నిందిస్తారు, తిడతారు. మాయ అందరినీ అవమానపరిచింది, పతితులుగా చేసేసింది. తండ్రి మిమ్ములను దైవీ గౌరవము గలవారిగా చేసేందుకు వచ్చారు.

ఓంశాంతి. ఆత్మల తండ్రి ఆత్మలను అడుగుతున్నారు - మీరు ఎక్కడ కూర్చుని ఉన్నారు? ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయములో అని మీరంటారు. ఆధ్యాత్మికత అనగా ఏమిటో వారికి తెలియనే తెలియదు. ప్రపంచములో అనేక విశ్వవిద్యాలయాలున్నాయి. మొత్తం ప్రపంచమంతటిలో ఇది ఒక్కటే ఈశ్వరీయ విశ్వ విద్యాలయము. చదివించేవారు ఒకే ఒక్కరు. ఏం చదివిస్తారు? ఆత్మిక జ్ఞానము. అందువలన ఇది స్పిరిచ్యువల్‌ విద్యాలయము అనగా ఆత్మిక పాఠశాల. స్పిరిచ్యువల్‌ అనగా ఆధ్యాత్మిక జ్ఞానము. చదివించే వారెవరు? ఇది కూడా పిల్లలైన మీకు ఇప్పుడే తెలిసింది. ఆత్మల తండ్రి ఒక్కరు మాత్రమే ఆత్మిక జ్ఞానమును చదివిస్తారు. అందుకే వారిని టీచరని కూడా అంటారు. స్పిరిచ్యువల్‌ ఫాదర్‌ చదివిస్తున్నారు. తర్వాత ఏమవుతుంది? ఈ ఆత్మిక జ్ఞానముతో మనము మన ఆదిసనాతన దేవీ దేవతా ధర్మమును స్థాపన చేస్తామని పిల్లలైన మీకు తెలుసు. ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. మిగిలిన ధర్మాలన్నీ నశిస్తాయి. ఈ స్పిరిచ్యువల్‌ జ్ఞానానికి ఇతర ధర్మాలన్నింటితో ఏ సంబంధముందో కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈ జ్ఞానము ద్వారానే ఏకధర్మ స్థాపన జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధికారులుగా ఉండేవారు కదా. దానిని ఆత్మిక ప్రపంచమని అంటారు. ఈ స్పిరిచువల్‌(ఆధ్యాత్మిక) జ్ఞానముతో మీరు రాజయోగము నేర్చుకుంటారు. రాజ్యము స్థాపనవుతుంది. అయితే ఇతర ధర్మాలతో ఏ సంబంధముంది? ఇతర ధర్మాలన్నీ వినాశమౌతాయి. మీరు పావనమౌతారు కనుక మీకు నూతన ప్రపంచము కావాలి. ఈ అనేక ధర్మాలన్నీ సమాప్తమై ఒకే ధర్మముంటుంది. దానినే విశ్వములో శాంతి రాజ్యమని అంటారు. ఇప్పుడిది పతిత అశాంతి రాజ్యము. మళ్లీ పావన శాంతి రాజ్యముంటుంది. ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. ఎంత అశాంతి ఉంది! అందరూ పతితులే పతితులు. ఇది రావణ రాజ్యము కదా. ఇప్పుడు 5 వికారాలు తప్పకుండా వదిలేయాలని పిల్లలైన మీకు తెలుసు. వీటిని వెంట తీసుకెళ్లరాదు. ఆత్మ మంచి లేక చెడు సంస్కారాలను తీసుకుపోతుంది కదా. ఇప్పుడు పవిత్రంగా అవ్వాలని పిల్లలైన మీకు తండ్రి తెలుపుచున్నారు. ఆ పావన ప్రపంచములో ఏ దు:ఖమూ ఉండదు. ఈ స్పిరిచ్యువల్‌ జ్ఞానము చదివించేదెవరు? స్పిరిచువల్‌ ఫాదర్‌, సర్వాత్మల తండ్రి. స్పిరిచువల్‌ ఫాదర్‌ ఏ చదువు చదివిస్తారు? స్పిరిచువల్‌ జ్ఞానము. దీనికి పుస్తకాలు మొదలైనవేవీ అవసరము లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. పావనంగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ అంతమతి సో గతి అవుతారు. ఇది స్మృతియాత్ర. యాత్ర అను పదము బాగుంది. అవి భౌతిక యాత్రలు, ఇది ఆత్మిక యాత్ర. ఆ యాత్రలలో నడిచి వెళ్లాలి, కాళ్లు, చేతులు కదిలించాలి. కానీ ఇందులో అవేవీ లేవు. కేవలం స్మృతి చేయాలి. ఎక్కడ తిరుగుతున్నా, నిలబడుతూ, కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇందులో ఏ కష్టమూ లేదు. కేవలం స్మృతి చేయాలి. ఇది నిజము కదా. ఇంతకుముందు మీరు తలక్రిందులుగా(ఉల్టాగా) నడిచేవారు అనగా ఆత్మకు బదులు శరీరమని భావించేవారు. స్వయాన్ని ఆత్మగా భావించడం సరియైనది(సుల్టా). అల్లా వచ్చినప్పుడు పావనంగా చేస్తారు. అల్లాది పావన ప్రపంచము. రావణునిది పతిత ప్రపంచము. దేహాభిమానము వలన అందరూ తలక్రిందులుగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి మాత్రమే దేహీ- అభిమానులుగా అవ్వాలి. అందువలన మీరిప్పుడు అల్లా(పరమాత్మ) పిల్లలు. అంతేగాని మీరెవ్వరూ అల్లా కాదు. నేను అల్లాను(అల్లాహ్‌ హూం) అని కాదు. వ్రేలితో ఎల్లప్పుడూ పైకే చూపిస్తారు. అందుకే వారు అల్లా అని ఋజువౌతుంది. కనుక వారు వేరుగా ఉన్నారు. మనము ఆ పరమాత్మ తండ్రికి పిల్లలము. మనమంతా సోదరులము. నేను అల్లాను అని అనడం వలన విరుద్ధమైపోతుంది. అందరమూ తండ్రులమే అయిపోతాము. కాని అలా కాదు. తండ్రి ఒక్కరు మాత్రమే. వారినే స్మృతి చేయాలి. అల్లా సదా పవిత్రులు. అల్లా స్వయంగా కూర్చుని చదివిస్తున్నారు. ఇంత చిన్న విషయములో మానవులు ఎంతో తికమకపడ్తున్నారు. శివజయంతి పండుగ కూడా జరుపుకుంటారు కదా.
కృష్ణునికి అటువంటి పదవిని ఇచ్చిందెవరు?- శివబాబా. శ్రీ కృష్ణుడు స్వర్గములోని మొట్టమొదటి రాకుమారుడు. అనంతమైన తండ్రి కృష్ణునికి రాజ్యభాగ్యమిస్తారు. తండ్రి స్థాపించే నూతన ప్రపంచములో శ్రీకృష్ణుడు నంబర్‌వన్‌ రాకుమారుడు. తండ్రి తన పిల్లలకు పవిత్రంగా అయ్యే యుక్త్తిని తెలుపుతున్నారు. వైకుంఠము, విష్ణుపురము అని దేనినంటున్నారో అదిప్పుడు లేదని, గతములో ఉండేదని మళ్లీ భవిష్యత్తులో వస్తుందని పిల్లలైన మీకు తెలుసు. గతించినది భవిష్యత్తుగా మారుతుంది. చక్రము తిరుగుతూనే ఉంటుంది కదా. ఈ జ్ఞానము ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. ఇది ధారణ చేసి ఇతరులచే ధారణ చేయించాలి. ప్రతి ఒక్కరు టీచరుగా అవ్వాలి. టీచరుగా అయిన వెంటనే లక్ష్మి-నారాయణులుగా అయిపోతారని కాదు. కానీ టీచరుగా అయినందున ప్రజలను తయారుచేస్తారు. ఎంత ఎక్కువ మందికి కళ్యాణము చేస్తారో అంత ఉన్నతపదవి పొందుతారు. స్మృతి కూడా ఉంటుంది. తండ్రి చెప్తున్నారు - రైలులో వస్తున్నా బ్యాడ్జి ద్వారా అర్థం చేయించండి. ఆ తండ్రి పతితపావనులు, ముక్తినిచ్చేవారు, పావనంగా చేసేవారు. భక్తిలో చాలామందిని స్మృతి చేయాల్సి వస్తుంది. జంతువులైన ఏనుగు, గుఱ్ఱము, తాబేలు, చేపను కూడా అవతారాలు అనేశారు. వాటిని కూడా పూజిస్తూ ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపి అనగా అందరిలో ఉన్నారని భావిస్తారు. అన్నిటికీ తినిపించండి, మంచిదే. కణకణములో భగవంతుడున్నారని అంటారు మరి అలాగైతే వారికి ఎలా తినిపిస్తారు! పూర్తి తెలివిహీనులుగా ఉన్నారు. లక్ష్మీనారాయణులు మొదలైన దేవీదేవతలు చీమలకు ఆహారమిచ్చే పని, ఫలానా వారికి ఆహారమిచ్చే పని చేయరు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు ధార్మిక, రాజకీయ సంబంధము గలవారు. నేను ధర్మస్థాపన చేస్తున్నానని మీకు తెలుసు. రాజ్యస్థాపన కొరకు సైన్యము ఉంటుంది. కానీ మీరు గుప్తమైనవారు. మీది స్పిరిచ్యువల్‌ యూనివర్సిటి. ప్రపంచములోని మానవ మాత్రులందరూ ఈ ధర్మములన్నీ వదిలి తమ ఇంటికి వెళ్తారు. ఆత్మలన్నీ వెళ్లిపోతాయి. అది ఆత్మలు నివసించు ఇల్లు. ఇప్పుడు మీరు సంగమ యుగములో చదువుచున్నారు. తర్వాత సత్యయుగములోకి వచ్చి రాజ్యపాలన చేస్తారు. ఇతర ధర్మమేదీ ఉండదు. గీతలో కూడా ఉంది కదా - బాబా మీరిచ్చేది మరెవ్వరూ ఇవ్వలేరు. ఈ మొత్తం భూమ్యాకాశాలు మీవిగా ఉన్నాయి. ఈ మొత్తం విశ్వానికి మీరు అధికారులుగా అవుతారు. ఈ విషయాలన్నీ మర్చిపోతారు. దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు. మనము ప్రతి 5 వేల సంవత్సారాల తర్వాత రాజ్యము తీసుకుంటామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఆ తర్వాత పోగొట్టుకుంటారు. ఈ 84 జన్మల చక్రము తిరుగుతూనే ఉంటుంది. కావున ఈ చదువు చదివే తీరాలి. అప్పుడు మాత్రమే వెళ్లగలరు. చదవకపోతే నూతన ప్రపంచములోకిి వెళ్లలేరు. అక్కడ జనులు పరిమిత సంఖ్య.లో ఉంటారు. అక్కడకెళ్లి నంబరువారు పురుషార్థానుసారము పదవిని పొందుతారు. అందరూ చదువుకోరు. అందరూ చదువుకుంటే మరుసటి జన్మలో రాజ్యము కూడా పొందాలి కదా. చదువుకునే వారి సంఖ్య కూడా పరిమితముగా ఉంటుంది. సత్య-త్రేతా యుగాలలో వచ్చువారే చదువుకుంటారు. మీకు చాలామంది ప్రజలు తయారవుతూ ఉంటారు. ఆలస్యంగా వచ్చువారు పాపాలను భస్మము చేసుకోలేరు. పాపాత్మలైతే శిక్షలననుభవించి చాలా చిన్న పదవిని పొందుతారు. అవమానము పాలౌతారు. ఇప్పుడు మాయ ద్వారా పెద్ద గౌరవము పొందువారు, అవమానము పాలవుతారు. ఇది ఈశ్వరీయ గౌరవము, అది ఆసురీ గౌరవము. రెండిటికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. మనము ఆసురీ గౌరవము గలవారిగా ఉండేవారము. ఇప్పుడు మళ్లీ దైవీ గౌరవము గలవారిగా అవుతాము. ఆసురీ గౌరవము ద్వారా పూర్తి భికారిగా అవుతారు. ఇది ముళ్ల ప్రపంచము అనగా అగౌరవము కదా. మళ్లీ ఇంత గొప్ప గౌరవము గలవారిగా అవుతారు. యథా రాజా-రాణి తథా ప్రజ. అనంతమైన తండ్రి మీ గౌరవాన్ని చాలా ఉన్నతంగా చేస్తారు. అయితే అంత పురుషార్థము కూడా చేయాలి. మనము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవ్వాలి. నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యేటంత గౌరవాన్ని సంపాదించుకోవాలని అందరూ అంటారు. ఇంతకంటే ఉన్నత గౌరవము ఎవ్వరికీ లేదు. నరుని నుండి నారాయణునిగా అయ్యే కథనే వింటారు. అమరకథ, తీజరీకథ అంతా ఒక్కటే. ఈ కథ ఇప్పుడు మాత్రమే మీరు వింటారు.
పిల్లలైన మీరు విశ్వాధికారులుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకొని క్రిందకు దిగుతూ వచ్చారు. మళ్లీ మొదటి నంబరు జన్మ జరుగుతుంది. మొదటి నంబరు జన్మలో మీరు చాలా ఉన్నత పదవి పొందుతారు. రాముడు మనలను గౌరవనీయులుగా చేస్తాడు. రావణుడు అగౌరవము కలుగజేస్తాడు. ఈ జ్ఞానము ద్వారానే మీరు ముక్తి-జీవన్ముక్తిని పొందుతారు. అర్ధకల్పము రావణుని పేరే ఉండదు. ఈ విషయాలు ఇప్పుడు మీ బుద్ధిలోకి వస్తున్నాయి. అది కూడా నంబరువారుగా మీ బుద్ధిలో కూర్చుంటుంది. కల్ప-కల్పము ఇదే విధంగా మీరు నంబరువారు పురుషార్థానుసారము తెలివిగలవారిగా అవుతారు. మాయ నిర్లక్ష్యము చేయిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేయడమే మర్చిపోతారు. భగవంతుడు చదివిస్తున్నారు. వారు మన టీచరుగా ఉన్నారు. అయినా ఆబ్సెంట్‌ అవుతారు, చదవరు. గడపగడప(అడుగడుగులో) వద్ద మోసపోయేందుకు అలవాటు పడ్డారు. చదువు పై ఎవరికి ధ్యాస ఉండదో వారిని కూలి పనికి పంపుతారు. చాకలి పని, మంగలి పని మొదలైనవి చేస్తారు. వీటికి చదువు అవసరము లేదు. వ్యాపారములో మనుష్యులు కోటీశ్వరులుగా అవుతారు. నౌకరీలో నిశ్చితమైన జీతము లభిస్తుంది. ఈ విశ్వమంతటికీ చక్రవర్తిగా అయ్యేందుకు మీ చదువు ఉపయోగపడ్తుంది. మేము భారతీయులమని అంటారు కదా. మీరు విశ్వానికి అధికారులమని చివరిలో అంటారు. అక్కడ దేవీదేవతా ధర్మము తప్ప ఇతర ధర్మమేదీ ఉండదు. తండ్రి విశ్వాధికారులుగా చేస్తూ ఉంటే వారి సలహాను అనుసరించాలి. వికారమనే భూతమేదీ ఉండరాదు. ఈ భూతము చాలా చెడ్డది. కాముకుని ఆరోగ్యము చెడిపోతూ ఉంటుంది. శక్తి తగ్గిపోతూ వస్తుంది. ఈ కామవికారము మీ శక్తిని పూర్తిగా సమాప్తము చేస్తుంది. ఫలితము - ఆయువు తగ్గిపోతూ వచ్చింది. భోగులుగా అయ్యారు. కాముకులు, భోగులు, రోగులుగా(కామి-భోగి-రోగిగా) అయిపోతారు. అక్కడ వికారమే ఉండదు. యోగులు సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆయువు 150 సంవత్సరాలుంటుంది. అక్కడ మృత్యువు కబళించదు. దీని పై ఒక కథ కూడా చెప్తూ ఉంటారు - మొదట సుఖము అనుభవిస్తావా, దు:ఖమనుభవిస్తావా? అని అడిగితే అప్పుడు ఎవరో ముందు సుఖమునే అనుభవిస్తానని చెప్పమని సైగ చేశారు. ఎందుకంటే మృత్యువు అక్కడకు రాలేదు, లోపలకు కూడా రాలేదు. ఇది ఒక కథగా చేశారు. మీరు సుఖధామములో ఉన్నప్పుడు అక్కడ మృత్యువు ఉండదు. అచ్చట రావణ రాజ్యమే లేదు. వికారులుగా అయినప్పుడు మృత్యువు వస్తుంది. దీని పై అనేక కథలు వ్రాసేశారు. కాలుడు తీసుకెళ్లాడు, ఫలానా జరిగింది, అది జరిగింది అని వ్రాసేశారు. మృత్యువు కనిపించదు, ఆత్మ కనిపించదు. వీటిని పుక్కిటి పురాణాలు అని అంటారు. చెవికి ఇంపుగా ఉండే కథలు అనేకమున్నాయి. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - అచ్చట అకాలమృత్యువే ఉండదు, దీర్ఘాయువు ఉంటుంది. పవిత్రంగా ఉంటారు. 16 కళలుంటాయి తర్వాత కళలు తగ్గుతూ తగ్గుతూ కళలే లేకుండా అయిపోతాయి. నేను నిర్గుణుడను, నాలో ఏ గుణాలు లేవు అని అంటారు. నిర్గుణ సంస్థ అని ఒక పిల్లల సంస్థ ఉంది. మాలో ఏ గుణాలూ లేవు అని అంటారు. మమ్ములను గుణవంతులుగా తయారు చేయండి, సర్వ గుణ సంపన్నులుగా చేయండని అంటారు. ఇప్పుడు పవిత్రులుగా అవ్వండని తండ్రి చెప్తున్నారు. అందరూ మరణించాల్సిందే......... ఇంతమంది మనుష్యులు సత్యయుగములో ఉండరు. ఇప్పుడు అనేకమంది ఉన్నారు. అచ్చట పిల్లలు కూడా యోగబలము ద్వారా జన్మిస్తారు. ఇచ్చట చాలామందికి జన్మనిస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు - తండ్రిని స్మృతి చేయండి. ఆ తండ్రే చదివిస్తారు. చదివించే టీచరు గుర్తుకొస్తారు. శివబాబా మనలను చదివిస్తున్నారని మీకు తెలుసు. ఏం చదివిస్తున్నారో కూడా మీకు తెలుసు. కావున తండ్రి లేక టీచరుతో యోగము చేయండి. ఇది చాలా ఉన్నతమైన జ్ఞానము. ఇప్పుడు మీ అందరిదీ విద్యార్థి జీవితము. ఇటువంటి విశ్వవిద్యాలయమును ఎప్పుడైనా చూశారా? - ముసలివారు, పిల్లలు, యువకులు అందరూ కలిసి కూర్చుని చదువుకుంటున్నారు. పాఠశాల ఒక్కటే, చదివించే టీచరు ఒక్కరే, అంతేకాక స్వయం బ్రహ్మయే స్వయంగా చదువుకుంటున్నాడు, అద్భుతము కదా. శివబాబా మిమ్ములను చదివిస్తున్నారు. ఈ బ్రహ్మ కూడా వింటున్నాడు.
చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు ఎవరైనా చదువుకోవచ్చు. మీరు కూడా ఈ జ్ఞానము చదువుకుంటున్నారు కదా. ఇప్పుడు చదివించడం కూడా ప్రారంభము చేశారు. రోజులు గడిచే కొలది సమయము తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు మీరు బేహద్‌లోకి వెళ్లిపోయారు. ఈ 5 వేల సంవత్సరాల చక్రము ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. మొదట ఒకే ధర్మముండేది. ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. ఇప్పుడు సార్వభౌమత్వము లేదు. ఇది ప్రజల పై ప్రజారాజ్యము. మొట్టమొదట చాలా శక్తిశాలి ధర్మముండేది. విశ్వమంతటికీ అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు అధర్మయుక్తమై పోయారు. ఏ ధర్మమూ లేదు. అందరిలోనూ 5 వికారాలు ప్రవేశమై ఉన్నాయి. అనంతమైన తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, ఓపిక పట్టండి. ఇక కొంత సమయము మాత్రమే ఈ రావణ రాజ్యములో ఉంటారు. బాగా చదువుకుంటే మళ్లీ సుఖధామములోకి తీసుకెళ్తాను. ఇది దు:ఖధామము. మిమ్ములను మీ శాంతిధామానికి, సుఖధామానికి తీసుకెళ్తాను. ఇది దు:ఖధామము. మీరు శాంతిధామమును, సుఖధామమును స్మృతి చేయండి. ఈ దు:ఖధామమును మర్చిపోతూ వెళ్లండి. ఆత్మల తండ్రి - ''ఓ ఆత్మిక పిల్లలారా!'' అంటూ ఆదేశమునిస్తారు. ఆత్మిక పిల్లలు, ఈ అవయవాల ద్వారా విన్నారు. ఆత్మలైన మీరు సత్యయుగములో ఉన్నప్పుడు సతోప్రధానంగా ఉండేవారు. అప్పుడు మీ శరీరాలు కూడా ఫస్ట్‌క్లాస్‌ సతోప్రధానంగా ఉండేవి. మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ ఎలా అయిపోయారు! రాత్రికి, పగలుకున్నంత తేడా ఉంది. పగలు మనము స్వర్గములో ఉన్నాము, రాత్రి నరకములో ఉన్నాము. దీనినే బ్రహ్మ వలె బ్రాహ్మణులకు పగలు, బ్రాహ్మణులకు రాత్రి అని అంటారు. 63 జన్మలు మోసపోతూ ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు. అంధకారపు రాత్రి కదా. దిక్కుతోచక వెతుకుతూ ఉంటారు. భగవంతుడు ఎవ్వరికీ లభించరు. దీనినే భూల్‌ - భులయ్యా (మరచి, మరపించు) ఆట అని అంటారు. కావున తండ్రి ఈ సృష్టి ఆదిమధ్యాంతాల సమాచారమంతా వినిపిస్తున్నారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. గడప గడప(అడుగడుగునా) వద్ద ఎదురుదెబ్బలు తినే అలవాటు వదిలి భగవంతుని చదువును గమనముంచి శ్రద్ధగా చదవాలి. ఎప్పుడూ ఆబ్సెంటు(గైర్హాజరు) అవ్వరాదు. తండ్రి సమానం టీచరుగా కూడా అవ్వాలి. చదవాలి, చదివించాలి.
2. సత్యనారాయణ సత్యమైన కథను విని నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. ఇటువంటి గౌరవనీయులుగా స్వయం నీకు నీవే తయారవ్వాలి. ఎప్పుడూ భూతాలకు వశీభూతమై గౌరవాన్ని పోగొట్టుకోరాదు.

వరదానము :- '' గతించిన విషయాలను లేక వృత్తులను సమాప్తం చేసి సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకునే స్వచ్ఛ ఆత్మా భవ ''
సేవలో స్వచ్ఛమైన బుద్ధి, స్వచ్ఛమైన వృత్తి, స్వచ్ఛమైన కర్మలు సఫలతకు సహజమైన ఆధారము. సేవకు సంబంధించిన ఏ కార్యమునైనా ప్రారంభించునప్పుడు మొదట బుద్ధిలో ఆ ఆత్మలకు సంబంధించిన, గతించిపోయిన ఏ విషయాలూ గుర్తు లేవు కదా అని చెక్‌ చేసుకోండి. అదే వృత్తి, దృష్టితో వారిని చూడడం, వారితో మాట్లాడడం........... వీటి ద్వారా సంపూర్ణ సఫలత కలగజాలదు. అందువలన గతించిన విషయాలను లేక వృత్తులను సమాప్తం చేసి స్వచ్ఛమైన ఆత్మలుగా అవ్వండి. అప్పుడే సంపూర్ణ సఫలత ప్రాప్తిస్తుంది.

స్లోగన్‌ :- '' ఎవరైతే స్వ పరివర్తన చేసుకుంటారో, వారి మెడలోనే విజయమాల పడ్తుంది ''

No comments:

Post a Comment